SBI: మీకు ఎస్బీఐలో అకౌంట్ ఉందా..? డబ్బులు కట్ అవుతున్నాయా..? కారణం ఏంటంటే..
SBI: దేశంలో అగ్రగామి బ్యాంక్ గా ఎదిగిన ప్రభుత్వ రంగంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ బ్యాంకులో ఖాతాలు ఉన్న వారి అకౌంట్ల నుంచి అకస్మాత్తుగా కొంత మెుత్తం డబ్బు కట్ అవుతున్నాయి. చాలా మంది తమ ఖాతాలో రూ.147.5 డెబిట్ అయినట్లు గుర్తించి ఎందుకలా జరిగిందో తెలియక ఆందోళన చెందుతున్నారు.
కారణం..
బ్యాంకులు తమ వినియోగదారులకు అందించే వివిధ సేవలకు గాను కాలానుగుణంగా ఛార్జీలను వసూలు చేస్తుంటాయి. తాజాగా డిజిటలైజేషన్ పెరగటంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆపరేటింగ్ స్టైల్ను కూడా మార్చుకుంది. కొత్త సేవలను పరిచయం చేస్తూ వాటికి రుసుములను వసూలు చేస్తోంది. అలాంటి ఒక సేవ కోసం ఎస్బీఐ రూ.147.5ను వసూలు చేస్తోందని తెలుసుకోండి.
రూ.147.5 వసూలు..
ఖాతాదారులు ఉపయోగిస్తున్న SBI డెబిట్ కార్డ్ కోసం SBI మేనేజ్మెంట్ వార్షిక నిర్వహణ రుసుముగా ఈ మెుత్తాన్ని బ్యాంక్ తన కస్టమర్ల నుంచి వసూలు చేస్తోంది. బ్యాంక్ మేనేజ్మెంట్ ద్వారా బ్యాంక్ డెబిట్ కార్డులను జారీ చేస్తుంటుంది. వీటిని ఏటీఎంలో డబ్బు విత్ డ్రా చేసుకోవటం, ఆన్ లైన్ షాపింగ్ చెల్లింపుల కోసం ప్రజలు ఉపయోగించిస్తుంటారు. అందుకే బ్యాంక్ ఈ వినియోగానికి గాను ఛార్జీలను వసూలు చేస్తోంది.
డెబిట్ కార్డ్ రకాలు..
SBI తన కస్టమర్లకు విస్తృత శ్రేణి డెబిట్ కార్డ్లను అందిస్తోంది. వీటిలో చాలా వరకు క్లాసిక్ / సిల్వర్ / గ్లోబల్ / కాంటాక్ట్లెస్ డెబిట్ కార్డ్లు ఉన్నాయి. ఈ డెబిట్ కార్డ్ వార్షిక నిర్వహణ రుసుము కేవలం రూ.125 మాత్రమే. అయితే ఈ ఛార్జీలపై ప్రభుత్వం విధించే 18 శాతం జీఎస్టీ కలుపుకుని మెుత్తం రుసుము రూ.147.5కు చేరుకుంది.
ఇతర ప్రీమియం కార్డులు..
యువ / గోల్డ్ / కాంబో / మై కార్డ్ డెబిట్ కార్డ్ కోసం వార్షిక నిర్వహణ రుసుము రూ.175+GST, ప్లాటినం డెబిట్ కార్డ్ రూ.250+GST, ప్రైడ్ / ప్రీమియం బిజినెస్ డెబిట్ రూ.350+GSTని బ్యాంక్ ఖాతాదారుల అకౌంట్ల నుంచి వసూలు చేస్తోంది. అలాగే మీరు బ్యాంక్ నుంచి కొత్త డెబిట్ కార్డును పొందాలనుకుంటే లేదా పాత కార్డును మార్చుకోవాలనుకున్నా అందుకోసం స్టేట్ బ్యాంక్ రూ.300తో పాటు జీఎస్టీని ఛార్జీగా వసూలు చేస్తుంది.