హోమ్ లోన్, కారు లోన్ తీసుకునే వారికి ఆర్బీఐ షాక్, EMI భారం: వారికి మాత్రం గుడ్న్యూస్
2018 ఆగస్ట్ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) బుధ వారం (మే 4, 2022) మొదటిసారి రెపో రేటును పెంచింది. కరోనా కారణంగా 2020లో వడ్డీ రేట్లను దశాబ్దం కనిష్టం 4 శాతానికి తగ్గించింది కేంద్ర బ్యాంకు. ఏడాదిన్నరగా వడ్డీ రేటును ఇలాగే కొనసాగించింది. ఇప్పుడు ఆర్థిక రికవరీ నేపథ్యంలో ఆర్బీఐ రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచి, 4.40 శాతానికి తీసుకువచ్చింది. ద్రవ్యోల్భణాన్ని అరికట్టేందుకు ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ అత్యవసరంగా సమావేశమైంది. రెపో రేటును పెంచాలని నిర్ణయించింది. దీంతో బ్యాంకుల నుండి రుణాలు తీసుకునే వారికి వడ్డీ రేటు పెరగనుంది. అదే సమయంలో బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసే వారికి వడ్డీ రేటు పెరిగి ప్రయోజనం అవుతుంది.
క్యాష్ రిజర్వ్ రేషియోను (సీఆర్ఆర్) 50 బేసిస్ పాయింట్లు పెంచడంతో 4.5 శాతానికి చేరుకుంది. రెపో రేటు తక్షణమే అమలులోకి వచ్చింది. సీఆర్ఆర్ మాత్రం మే 21వ తేదీ నుండి అమలులోకి వస్తుంది. కీలక వడ్డీ రేట్లను సవరించిన నేపథ్యంలో హోమ్ లోన్, కారు లోన్ తదితర రుణాలు తీసుకునే వారికి ఈఎంఐ భారం కానుంది.
రెపో రేటు అంటే రీపర్చేజింగ్ ఆప్షన్ లేదా రీపర్చేజింగ్ అగ్రిమెంట్. రెపో రేటు అనేది బ్యాంకులు ఆర్బీఐ నుండి రుణం తీసుకునే రేటును సూచిస్తాయి. ద్రవ్యోల్భణాన్ని అదుపులో ఉంచడానికి ఆర్బీఐ కీలక సాధనాల్లో రెపో రేటు ఒకటిగా పరిగణిస్తారు.
రెపో రేటును తగ్గిస్తే వాణిజ్య బ్యాంకుల రుణ ఖర్చు తగ్గుతుంది. అప్పుడు బ్యాంకులు కూడా రుణాలపై తక్కువ వడ్డీ రేటును అందిస్తాయి. కరోనా సమయంలో ఆర్బీఐ రెపో రేటు తగ్గించడంతో బ్యాంకులు హోమ్ లోన్, వెహికిల్ లోన్ వడ్డీ రేట్లను తగ్గించాయి. అయితే ఇప్పుడు ఆర్బీఐ రెపో రేటును పెంచడంతో బ్యాంకులు హోమ్ లోన్, వెహికిల్ లోన్, ఇతరాలపై వడ్డీ రేట్లను పెంచవచ్చు. బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచితే నెలవారీ ఈఎంఐ పెరుగుతుంది. ఇది రుణ గ్రహీతలపై ప్రభావం చూపుతుంది. అదే సమయంలో ఆర్బీఐ రెపో రేటును పెంచడం వల్ల సేవింగ్స్ ఖాతా, ఫిక్స్డ్ డిపాజిట్స్ ద్వారా తమ డబ్బును బ్యాంకుల్లో డిపాజిట్ చేసే వారికి వడ్డీ రేటు పెరగవచ్చు.