Loan moratorium: 'మీ ఖాతాలో డబ్బు జమ చేశాం!'.. వారికి బ్యాంకుల ఊరట
కరోనా నేపథ్యంలో మార్చి నుండి ఆగస్ట్ వరకు కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ రుణ మారటోరియం వెసులుబాటు కల్పించింది. ఈ కాలంలో రుణాలపై విధించిన వడ్డీపై వడ్డీ (చక్రవడ్డీ)ని బ్యాంకులు వాపస్ చేయడం ప్రారంభించాయి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు ఆరు నెలల మారటోరియం కాలంలో రూ.2 కోట్ల లోపు రుణాలపై చక్రవడ్డీని మాఫీ చేయాలని, నవంబర్ 5వ తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆర్బీఐ గతవారం బ్యాంకులను, ఎన్బీఎఫ్సీలను ఆదేశించింది.
లోన్ మారటోరియం కేసు.. మరిన్ని వార్తలు
రుణ గ్రహీతల ఖాతాల్లో నగదు జమ
మార్చి నుండి ఆగస్ట్ వరకు చక్రవడ్డీని కేంద్రం భరిస్తుంది. బ్యాంకులు తొలుత కస్టమర్ల అకౌంట్లలో జమ చేస్తే వాటిని కేంద్రం ఆ తర్వాత రీయింబర్స్ చేస్తుంది. ఈ ఆరు నెలల కాలంలో సాధారణ వడ్డీకి, చక్రవడ్డీకి మధ్య తేడా మొత్తాన్ని రుణగ్రహీతల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు బ్యాంకుల నుంచి రుణగ్రహీతలకు ఫోన్ ద్వారా సందేశాలు వస్తున్నాయి. క్రెడిట్ కార్డు బకాయిలతోపాటు హోంలోన్, వెహికిల్ లోన్, ఎంఎస్ఎంఈ, కన్సంప్షన్ లోన్లు ఈ పథకం పరిధిలోకి వస్తాయి. గోల్డ్ లోన్ సహా వినియోగ రుణాలకు వర్తిస్తుంది. పంట, ట్రాక్టర్ల రుణాలకు చక్రవడ్డీ మాఫీ వర్తించదు.
మెసేజ్ ద్వారా...
రుణగ్రహీతలకు తమ ఖాతాలోకి డబ్బులు జమ అయినట్లు బ్యాంకులు సందేశం పంపిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు ఈ రీఫండ్ స్కీంను 3వ తేదీ నుండి ప్రారంభించాయి. ఇతర బ్యాంకులు కూడా ఖాతాదారులకు సందేశాలు పంపించడం ద్వారా రీఫండ్ విషయాన్ని తెలియజేస్తాయని భావించవచ్చు.
మారటోరియం ఉపయోగించుకున్నా.. ఉపయోగించుకోకపోయినా
2020 మార్చి 1వ నుండి ఆగస్ట్ 31వ వరకు ప్రకటించిన లోన్ మారటోరియంపై చక్రవడ్డీ మాఫీ ఉంటుంది. ఫిబ్రవరి 29 నాటికి రూ.2 కోట్ల లోపు రుణఖాతాలు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. చక్రవడ్డీ మాఫీ వర్తించాలంటే ఫిబ్రవరి 29వ తేదీ నాటికి సదరు రుణ ఖాతా మొండి బకాయిగా ఉండరాదు. హోమ్ లోన్, హౌసింగ్ లోన్, ఎంఎస్ఎంఈ రుణాలతో పాటు వినియోగ, గృహోపకరణాల కొనుగోలు రుణాలు, క్రెడిట్ కార్డు బకాయిలు చక్రవడ్డీ మాఫీ పథకం పరిధిలోకి వస్తాయి. సాధారణ వడ్డీకి, చక్రవడ్డీకి మధ్య తేడా నగదును బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అర్హులైన రుణ గ్రహీతల ఖాతాల్లో జమ చేస్తున్నాయి. ప్రభుత్వరంగ, ప్రైవేటురంగ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు, సహకార బ్యాంకులు, గ్రామీణ బ్యాంకుల నుండి రుణాలు తీసుకున్న వారందరు అర్హులే. ఇక లోన్ మారటోరియం సదుపాయాన్ని వినియోగించుకోకుండా ఈఎంఐలు చెల్లించిన వారికీ ప్రయోజనం కలుగుతోంది. ఈఎంఐలు చెల్లించినవారికి వార్షిక వడ్డీ రేటు ప్రాతిపదికన చెల్లించాలి.
లోన్ మారటోరియం ఎంచుకున్న వారికి, ఎంచుకోని వారికి, పాక్షికంగా ఉపయోగించుకున్న వారికి కూడా ఎక్స్గ్రేషియాను కేంద్రం చెల్లిస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.
సుప్రీం కోర్టులో విచారణ
ఇదిలా ఉండగా, సుప్రీం కోర్టులో ఈ రోజు (నవంబర్ 5) లోన్ మారటోరియం కేసు విచారణ జరిగింది. వడ్డీపై వడ్డీ మాఫీ చేయడాన్ని పిటిషనర్ స్వాగతించారు. ఇందుకు ప్రభుత్వానికి, ఆర్బీఐకి థ్యాంక్స్ చెప్పారు. అనంతరం ఈ కేసును సుప్రీం కోర్టు నవంబర్ 18వ తేదీకి వాయిదా వేసింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అందుబాటులో లేకపోవడంతో వాయిదాపడింది. ఎన్పీఏ విభజన పైన ఉన్న స్టేను ఎత్తివేయాలని ఆర్బీఐ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. అలాగే, ఎంఎస్ఎంఈలు అదనపు ప్రయోజనాల కోసం విజ్ఞప్తి చేశాయి.