EPF సభ్యులకు బీమా గుడ్న్యూస్, రూ.7 లక్షల వరకు గరిష్ట ప్రయోజనం
ఉద్యోగుల భవిష్య నిధి (EPFO) సభ్యులకు ఇక నుండి గరిష్టంగా రూ.7 లక్షల జీవితబీమా సదుపాయం లభించనుంది. ప్రస్తుతం గరిష్ట బీమా రూ.6 లక్షలుగా ఉంది. దీనిని రూ.7 లక్షలకు పెంచాలని ఈపీఎఫ్ఓ ట్రస్టీలు నిర్ణయించగా, దీనికి కేంద్ర కార్మిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు బుధవారం నోటిఫికేషన్ జారీ చేసినట్లు కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ గాంగ్వార్ తెలిపారు. 2020 సెప్టెంబర్ 9 నాటి ఈపీఎఫ్ఓ కేంద్ర ట్రస్టీల బోర్డు సమావేశంలో కేంద్రమంత్రి గాంగ్వార్ అధ్యక్షతన బీమా కవరేజీని రూ.7 లక్షలకు పెంచాలని నిర్ణయించారు.
గరిష్ట ప్రయోజనం
ఎంప్లాయీస్ డిపాజిట్ అనుసంధాన బీమా (EDLI) పథకం 1976 కింద గరిష్ట ప్రయోజనాన్ని రూ.6 లక్షల నుండి రూ.7 లక్షలకు పెంచుతూ ఈపీఎఫ్ఓ ట్రస్టీల కేంద్ర బోర్డు గత ఏడాది సెప్టెంబర్ సమావేశంలో నిర్ణయింయించింది. దీనికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. దీనిని అమల్లోకి తెచ్చినట్లు ప్రకటన వచ్చింది. దీంతో ఉద్యోగులకు లాభం చేకూరుతుంది.
కనీస బీమా
ఈపీఎఫ్ఓ సభ్యులకు ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సురెన్స్ స్కీం 1976 (EDIL) కింద బీమా కవరేజీ అమవుతోంది. దీని కింద బీమా రూ.2.5 లక్షలుగా ఉంది. మరణానికి ముందు 12 నెలల్లో ఒకటికి మించిన సంస్థల్లో పని చేసినా బీమా సదుపాయం వర్తింపచేయాలని గత ఏడాది నిర్ణయించింది. గతంలో చనిపోవడానికి ముందు 12 నెలల్లో సభ్యుడు ఒకటికి మించిన సంస్థల్లో పని చేస్తే బీమా సదుపాయం ఉండేది కాదు. కానీ దీనిని గత ఏడాది మార్చారు.
30 రెట్ల బీమా సదుపాయం
ఉద్యోగి మరణానికి ముందు పన్నెండు నెలల్లో అందుకున్న సగటు వేతనానికి (మూలవేతనం, కరువు భత్యం కలిపి) 30 రెట్ల వరకు బీమా సదుపాయం ఉంటుంది. బీమా కవరేజీకి ఉద్యోగి కనీసం ఇంతకాలం పని చేయాలనే నిబంధన ఏదీ లేదు.