ఎస్బీఐ అలర్ట్: మీరు ఇలా చేయకుంటే క్రెడిట్, డెబిట్ కార్డు, ఏటీఎం ట్రాన్సాక్షన్స్ నిలిచిపోవచ్చు!
ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తమ కస్టమర్లకు మరో డెడ్ లైన్ ఇచ్చింది. మార్చి 31వ తేదీ లోపు కస్టమర్లు పాన్ నెంబర్ను ఆధార్ నెంబర్తో లింక్ చేయాలని సూచించింది. గడువులోగా పాన్-ఆధార్ లింక్ చేస్తేనే ఆ తర్వాత బ్యాంక్ సేవలను పొందవచ్చునని తెలిపింది. మీ బ్యాంకింగ్ సేవల పైన ప్రభావం పడకుండా ఉండేందుకు అవసరమైన ఈ పనిని సకాలంలో పూర్తి చేయాలని తెలిపింది. లేదంటే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఏటీఎం ఉపసంహరణ సహా వివిధ సవలు నిలిచిపోయే అవకాశం ఉంది.
'బ్యాంకింగ్ సేవలో అసౌకర్యాన్ని నిరోధించేందుకు, ఇబ్బందులు లేని సేవలను ఆస్వాదించేందుకు కస్టమర్లు పాన్-ఆధార్ లింక్ చేయాలని మేం సూచిస్తున్నాం' అని భారత అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి మొదటి వారంలో ఒక ట్వీట్ చేసింది. 'లింక్ చేయకపోతే పాన్ పని చేయదు లేదా క్రియారహితంగా మార్చబడుతుంది. అలాగే, నిర్దిష్ట ట్రాన్సాక్షన్స్ నిర్వహణకు ఉపయోగపడదు' అని పేర్కొంది.
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139ఏఏ ప్రకారం ఆధార్-పాన్ కార్డును మార్చి 31, 2022లోపు లింక్ చేయడం తప్పనిసరి. మీరు ఎస్బీఐ కార్డ్కు అందించిన పాన్ పైన పేర్కొన్న తేదీలోపు మీ ఆధార్ నెంబర్కు లింక్ చేయకుంటే 1 ఏప్రిల్ 2022 నుండి ఇన్-ఆపరేటివ్గా మారుతుంది.