నెలలో రెండోసారి వడ్డీ రేటు పెంచిన ఎస్బీఐ, ఈఎంఐ మరింత భారం
ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఎంసీఎల్ఆర్ రుణ రేటును పది బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ నెల 15వ తేదీ నుండి ఇది అమలులోకి వచ్చినట్లు వెల్లడించింది. ఓవర్ నైట్, నెల రోజులు, మూడు నెలల ఎంసీఎల్ఆర్ రేటు ఇదివరకు 6.75 శాతం కాగా, ఇప్పుడు పది బేసిస్ పాయింట్లు పెరిగి 6.85 శాతానికి చేరుకుంది. ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 7.15 శాతానికి, ఏడాది ఎంసీఎల్ఆర్ 7.20 శాతానికి, రెండేళ్ల ఎంసీఎల్ఆర్ 7.40 శాతానికి, మూడేళ్ళ ఎంసీఎల్ఆర్ 7.50 శాతానికి చేరుకున్నాయి.
ఎస్బీఐ రెండోసారి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గత నెలలో రెపో రేటును 0.40 శాతం పెంచింది. అయితే అంతకంటే ముందే ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ను పది బేసిస్ పాయింట్లను పెంచింది. దీంతో గత నెల రోజుల్లో ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు 20 బేసిస్ పాయింట్లు పెంచినట్లు అయింది. 2019 తర్వాత మొదటిసారి ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ రేటును పెంచింది.
బల్క్ డిపాజిట్లపై కూడా
ఎస్బీఐ ఇటీవల ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను కూడా పెంచింది. రూ.2 కోట్లు ఆ పైన బల్క్ డిపాజిట్ల పైన వడ్డీ రేటును పెంచింది. ఈ పెంచిన వడ్డీ రేటు మే 10వ తేదీ నుండి అమల్లోకి వచ్చింది. అయిదేళ్ల నుండి పదేళ్ల కాలపరిమితిపై, మూడేళ్ల నుండి అయిదేళ్ల కాలపరిమితిపై అత్యధిక వడ్డీ రేటును అందిస్తోంది. ఈ కాలపరిమితిపై వడ్డీ రేటును 90 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. దీంతో వడ్డీ రేటు 3.60 శాతం నుండి 4.50 శాతానికి పెరిగింది.
బ్యాంకులన్నింటిది అదే దారి
ఆర్బీఐ రెపో రేటు పెంపు అనంతరం వివిధ బ్యాంకులు డిపాజిట్ వడ్డీ రేట్లను, రుణ రేట్లను పెంచాయి. బంధన్ బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకు, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకులు వడ్డీ రేటును పెంచాయి.