NPS గుడ్న్యూస్, 70 ఏళ్లకూ చేరవచ్చు! ఉపసంహరణ పరిమితి కూడా పెంపు
పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (PFRDA) నేషనల్ పెన్షన్ సిస్టం(NPS) ఎంట్రీ వయోపరిమితిని 65 ఏళ్ల నుండి 70 ఏళ్ళకు పెంచే యోచనలో ఉంది. అదే సమయంలో గరిష్ట పరిమితిని 75 ఏళ్లకు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. NPSలో సభ్యులుగా చేరాలని భావించే వారికి ఇది శుభవార్తే. NPSలో సభ్యులుగా చేరేవారి గరిష్ఠ వయస్సును డెబ్బై ఏళ్లకు పెంచాలని PFRDA ప్రతిపాదన చేసింది. 60 ఏళ్ల తర్వాత NPSలో సబ్స్క్రైబర్లుగా చేరేవారు తమ ఖాతాలను 75 ఏళ్ల వరకు పొడిగించాలని కూడా ఈ ప్రతిపాదనలో ఉంది. ఇతర సబ్స్క్రైబర్ల మెచ్యూరిటీ గరిష్టంగా 70 ఏళ్లుగా నిర్ణయించింది.
ఆ 14 గంటలు RTGS నుండి డబ్బులు ట్రాన్సుఫర్ చేయలేరు, RBI ట్వీట్
75 ఏళ్ల వరకు కొనసాగవచ్చు
60 ఏళ్ళ తర్వాత ఎన్పీఎస్లో చేరే వారు 75 ఏళ్ల వరకు కొనసాగవచ్చునని PFRDA చైర్మన్ సుప్రతిమ్ బందోపాధ్యాయ అన్నారు. ప్రస్తుతం ఈ వయో పరిమితి డెబ్బై ఏళ్లుగా ఉందని తెలిపారు. గత మూడున్నర సంవత్సరాల కాలంలో 60 ఏళ్లు దాటిన వారు ఎన్పీఎస్లో చేరిన వారి సంఖ్య 15,000 వరకు ఉందన్నారు. ఈ వయో పరిమితిని 60 నుండి 65 ఏళ్లకు పెరిగిన తర్వాత సబ్స్క్రైబర్లు పెరిగినట్లు తెలిపారు. NPSలో చేరేందుకు గరిష్ట గడువును పొడిగించామన్నారు. ఇక ముందు కూడా గరిష్ట వయో పరిమితి పెంపు అంశాన్ని పరిగణలోకి తీసుకుంటామన్నారు.
సబ్స్క్రైబర్ల చేరిక
ఎన్పీఎస్, అటల్ పెన్షన్ యోజన పథకాలను పెన్షన్ అథారిటీ సంస్థ నిర్వహిస్తోంది. ఈ పథకాల్లో చేరిన సబ్స్క్రైబర్ల వృద్ధి 23 శాతంగా ఉంది. మార్చి 31వ తేదీ చివరి నాటికి ఈ సంఖ్య 42.4 మిలియన్లుగా ఉంది. మొత్తం అసెట్స్ రూ.5.78 లక్షల కోట్లు. కరోనా నేపథ్యంలో గత ఏడాది సవాల్గా మారిందని, అయినప్పటికీ వృద్ధిని నమోదు చేసినట్లు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో అటల్ పెన్షన్ యోజన, ఎన్పీఎస్లో చేరిన వారి సంఖ్య 8.3 మిలియన్ల సబ్స్క్రైబర్లు చేరగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 10 మిలియన్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఉపసంహరణ పరిమితి
పెన్షన్ ఫండ్ మేనేజర్లకు లైసెన్సింగ్ ప్రక్రియ ఇటీవలే ముగిసింది. వచ్చే 45 రోజుల్లో నూతన దరఖాస్తు దారుల అనుభవం ఆధారంగా న్యూవిండోను తెరుస్తామని బందోపాధ్యాయ తెలిపారు. ప్రస్తుతం యాక్సిస్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి లైసెన్స్ రెన్యూవల్ చేసినట్లు తెలిపారు. కాగా, ఉపసంహరణ పరిమితిని రూ.3 లక్షలకు పెంచే ఆలోచనలోను పెన్షన్ రెగ్యులేటర్ ఉంది. ప్రస్తుతం పెన్షన్ కార్పస్ నుండి ఉపసంహరణ పరిమితి రూ.2 లక్షలుగా మాత్రమే ఉంది.