సావరీన్ గోల్డ్ బాండ్స్ పైన పన్ను ఎలా ఉంటుందంటే?
సావరీన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 020-21-సిరీస్ 12 సబ్స్క్రిప్షన్ మార్చి 1వ తేదీ నుండి ప్రారంభమైంది. ఈ గోల్డ్ బాండ్ ఇష్యూ ధరను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రూ.4,462గా నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్బీఐ ఈ బాండ్స్ జారీ చేస్తుంది. ఇది గోల్డ్ యూనిట్లుగా ఉంటుంది. ఇది ఒక గ్రాముకు సమానం. ఈ పథకం ద్వారా మీకు ఉండే బంగారం బాండ్ రూపంలో కలిగి ఉంటారు. మెచ్యూరిటీ సమయంలో దీనిపై వడ్డీ ప్రయోజనం ఉంటుంది. బంగారంపై పెట్టుబడి పెట్టడానికి మంచి మార్గాల్లో ఇది ఒక్కటి.
బంగార ధరల్లో ప్రయోజనం కాకుండా, ఈ బాండ్స్ పెట్టుబడిదారులకు పెట్టుబడి పెట్టిన మొత్తంపై 2.5 శాతం స్థిరవడ్డీని అందిస్తాయి. వడ్డీని ఆరు నెలలకు ఓసారి చెల్లిస్తారు. గోల్డ్ బాండ్స్ వడ్డీ ఆదాయానికి పన్ను ఎలా వర్తిస్తుందో కూడా అర్థం చేసుకోడం ముఖ్యం.
గోల్డ్ బాండ్స్ మెచ్యూరిటీ కాలపరిమితి ఎనిమిది సంవత్సరాలు. ఈ బాండ్స్ కొనుగోలు చేసి, మెచ్యూరిటీ వరకు కొనసాగిస్తే మూలధన లాభాలు పన్నురహితంగా ఉంటాయి. IBJA ప్రచురించిన తిరిగి చెల్లించిన తేదీ నుండి గత మూడు పనిదినాలలో 999 స్వచ్ఛత బంగారం సాధారణ సగటు ముగింపు ధర ఆధారంగా పెట్టుబడిదారులు బంగారు బాండ్స్ను తిరిగి పొందవచ్చు. అయిదో సంవత్సరం నుండి ముందస్తు ఉపసంహరణకు అవకాశం ఉంది.
మెచ్యూరిటీకి ముందు తీసుకోవాలనుకుంటే కూపన్ చెల్లింపు తేదీకి 30 రోజుల ముందు సంబంధిత బ్యాంకు లేదా స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, పోస్టాఫీస్ లేదా ఏజెంట్ను సంప్రదించాలి. కూపన్ చెల్లింపు తేదీకి కనీసం ఒకరోజు ముందు పెట్టుబడిదారు సంబంధిత బ్యాంకు/పోస్టాఫీసును సంప్రదిస్తేనే ముందస్తు ఉపసంహరణ అభ్యర్థనలు ఆమోదం పొందుతాయి. బాండ్ కోసం దరఖాస్తు చేసే సమయంలో అందించిన బ్యాంకు ఖాతాకు ఆదాయం జమ అవుతుంది. 5వ ఏడాది తర్వాత తీసుకుంటే లాభాలపై పోస్ట్ ఇండెక్సేషన్తో 20% పన్ను వర్తిస్తుంది.
గోల్డ్ బాండ్స్ను స్టాక్ ఎక్స్చేంజీలలో కూడా లిస్ట్ చేస్తారు. అంటే స్టాక్ ఎక్స్చేంజీ నుండి కూడా కొనుగోలు చేయవచ్చు లేదా అమ్మవచ్చు. ఒకవేళ ఏడాదికి ముందే విక్రయిస్తే వచ్చిన లాభాల్ని పెట్టుబడిదారు ఆదాయానికి కలిపితే స్లాబ్ రేటు ప్రకారం పన్ను ఉంటుంది. ఒక సంవత్సరం తర్వాత లాభాలను దీర్ఘకాలికంగా పరిగణిస్తారు, 10 శాతం పన్ను ఉంటుంది.