Netbanking Fraud alert: 'వెంటనే ఇలా చేయకుంటే మీ అకౌంట్ బ్లాక్ అవుతుంది'
బ్యాంకింగ్ ఫ్రాడ్స్ రోజురోజుకు పెరుగుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు లేదా సంస్థల నుండి ఎస్సెమ్మెస్లు, ఈ-మెయిల్స్ వస్తుంటాయి. వీటి పైన క్లిక్ చేయాలని సూచిస్తుంటాయి. అయితే వీటి పట్ల ఆయా బ్యాంకులు ఎప్పటికప్పుడు తమ తమ కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేస్తుంటాయి. ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే KYCకి సంబంధించిన ఫ్రాడ్ పట్ల కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రయివేటురంగ దిగ్గజం HDFC ఎప్పటికప్పుడు బ్యాంకింగ్ ఫ్రాడ్స్ పట్ల కస్టమర్లను అప్రమత్తం చేస్తుంది. అయితే తాజాగా ఓ బ్యాంకు కస్టమర్ మరో ఫ్రాడ్ను సోషల్ మీడియా అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా బ్యాంకుకు తెలియజేశారు.
ఆ సందేశం ఇదే
ప్రముఖ జర్నలిస్ట్, టీవీ యాంకర్ వీర్ సంఘ్వీ ఈ ట్వీట్ చేశారు. 'ఇలాంటి SMS స్కామ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. అలాగే, HDFC బ్యాంకు.. ఈ నెంబర్ను ట్రాక్ చేసి, వెంటనే చర్యలు తీసుకోవాలి. నెంబర్ ఇదే' అంటూ ట్వీట్ చేశారు. ఆ సందేశంలో 'డియర్ HDFC యూజర్ మీ బ్యాంకు నెట్ బ్యాంకింగ్ అకౌంట్ ఈ రోజు బ్లాక్ అవుతుంది. తక్షణమే ఈ లింక్ పైన క్లిక్ చేసి, పాన్ కార్డు నెంబర్ను అప్ డేట్ చేయండి' అంటూ ఓ లింక్ ఇచ్చింది. ఈ స్క్రీన్ షాట్ను పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు స్పందించారు. ఇది స్కాం లేదా ఫ్రాడ్ ఎస్సెమ్మెస్ కాబట్టి అందులో సులభంగా తప్పులు కనిపిస్తాయని సూచించారు.
పొరపాట్లు ఇవే
ఇలాంటి చాలా స్కామర్స్ తాము జిమ్మిక్కు చేస్తారని, కానీ పొరపాటులో తప్పులు చేస్తుంటారని ఓ నెటిజన్ స్పందించారు. మరికొందరు నెటిజన్లు కూడా ఫ్రాడ్స్టర్స్ ఆ సందేశంలో చేసిన తప్పులను ఎత్తి చూపారు. ఇందులో మూడు తప్పులు కనిపిస్తున్నాయని, ఇందులో ఒకటి డియర్ బ్యాంకు యూజర్, రెండు పేలవమైన ఇంగ్లీష్ గ్రామర్, మూడు ఈ రోజే పూర్తి చేయాలంటూ అత్యవసరంగా చెప్పడం.. ఈ మూడు బ్యాంకు చేయదని ఓ నెటిజన్ పేర్కొన్నారు.
ఎస్బీఐ కస్టమర్లకూ
సీరియస్తో పాటు కొంతమంది నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ కూడా పోస్ట్ చేశారు. స్కామర్స్ రాపిడాక్స్ ఇంగ్లీష్ లర్నింగ్ బుక్ కొనుగోలు చేయాలని ఓ నెటిజన్ సరదా కామెంట్ పెట్టారు.
HDFCతో పాటు ఇటీవల ఎస్బీఐ KYC అప్ డేషన్ అంటూ కూడా స్కామర్స్ సందేశాలు పంపిస్తున్నారని మరో నెటిజన్ స్క్రీన్ షాట్ పెట్టారు. మీ కేవైసీని అప్ డేట్ చేయాలని, లేదంటే మీ ఎస్బీఐ అకౌంట్ బ్లాక్ అవుతుందని, బ్లాక్ కాకుండా ఉండాలంటే అప్ డేట్ చేయడానికి ఈ లింక్ పైన క్లిక్ చేయాలని ఉంది. దీనిపై ఇప్పటికే ఎస్బీఐ కస్టమర్లకు సూచన ఇచ్చింది.