Kisan Vikas Patra: కిసాన్ వికాస్ పత్రలో పదేళ్లలో మీ డబ్బు రెట్టింపు
సురక్షిత పెట్టుబడికి పోస్టాఫీస్ స్కీం అద్భుతమైన ఎంపిక. వడ్డీ రేటు తక్కువగా ఉన్నప్పటికీ భద్రమైన పెట్టుబడి కోసం, రిస్క్ తీసుకోవడం పెద్దగా ఇష్టపడని చాలామంది దీనిని ఎంచుకుంటారు. పోస్టాఫీస్ స్కీం ద్వారా గ్యారెంటీ రిటర్న్స్ ఉంటాయి. ఇలాంటి పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీంలలో కిసాన్ వికాస్ పత్ర ఒకటి. ఈ స్కీంలో ఇన్వెస్ట్ చేస్తే 124 నెలలు లేదా 10 సంవత్సరాల్లో మీ డబ్బు రెండింతలు అవుతుంది. ఏప్రిల్ 1, 2020 నుండి ఈ పథకానికి సంబంధించి వడ్డీ రేటు 6.9 శాతంగా ఉంది. కనీసం రూ.1000తో పెట్టుబడులు ప్రారంభించవచ్చు. గరిష్ట పరిమితి లేదు. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ కిసాన్ వికాస పత్ర ఖాతాలు తెరుచుకోవచ్చు. ఒక వ్యక్తి మరొకరికి కేవీపీ పత్రాలను బదలీ చేసుకోవచ్చు. రుణం ఇస్తారు. ఇందుకు కేవీపీ తీసుకున్న వ్యక్తి సంబంధిత పోస్టాఫీస్కు అంగీకార పత్రంతో కూడిన దరఖాస్తు ఫామ్ను ఇవ్వాలి. ఒక పోస్టాఫీస్ నుండి మరో పోస్టాఫీస్కు బదలీ చేసుకోవచ్చు. మెచ్యూరిటీ తేదీని సర్టిఫికెట్లో ముద్రిస్తారు.
అకౌంట్ ఓపెనింగ్
KVP పథకంలో పెట్టుబడికి కనీస వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు. వ్యక్తిగతంగా లేదా ఉమ్మడిగా ఖాతా ఓపెన్ చేయవచ్చు. గరిష్టంగా ముగ్గురు పెద్దలు ఉమ్మడి ఖాతాను తెరుచుకోవచ్చు. పదేళ్లు నిండిన పిల్లల పేరుతో మైనర్ ఖాతాను తెరువవచ్చు. పిల్లల తరపున తల్లిదండ్రులు లేదా గార్డియన్ అకౌంట్ తెరవాల్సి ఉంటుంది. నామినీని ఏర్పాటు చేసే వెసులుబాటు ఉంది. ఖాతా తెరిచేందుకు, దరఖాస్తు ఫాంతో పాటు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్లో ఏదైనా గుర్తింపు పత్రాన్ని ఇవ్వాలి. అకౌంట్ తెరిచిన రెండున్నర సంవత్సరాల తర్వాత షరతులకు లోబడి ముందస్తు ఉపసంహరణకు అనుమతిస్తారు.
వడ్డీ రేటు నిర్ణయం
ఈ స్కీం వడ్డీరేటును కేంద్రం నిర్ణయిస్తుంది. ప్రతి మూడు నెలలకు ఓసారి వడ్డీ రేటును సవరిస్తుంది. అకౌంట్ తెరిచే సమయంలో ఉన్న వడ్డీరేటు కాలపరిమితి మొత్తానికి వర్తిస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి కిసాన్ వికాస్ పత్ర ఖాతాను జనవరి-మార్చి 2020 త్రైమాసికంలో ఓపెన్ చేస్తే మెచ్యూరిటి వరకు వార్షికంగా 7.6 శాతం వడ్డీ ఉంటుంది. కొత్తగా అంటే ప్రస్తుత త్రైమాసికంలో ఖాతా తెరిచే వారికి వార్షికంగా 6.9 శాతం వడ్డీ లభిస్తుంది. ఇదే వడ్డీ మెచ్యూరిటీ వరకు ఉంటుంది. త్రైమాసికంలో KVP వడ్డీ రేటును 7.6 శాతం నుండి 6.9 శాతానికి తగ్గించారు. అప్పటి నుండి అదే వడ్డీ రేటును కొనసాగిస్తున్నారు.
నష్టభయం లేదు
పోస్టాఫీస్ కిసాన్ వికాస్ పత్ర ఖాతాలో రాబడికి నష్టభయం ఉండదు. అందుకే జీరో రిస్క్తో పెట్టుబడి పెట్టాలనుకునేవారు ఈ ఖాతాను ఎంచుకోవచ్చు. పెట్టుబడులు వైవిధ్యంగా ఉండాలంటే పోర్ట్ఫోలియోలో కొంతభాగం రిస్క్లేని పెట్టుబడులు ఉండాలనేది నిపుణుల సూచన.
18 ఏళ్లు నిండినవారు కిసాన్ వికాస్ పత్రను ఓపెన్ చేయవచ్చు. మైనర్ పేరిట జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.