మాకు ఎలాంటి సంబంధం లేదు! కస్టమర్లకు SBI హెచ్చరిక
ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తన కస్టమర్లకు ఫేక్ లోన్స్కు సంబంధించి హెచ్చరికలు జారీ చేసింది. ఎస్బీఐ లోన్ ఫైనాన్స్ లిమిటెడ్, ఇతర ఎంటిటీల పేరుతో మోసం చేస్తున్నట్లు తెలిపింది. ఇలాంటి ఎన్నో సంస్థలు తమ కస్టమర్లను మోసం చేయడానికి నకిలీ రుణ ఆఫర్లను ఇస్తున్నాయని బ్యాంకు తెలిపింది. 'బీవేర్ ఎస్బీఐ కస్టమర్లు' అంటూ కస్టమర్లను హెచ్చరిస్తూ ఓ ట్వీట్ చేసింది.
కస్టమర్లు జాగ్రత్త
'కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలి. ఎస్బీఐ లోన్ ఫైనాన్స్ లిమిటెడ్ లేదా అలాంటి ఇతర సంస్థలు రుణం కోసం మిమ్మల్ని సంప్రదిస్తే మీరు గమనించాల్సిన అంశం ఏమంటే.. దీంతో ఎస్బీఐకి ఎలాంటి సంబంధం లేదు. వారు ఫేక్ లోన్స్ ఆఫర్ చేస్తున్నారు. ఫ్రాడ్ చేస్తున్నందున అప్రమత్తంగా ఉండాలి' అని ఎస్బీఐ మంగళవారం ట్వీట్ చేసింది.
మా దృష్టికి వచ్చింది
కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఎస్బీఐ లోన్ ఫైనాన్స్ లిమిటెడ్ లేదా అలాంటి సంస్థల పేరుతో రుణాల పేరుతో సాధారణ ప్రజలను లేదా కస్టమర్లను మోసం చేస్తున్నాయన తమ దృష్టికి వచ్చిందని ఎస్బీఐ తన ప్రకటనలో తెలిపింది. ఎస్బీఐ లోన్ ఫైనాన్స్తో తమకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది.
సమీపంలోని బ్యాంకును సంప్రదించాలి
ఎస్బీఐ కస్టమర్లకు ఎవరికైనా రుణాలు కావాల్సి వస్తే నేరుగా సమీపంలోని బ్రాంచీకి వెళ్లాలని సూచించింది. యోనో యాప్ ద్వారా కూడా రుణం పొందవచ్చు. కానీ మీడియేటర్లను ఎంకరేజ్ చేయవద్దని సూచించింది. కాగా, ఇటీవల బ్యాంకు లోన్ పేరుతో ఫ్రాడ్స్ పెరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వివిధ బ్యాంకులు తమ కస్టమర్లకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.