ఈపీఎఫ్ వడ్డీ రేటు తగ్గించినా.. ఈ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేటు స్థిరంగా
చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ఇస్తున్న వడ్డీలో ప్రభుత్వం ఎలాంటి మార్పు చేయలేదు. ఈపీఎఫ్ వడ్డీ రేటును ప్రభుత్వం 8.5 శాతం నుండి 8.1 శాతానికి తగ్గించింది. ఇది 43 ఏళ్ల కనిష్టం. ఈపీఎఫ్ వడ్డీ రేటు తగ్గిన నేపథ్యంలో ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు కూడా తగ్గుతాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులేదు.
ప్రస్తుతం కొనసాగుతున్న వడ్డీనే 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి అంటే ఏప్రిల్-జూన్ కాలానికి వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), కిసాన్ వికాస్ పత్ర(KVP), సుకన్య సమృద్ధి యోజన (SSY) వంటి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ప్రతి మూడు నెలలకు ఓసారి కేంద్రం వడ్డీని నిర్ణయిస్తుంది.
గత ఎనిమిది త్రైమాసికాలుగా కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేటును సవరించలేదు. కరోనా కారణంగా సవరణకు దూరంగా ఉంది. అయితే ఈసారి ఈపీఎఫ్ వడ్డీ రేట్లను తగ్గించిన నేపథ్యంలో చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు కూడా తగ్గుతాయని భావించినప్పటికీ, తొమ్మిదోసారి కూడా కేంద్రం స్థిరంగా కొనసాగించింది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ పైన 6.8 శాతం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పైన 7.1 శాతం, కిసాన్ వికాస్ పత్ర పైన 6.9 శాతం, సుకన్య సమృద్ధి యోజన పైన 7.6 శాతం వడ్డీ రేటు అందిస్తోంది.