2వ రోజు వరకు పేటీఎం సబ్స్క్రిప్షన్ ఎలా ఉందంటే.. చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్పందన
రూ.18,300 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో, రూ.2080-రూ.2110 ఇష్యూ ధరతో సోమవారం వచ్చిన పేటీఎం ఐపీవో మొదటి రోజు 18 శాతం స్పందన లభించింది. రెండో రోజు కూడా మధ్యాహ్నం వరకు 35 శాతం సబ్స్క్రిప్షన్ కనిపించింది. రిటైల్ పోర్షన్ మాత్రం 1.01 శాతం బుక్ అయింది. పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ నిన్న ఐపీవోకు వచ్చింది. ఇష్యూలో భాగంగా 4.83 కోట్ల షేర్లు జారీ చేస్తుండగా, సోమవారం 88.23 లక్షల షేర్లకు బిడ్స్ దాఖలయ్యాయి. ఈ మేరకు ఎక్స్ఛేంజీ వద్ద సమాచారం వెల్లడిస్తోంది. చిన్న ఇన్వెస్టర్ల విభాగంలో నిన్నటికి 78%, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల విభాగంలో 2 శాతం స్పందన లభించింది.
అర్హులైన సంస్థాగత ఇన్వెస్టర్లకు కేటాయించిన 2.63 కోట్ల షేర్లలో 16.78 లక్షల షేర్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. పేటీఎం ఐపీవో రేపటి(10న)తో ముగుస్తుంది. ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపు నవంబర్ 15న, ఎక్స్ఛేంజీల్లో షేర్ల నమోదు 18న ఉండవచ్చు. పేటీఎం ఐపీవోలో ప్రస్తుత వాటాదారులకు రూ.10వేల కోట్ల విలువైన షేర్లు, కొత్త వాటాదారులకు రూ.8300 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నది.
ఆదరణ అంతంతే..
ఇటీవల వచ్చిన టెక్నికల్ రంగం కంపెనీలు నైకా, జొమాటో పబ్లిక్ ఇష్యూలకు తొలిరోజు అపూర్వ స్పందన లభించింది. పేటీఎం షేర్ల పరిమాణంతో పోలిస్తే వాటి పరిమాణం తక్కువ. రిటైల్ ఇన్వెస్టర్ కనీసం ఆరు షేర్లతో కూడిన ఒక లాట్, గరిష్టంగా 15 లాట్లను కొనుగోలు చేయాలి. ఒక లాట్ పైన అప్పర్ ప్రైస్ బాండ్ రూ.12,900 పలుకుతుంది.
లాట్ సైజ్ ఆరు షేర్లకు పరిమితం చేసినప్పటికీ, భారీ రేటుతో ఇంకెంత ప్రీమియం వస్తుందనే ఆలోచన కూడా రిటైల్ ఇన్వెస్టర్ల నిరాదరణకు కారణంగా భావిస్తున్నారు. లాంగ్ టర్మ్ ఇష్యూ కోసం పర్లేదు కానీ, తక్షణ రిటర్న్స్ లేదా స్వల్పకాలిక రిటర్న్స్ కోసం అంతగా ప్రయోజనం చేకూరదని భావిస్తున్నారు. రిస్క్ రివార్డ్ రేషియోలో రిస్క్ ఎక్కువగా ఉందని భావిస్తున్నారు. ఫేస్ వ్యాల్యూ రూ.1 పెట్టారు.
రెండో రోజు ఇలా...
వన్97 కమ్యూనికేషన్స్ ఐపీవో రెండో రోజు కూడా నెమ్మదిగానే కనిపిస్తోంది. భారత్లోనే ఇది అతిపెద్ద ఇష్యూ. రెండో రోజు మధ్యాహ్నం సమయానికి రిటైల్ ఇన్వెస్టర్ల సబ్స్క్రిప్షన్ 1.01 శాతం, నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ సబ్స్క్రిప్షన్ 3 శాతంగా ఉంది. క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయ్యర్స్ 2.63 కోట్ల షేర్లు ఉండగా, 76.7 లక్షల షేర్లకు బిడ్స్ వచ్చాయి. ఐపీవో సబ్స్క్రిప్షన్ 35 శాతంగా నమోదయింది.
ఐపీవోపై ఏమన్నారంటే
సోమవారం పేటీఎం ఇష్యూ సబ్స్క్రిప్షన్ 18 శాతంగా నమోదయింది. దీనిపై సాఫ్టుబ్యాంక్ గ్రూప్ కార్ప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్పందించారు. పేటీఎం గణనీయంగా పెరుగుతుందని తాను విశ్వసిస్తున్నానని, వ్యాల్యుయేషన్ పరంగా కూడా బాగుంటుందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ మసయోషి సన్ అన్నారు. వాస్తవానికి ఇది మార్కెట్ కండిషన్స్, ఇన్వెస్టర్స్ ఉత్సుకత పైన ఆధారపడి ఉంటుందన్నారు. ఏదైనా మనం పెట్టుబడి పెట్టినప్పుడు మనం వెచ్చించే ఖర్చు కంటే వ్యాల్యూయేషన్ పెద్దదిగా ఉండాలని విశ్వసిస్తామని, కాబట్టి ఐపీవో తమకు పెద్ద కార్యక్రమం అన్నారు.