EMI మారటోరియం ఈజీ కాదు.. 3 నెలల ఊరట 'లక్షల' భారమే, ఇలా చేయడం మంచిది
హోమ్ లోన్, కారు లోన్, పర్సనల్ లోన్.. ఇలా అన్నిరకాల లోన్లపై సంబంధించి ఆర్బీఐ 3 నెలల మారటోరియానికి అనుమతించిన విషయం తెలిసిందే. ఈ మూడు నెలల ఊరటను దాదాపు అన్ని బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు కస్టమర్లకు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ మేరకు మంగళవారం నుండి ఆయా బ్యాంకులు తమ తమ కస్టమర్లకు మెయిల్స్ లేదా సందేశాల ద్వారా సమాచారం అందించవచ్చు.
మారటోరియానికి బ్యాంకులు సిద్ధం
ICICI బ్యాంకు, HDFC బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంకు సహా వివిధ బ్యాంకులు ఎంత లోన్ తీసుకున్నారు, ఎంత కాలపరిమితి ఉందనే అంశంతో సంబంధం లేకుండా కస్టమర్లందరికీ ఈ వెసులుబాటును కల్పించాలని నిర్ణయించాయి.
కాలపరిమితి ఎంత, ఈఎంఐ ఎంత పెరుగుతుందో చెబుతాం
కస్టమర్లకు మారటోరియంకు సంబంధించి మెయిల్స్, సందేశాలు పంపించేందుకు తమ అధికారులు పని చేస్తున్నారని, 3 నెలల మారటోరియం ఆప్షన్ ఎంచుకుంటారా లేదా అని కస్టమర్ను కోరుతామని, ఒకవేళ ఈ ఆప్షన్ ఎంచుకుంటే లోన్ కాలపరిమితి ఎంతకాలం పెరుగుతుందో చెబుతామని లేదా అతను తన టెన్యూర్ కాలాన్ని ఇదివరకు ఉన్నదే అట్టిపెట్టుకోవడానికి ఈఎంఐ ఎంత పెరుగుతుందో చెబుతామని ఓ బ్యాంకుకు చెందిన అధికారి తెలిపారు.
HDFC ఏం చెప్పిందంటే?
కస్టమర్లు 3 నెలల మారటోరియాన్ని ఎంచుకోవచ్చునని HDFC తెలిపింది. తమ కస్టమర్లకు ఎస్సెమ్మెస్, ఈమెయిల్స్ ద్వారా సమాచారం ఇస్తామని, వారు వెబ్ సైట్లోని లింక్ ద్వారా మారటోరియం ఆప్షన్ ఎంచుకోవచ్చునని HDFC అధికారులు చెబుతున్నారు. అవసరమైతే మారటోరియం ఎంచుకోకుండా EMIని కొనసాగించుకోవచ్చునని అంటున్నారు.
రుణ బకాయిపై వడ్డీ
ఇక్కడ కస్టమర్లు ఓ విషయం గుర్తుంచుకోవాలని చెబుతున్నారు. తాత్కాలిక ఈఎంఐ చెల్లింపు ఉచితం కాదని అంటున్నారు. రుణ బకాయిలపై వడ్డీ పెరుగుతుందని గుర్తు చేస్తున్నారు. ఈఎంఐ పెంచుకున్నా అది భారమే లేదా కాలపరిమితి పెంచుకున్నా.. ఆ మేరకు కస్టమర్లపై భారమే అంటున్నారు.
అదనంగా 12 ఈఎంఐలు
ఉదాహరణకు 8.5 శాతం వడ్డీ రేటుకు మీరు రూ.50 లక్షల లోన్ తీసుకున్నారు. కాలపరిమితి 19 సంవత్సరాలు. ఇప్పుడు మీరు మూడు మారటోరియం ఆప్షన్ ఎంచుకుంటే ఈ కాలానికి ఈ మొత్తం రూ.1.05 లక్షలుగా ఉంటుంది. మూడు నెలల తర్వాత మీ ఈఎంఐ పునఃప్రారంభమయ్యాక రూ.51.05 లక్షలపై ఆధారపడి ఉంటుంది. అప్పుడు మీ టెన్యూర్ 228 నెలల నుండి 240 నెలలకు పెరుగుతుంది. అంటే అదనంగా 12 ఈఎంఐలు చెల్లించాలి.
ప్రతి నెల రూ.930 పెరుగుదల
అలా కాకుండా మీ ఈఎంఐలను 228 నెలలు ఉండాలనుకుంటే మీ ఈఎంఐని రూ.44,272 నుండి రూ.45,202కు పెంచుకోవాలి. ఇది 228 నెలల కాలానికి రూ.930 పెరుగుతుంది. అంటే మారటోరియం ఎంచుకుంటే రుణ గ్రహీతలపై గణనీయంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ భారం లోన్ ప్రారంభంలో ఉన్నవారికి వర్తిస్తుంది.
ఎప్పుడు ఎంచుకోవాలి
మారటోరియం ఎంచుకుంటే భారమే కాబట్టి రుణగ్రహీతలు తప్పనిసరి అనుకుంటేనే ఆర్బీఐ ఇచ్చిన ఆప్షన్ ఎంచుకోవాలి. నెలవారీ ఆదాయాలు రాని పక్షంలో, వేతనాలు నిలిచిపోతే, అత్యంత కష్టంగా ఉంటే మాత్రమే మారటోరియం ఎంచుకోవాలని సూచిస్తున్నారు.
రుణ భారం చివరి దశలో ఉంటే..
రుణభారం లేదా కాలపరిమితి తక్కువగా ఉంటే అంటే చివరికి వస్తుంటే కనుక ఈ భారం కాస్త స్వల్పంగానే ఉంటుంది. ఉదాహరణకు మీ ఔట్ స్టాండింగ్స్ రూ.15.37 లక్షలుగా ఉండి, మరో 40 నెలల కాలపరిమితి ఉంది అనుకుంటే.. వీరు మారటోరియం ఎంచుకుంటే ఇలా ఉంటుంది. అతని కాల పరిమితి 40 నెలల నుండి 41 నెలలకు మాత్రమే పెరుగుతుంది. ఈఎంఐ అంతే ఉంటుంది.
షెడ్యూల్ ప్రకారం చెల్లించడమే మంచిది
ఆర్బీఐ మారటోరియాన్ని ఊరటగా ప్రకటించినప్పటికీ వాస్తవంలో అది కాదని అంటున్నారు. ఈ ఆప్షన్ ఎంచుకుంటే కస్టమర్లకు దీర్ఘకాలంలో భారమే అంటున్నారు. మారటోరియాన్ని అన్ని విధాలుగా ఆలోచించి ఎంచుకోవాలని చెబుతున్నారు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుంటే... మారటోరియం వల్ల ఎలాంటి అదనపు ప్రయోజనం లేనందున షెడ్యూల్ ప్రకారమే చెల్లించడం మంచిదని అంటున్నారు. ఈ ఆప్షన్ ఎంచుకుంటే వచ్చే ఇబ్బందులను కూడా అధిగమించవచ్చునని చెబుతున్నారు.