LIC IPO: ఐపీవో ధర, పాలసీదారులకు డిస్కౌంట్ ఎంతంటే?
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎల్ఐసీ ఐపీవో వచ్చే నెల అంటే మే 4వ తేదీన ప్రారంభం కానుంది. ఇష్యూ 9వ తేదీన ముగియనుందని తెలుస్తోంది. ప్రభుత్వం ఒక్కో షేరుకు రూ.902 నుండి రూ.949 ధరల శ్రేణిని నిర్ణయించినట్లుగా సమాచారం. ఇష్యూలో భాగంగా ప్రభుత్వం 3.5 శాతం వాటాను విక్రయించనుంది. పాలసీదారులకు, రిటైల్ ఇన్వెస్టర్లకు షేర్ ధరలో డిస్కౌంట్ను ప్రకటించింది.
3.5 శాతం వాటా విక్రయం ద్వారా రూ.21,000 కోట్లు సమకూరే అవకాశముంది. తొలుత 5 శాతం లేదా 31.6 కోట్ల షేర్లను విక్రయించాలని భావించినప్పటికీ, దీనిని ప్రస్తుతం 3.5 శాతానికి (22.13 కోట్ల షేర్లు) కుదించింది. యాంకర్ ఇన్వెస్టర్లు మే 2వ తేదీన షేర్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
పాలసీదారులకు 10 శాతం
ఐపీవో ఇష్యూ ధరలో పాలసీదారులకు రూ.60, చిన్న ఇన్వెస్టర్లకు, ఉద్యోగులకు రూ.40 మేర రాయితీ అందిస్తోంది ఎల్ఐసీ. పాలసీదారులకు ఇష్యూ పరిమాణంలో పది శాతం వాటా లేదా 2.21 కోట్ల షేర్లను, ఉద్యోగులకు 15 లక్షల షేర్లను రిజర్వ్ చేసినట్లుగా తెలుస్తోంది.
ఈ కేటాయింపుల అనంతరం మిగిలిన షేర్లలో యాభై శాతాన్ని అర్హులైన సంస్థాగత ఇన్వెస్టర్లకు, 35 శాతం చిన్న ఇన్వెస్టర్లకు, 15 శాతం సంస్థాగతేతర ఇన్వెస్టర్లకు కేటాయించారు. అర్హులైన సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగంలో 60 శాతం షేర్లను యాంకర్ ఇన్వెస్టర్ల కోసం కేటాయించారు.
ఐదో అతిపెద్ద సంస్థ
ఎల్ఐసీ వ్యాల్యూను రూ.6 లక్షల కోట్లుగా ప్రభుత్వం మదింపు చేసింది. సెబీ నిబంధనల ప్రకారం రూ.1లక్ష కోట్ల వ్యాల్యూ కలిగిన కంపెనీ ఐపీవోకు వస్తే కనీసం 5 శాతం వాటాను ఆఫర్ చేయాలి. దీంతో ప్రభుత్వం 5 శాతం వాటా ఆఫర్ నిబంధనల నుండి ఎల్ఐసీకి మాత్రం మినహాయింపును కోరింది.
అప్పర్ ప్రైస్ బాండ్ రూ.949 వద్ద లిస్ట్ అయినా ఎల్ఐస మార్కెట్ క్యాప్ రూ.6 లక్షల కోట్లతో దేశంలో అయిదో అతిపెద్ద, ప్రపంచంలో 186వ అతిపెద్ద మార్కెట్ క్యాప్ కంపెనీ అవుతుంది. మార్కెట్ క్యాప్ పరంగా రిలయన్స్, టీసీఎస్, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్ వరుసగా టాప్ 4లో ఉన్నాయి.
గ్రే మార్కెట్
ఎల్ఐసీ ఐపీవో దాదాపు ఖరారైన నేపథ్యంలో గ్రే మార్కెట్లో ఈ స్టాక్స్ పైన ఆసక్తి పెరిగింది. ఒక్కో షేర్ ప్రస్తుతం జారీ ధర కంటే పది శాతం ప్రీమియంతో రూ.1000కి పైగా ట్రేడ్ అవుతోంది. ఐపీవో తేదీ దగ్గర పడేసరికి ఇది మరింత పెరగవచ్చు. ఎల్ఐసీ ఐపీవో ధర, పాలసీదారులకు డిస్కౌంట్, కోట్ వంటి అంశాలు వచ్చాయి. ప్రభుత్వం ఇవాళో, రేపో ప్రకటించవచ్చు.