బిట్ కాయిన్ కంటే... బంగారంపై 15% పెట్టుబడి మంచిది!
బిట్ కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీలో సగటు ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు పెట్టడం సరైనది కాదని మార్కెట్ నిపుణులు, మోబియస్ క్యాపిటల్ పార్ట్నర్స్ ఫౌండర్ మార్క్ మోబియస్ అభిప్రాయపడ్డారు. ఇందుకు ప్రధాన కారణం బిట్ కాయిన్ను నగదుగా మార్చడం చాలా కష్టమైన పని అని, అలాగే ప్రమాదకర ప్రతిపాదన అన్నారు. అలాగే ఫిజికల్ పసిడిపై 10 శాతం నుండి 15 శాతం మేర పెట్టుబడులు పెట్టాలని సూచించారు.
ఇటీవల బిట్ కాయిన్ భారీగా ఎగిసిన విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో ఈ క్రిప్టో ఏకంగా 64వేల డాలర్లకు చేరుకుంది. గత నెలలో 58వేల డాలర్ల ఆల్ టైమ్ గరిష్టాన్ని చేరుకున్న బిట్ కాయిన్ ఈ నెలలో 64వేలను క్రాస్ చేసింది. అయితే ఇటీవల టర్కీ క్రిప్టోకు షాకివ్వడంతో నిన్న తిరిగి 60వేల డాలర్లకు పడిపోయింది. అయినప్పటికీ ఈ ఏడాది బిట్ కాయిన్, ఎథేరియం వంటి క్రిప్టోకరెన్సీలు భారీగా ఎగిశాయి.
ఇక కరోనా కారణంగా గత ఏడాది ఆగస్ట్ నెలలో బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో 2072 డాలర్లకు, దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో 56,200కు చేరుకుంది. అయితే ప్రస్తుతం 1780 డాలర్ల వద్ద, దేశీయంగా 47వేల డాలర్ల వద్ద ఉంది. అయినప్పటికీ ఫిజికల్ గోల్డ్పై కొంత పెట్టుబడి మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.