ఇలా అయితేనే టెర్మ్ ఇన్సురెన్స్ మొత్తం భార్యాపిల్లలకు చేరుతుంది!
టర్మ్ ఇన్సురెన్స్ పాలసీని కొనుగోలు చేసే సమయంలో భార్య, పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవడం తప్పనిసరి. టర్మ్ పాలసీ కొనుగోలు అసలు ఉద్దేశ్యం సంపాదించే వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో మృతిచెందితే అతని భార్య, పిల్లలు భవిష్యత్తును ఆర్థికంగా భద్రపరచడం. మరణం అనంతరం క్లెయిమ్ మొత్తం ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు లేకుండా కుటుంబ సభ్యులకు చేరాలని కోరుకుంటారు. అయితే, పాలసీదారు మరణించే సమయానికి ఏదైనా సంస్థ నుండి గానీ, బంధువులు, స్నేహితుల నుండి గాని అప్పు తీసుకుని ఉంటే, పాలసీ మొత్తం నామినీ కంటే ముందు రుణదాతలు క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి టర్మ్ బీమా పాలసీని కొనుగోలు చేయడం ద్వారానే పాలసీదారు మరణానంతరం హామీ మొత్తం నామినీ పొందగలరని చెప్పలేము.
నామినీలకు హామీ లేదు...
MWP(వివాహిత మహిళల ఆస్తి) చట్టం కింద కొనుగోలు చేయని సాధారణ టర్మ్ బీమా పాలసీకి సంబంధించి పాలసీదారు మరణాంతరం హామీ మొత్తాన్ని రుణదాతలు, ఇతర కుటుంబ సభ్యులు క్లెయిమ్ చేయవచ్చు. అందుకే పాలసీ హామీ మొత్తం భార్య, పిల్లలకు అందాలంటే, వివాహిత మహిళల ఆస్తి చట్టం, 1874 ప్రకారం టర్మ్ బీమా పాలసీని కొనుగోలు చేయాలి. టర్మ్ పాలసీని మాత్రమే కొనుగోలు చేయడం ద్వారా మరణం తర్వాత నామినీలకు పూర్తి హామీ లభించదు.
వారికి మొదటి ప్రాధాన్యత
MWP చట్టం కింద పాలసీ కొనుగోలు చేస్తే పాలసీదారుడు మరణించిన సందర్భంలో హామీ మొత్తాన్ని అందించేందుకు మొదటి ప్రాధాన్యత అతని భార్య, పిల్లలకు ఇస్తారు. అితే ఒక భార్య తన భర్తను మొదటి లబ్ధిదారునిగా చేయడానికి ఇందులో కుదరదు. అయితే ఒక వివాహిత మహిళ తన పిల్లల కోసం MWP చట్టం కింద పాలసీ కొనుగోలు చేయవచ్చు. సులభంగా చెప్పాలంటే వివాహిత మహిళల ఆస్తి చట్టం కింద పాలసీ కొనుగోలు చేస్తే, పాలసీ ప్రయోజనాలు నేరుగా భార్య/ పిల్లలకు అందుతాయి. ఈ మొత్తంతో రుణాలు చెల్లించవలసిన అవసరం లేదు.
రుణదాతలు క్లెయిమ్ చేయలేరు
ఇంకా చెప్పాలంటే ఈ మొత్తాన్ని రుణదాతలు క్లెయిమ్ చేయలేరు. MWP చట్టంలోని సెక్షన్ 6 ఈ అంశాన్ని వెల్లడిస్తుంది. MWP చట్టం కింద జారీ చేయబడిన బీమా పాలసీ సాధారణంగా ఉద్యోగులు, వ్యాపారంలో ఉన్నవారికి ప్రయోజకనరం.