ఇక్కడ పెట్టుబడి పెడితే నెలకు రూ.4,950 రాబడి, ఆ వడ్డీ తీసుకోకుంటే మాత్రం...
పోస్టాఫీస్ పథకాలు సురక్షితమైనవి. మీ డబ్బు సురక్షితంగా ఉండటంతో పాటు కచ్చితమైన రిటర్న్స్, ఇతర ఎన్నో పథకాలతో పోలిస్తే ఎక్కువ ప్రయోజనాలు అందించే పోస్టాఫీస్ స్కీమ్స్ ఉన్నాయి. ఇలాంటి పథకాల్లో ఒకటి పోస్టాఫీస్ మంత్లీ ఇన్కం ప్లాన్(MIPs). ఇది నిర్ణీత సమయంలో మంచి రిటర్న్స్ ఇస్తుంది. ఇందులో ముఖ్యమైన ప్రయోజనం పెట్టుబడి పెట్టిన మొదటి నెల నుండి ఈ పథకం ద్వారా వడ్డీని పొందవచ్చు. అసలు మాత్రం అలాగే ఉంటుంది. అలాగే ప్రతి సంవత్సరం వడ్డీ జత కలుస్తుంది.
ప్రతి నెల ఆదాయం
ఎవరైనా జాయింట్ అకౌంట్ ద్వారా ఈ పథకంలో రూ.9 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 6.6 శాతం వడ్డీ చొప్పున నెలకు రూ.4,950 పొందవచ్చు. ఏడాదికి మొత్తం రూ.59,400 వస్తుంది. వ్యక్తులు సింగిల్గా అయితే రూ.4.5 లక్షల వరకు, ఉమ్మడిగా రూ.9 లక్షల వరకు పెట్టుబడికి అనుమతి ఉంది. రూ.4,950 వడ్డీ మొత్తాన్ని ప్రతి నెల ఏ నెలకు ఆ నెల ఉపసంహరించుకోవచ్చు.
ఈ విధంగా అసలు మొత్తం ప్రభావితం కాకుండా వడ్డీతో ప్రతి నెల ఆదాయం పొందవచ్చు. అసలు మొత్తాన్ని మెచ్యూరిటి సమయంలో ఉపసంహరించుకోవచ్చు. ఈ పథకంలో చిన్న మొత్తాలను కూడా పెట్టుబడి పెట్టవచ్చు. కనీసం రూ.1,500తో ఈ పథకాన్ని ప్రారంభించుకోవచ్చు.
వడ్డీకి అదనంగా జమ అవ్వదు
ఇది ప్రభుత్వ హామీ కలిగిన పథకం. కాబట్టి మెచ్యూరిటి వరకు మీరు డిపాజిట్ చేసిన మొత్తం సురక్షితంగా ఉంటుంది. ఈ పథకానికి అయిదు సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. మెచ్యూరిటీ సమయంలో పెట్టుబడి మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. లేదంటే తిరిగి పెట్టుబడిగా పెట్టవచ్చు.
కాలపరిమితి ముగిసిన తరువాత ఉపసంహరించుకుంటే వారు పూర్తి వివరాలతో నింపిన ఫామ్తోపాటు, ఎంఐఎస్ పాస్బుక్ను పోస్టాఫీస్లో ఇవ్వాలి. ఈ పథకంపై ప్రస్తుతం వడ్డీ రేటు 6.6 శాతంగా ఉంది. పెట్టుబడి పెట్టిన రోజు నుండి నెల నెల వడ్డీ వస్తుంది. ఈ వడ్డీని పోస్టాఫీస్ నుండి నేరుగా తీసుకోవచ్చు. లేదా ఇతర బ్యాంకు ఖాతాకు మళ్లించుకోవచ్చు.వడ్డీ సొమ్మును ఉపసంహరించుకోకుంటే దానిపై అదనంగా వడ్డీ జమ కాదనే విషయం గుర్తుంచుకోవాలి.
ఎన్ని అయినా...
ఖాతాను నగదు/చెక్ ద్వారా చెల్లించి ప్రారంభించవచ్చు. పూర్తి వివరాలతో నింపిన ఎంఐఎస్ ఫామ్తో పాటు సంబంధిత చిరునామా, గుర్తింపు పత్రాలు, రెండు ఫొటోలు ఏదైనా పోస్టాఫీస్లో సమర్పించాలి. ముందే ఖాతా కలిగిన వ్యక్తి పరిచయ సంతకం అవసరం అవుతుంది. ఓ ఖాతాదారు ఎన్ని ఎంఐఎస్ ఖాతాలను అయినా తెరిచే అవకాశముంది. అయితే అన్ని ఖాతాల మొత్తం రూ.4.5 లక్షలకు మించరాదు. నెలవారీ ఆదాయ పథకం ఖాతాకు పాస్బుక్ అందిస్తారు.