ఐటీ దూకుడుకు టీసీఎస్ కీలకం, ఇక ఫార్మాలో లాభాల స్వీకరణ!
అక్టోబర్ 7వ తేదీన దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ బోర్డు మీటింగ్ ఉంది. ఇందులో షేర్ల బైబ్యాక్ పాలసీపై నిర్ణయం తీసుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ మాసంతో ముగిసిన త్రైమాసికానికి కంపెనీ ఆర్థిక ఫలితాలు కూడా వెల్లడించనుంది. రెండో మధ్యంతర డివిడెండ్ ప్రకటించనుంది. 2018లో టీసీఎస్ షేర్ల బైబ్యాక్ పాలసీకి శ్రీకారం చుట్టింది.
రూ.16వేల కోట్ల విలువైన ఈక్విటీ షేర్లు తీసుకుంది. ఇప్పటికే రూ.2,100 కోట్ల విలువైన 7.16 కోట్ల షేర్లను బైబ్యాక్ చేసింది. అంతర్జాతీయ సానుకూల సంకేతాలకు తోడు టీసీఎస్ సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాలు సానుకూలంగా ఉండనున్నందున ఐటీ స్టాక్స్ పైన సానుకూల సంకేతాలు చూపించే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
గుడ్న్యూస్: ఆర్థిక వ్యవస్థ గాడినపడుతోంది.. 115 కంపెనీల సీఈవోలు ఏం చెప్పారంటే?
టీసీఎస్ ఫలితాల వైపు దృష్టి.. లాభాల స్వీకరణకు ఆసక్తి!
సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాల సీజన్ ప్రారంభమైంది. మారటోరియంపై కేంద్రం నిర్ణయం సానుకూలంగా ఉంది. ఈక్విటీ మార్కెట్లు పుంజుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉన్నాయి. దేశ ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా కోలుకుంటున్నాయి. మరోవైపు డొనాల్డ్ ట్రంప్కు కరోనా సోకడం, వ్యాక్సీన్ సంబంధ వార్తలు కూడా మార్కెట్ని నిర్దేశిస్తాయి. గతవారం సెన్సెక్స్, నిఫ్టీ భారీగా పెరిగినందున ఈ వారం లాభాల స్వీకరణకు మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో 7న విడుదలవుతున్న టీసీఎస్ క్వార్టర్ ఫలితాలపై అందరూ ఆసక్తిగా ఉన్నారు.
ఐటీ జూమ్
- టీసీఎస్ ఫలితాలను బట్టి ఐటీ షేర్లు సానుకూలంగా కదలాడవచ్చునని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. బుధవారం టీసీఎస్ ఫలితాలు ఐటీ స్టాక్స్ వృద్ధికి కీలకం కానున్నాయి.
- యంత్ర పరికరాల తయారీ కంపెనీల షేర్లు మార్కెట్ను అనుసరించే అవకాశం ఉంది. దేశీయ ఆర్థిక గణాంకాలు బాగుండటంతో ఈ షేర్లు సానుకూలంగా కదలాడవచ్చు.
- సెప్టెంబర్ నెల రిటైల్ విక్రయ డేటా ఆధారంగా వాహన షేర్ల కదలిక ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే వెహికిల్ సేల్స్ భారీగా పెరిగినట్లు మారుతీ సుజుకీ వంటి కంపెనీలు వెల్లడించాయి.
ఫార్మా లాభాల స్వీకరణకు మొగ్గు
- గతవారం బ్యాంకింగ్ షేర్లు ఆరు శాతం మేర ఎగిశాయి. మారటోరియం అంశంలో సుప్రీం కోర్టు తీర్పు చెప్పనుంది. దీనిపై బ్యాంకింగ్ షేర్లు ఆధారపడి ఉన్నాయి.
- టెలికం కంపెనీల షేర్లపై ఒత్తిడి ఉంటుందని భావిస్తున్నారు. ఈ రంగంలో తీవ్రమైన పోటీ, అవకాశాలపై అనిశ్చితి వంటివి కారణాలు.
- నిర్మాణాలు పెరగవచ్చునని, దీంతో సిమెంట్ రంగం రాణించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
- హెచ్యూఎల్, ఐటీసీ వంటి కంపెనీల ఫలితాలపై ఎఫ్ఎంసీజీ షేర్ల కదలిక ఆధారపడి ఉంటుంది.
- గత కొద్ది రోజులుగా ఫార్మా రంగం భారీగా ఎగిసింది. ఇప్పుడు దాదాపు స్థిరంగా ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో లాభాల స్వీకరణకు మొగ్గు చూపవచ్చునని భావిస్తున్నారు.