ఓయో రూమ్స్ నుండి ఫ్రీడమ్ ఆయిల్ వరకు: ఐపీవోలపై కన్నేయండి
ఇటీవల ప్రైమరీ మార్కెట్ల హవా కనిపిస్తోంది. ఈ వారంలో పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు వచ్చాయి.. వస్తున్నాయి. ఇందులో నిర్మా గ్రూప్ కంపెనీ విస్టాస్ కార్పోరేషన్, ఆటో క్లాసిఫైడ్ సంస్థ కార్ట్రేడ్ టెక్, గృహ రుణాల సంస్థ ఆప్టస్ వ్యాల్యూ హౌసింగ్ ఫైనాన్స్, స్పెషాలిటీ కెమికల్ కంపెనీ కెమ్ ప్లాస్ట్ సన్మార్ ఉన్నాయి. విస్టాస్ కార్పోరేషన్ రూ.5,000 కోట్లు, కార్ట్రేడ్ టెక్ రూ.2,998 కోట్లతో ఐపీవోకు వచ్చాయి.
ఇవి బుధవారం ముగుస్తున్నాయి. ఆప్టస్ వ్యాల్యూ హౌసింగ్ ఫైనాన్స్ రూ.2780 కోట్లు, కెమ్ ప్లాస్ట్ సన్మార్ రూ.3850 కోట్లతో మంగళవారం ఐపీవోకు రాగా, గురువారం ముగుస్తున్నాయి. నువోకో విస్తాక్ షేర్ ధర రూ.560-రూ.576, కార్ట్రేడ్ టెక్ ఇష్యూ ధర రూ.1585-రూ.1618, ఆప్టస్ వ్యాల్యూ హౌసింగ్ రూ.346-రూ.353, కెమ్ ప్లాస్ట్ సన్మార్ రూ.530-రూ.541 గా నిర్ణయించారు.
ఇవే కాకుండా ఫ్రీడమ్ బ్రాండ్ పైన వంట నూనెలు విక్రయించే జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ త్వరలో ఐపీవోకు రానుంది. ఓయో హోటల్స్ అండ్ రూమ్స్ కూడా వస్తోంది. ఈ రోజు క్రిష్నా డయాగ్నస్టిక్స్ నేడు ఐపీవోకి వస్తోంది. ఇక దేవ్యానీ ఇంటర్నేషనల్ ఐపీవో షేర్ అలాట్మెంట్ గురువారం ఉండనుంది.
ఫ్రీడమ్ ఐపీవో
ఫ్రీడంకు చెందిన జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ త్వరలో ఐపీవోకు వస్తోంది. హైదరాబాద్కు చెందిన ఈ సంస్థ రూ.2,500 కోట్లను సమీకరించేందుకు సెబీ వద్ద ఐపీఓ ప్రాసెక్టస్ దాఖలు చేసింది. ఈ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్(OFS). అంటే కంపెనీలోని ప్రస్తుత వాటాదారులు, తమ వాటాల్ని మార్కెట్లో విక్రయిస్తున్నారని అర్థం.
ఈ వాటాల అమ్మకం ద్వారా సేకరించిన మొత్తం వాటాదారులకే వెళ్తుంది. కంపెనీకి ఏమీ రాదు. ఈ కంపెనీ వంట నూనెల విభాగంలో ఉంది. 2019-21 మధ్య కాలంలో ఈ సంస్థ దాదాపు ఇరవై శాతం వార్షిక వృద్ధి నమోదు చేసింది. వచ్చే అయిదేళ్లలో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో విస్తరించాలని, చత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కార్యకలాపాలు చేపట్టాలని భావిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో 30 డిపోలు, వెయ్యిమందికి పైగా డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు.
మైక్రోసాఫ్ట్తో ఓయో చర్చ
ఓయో ప్రతిపాదిత భారీ ఐపీవో కోసం ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లను ఎంపిక చేసుకున్నదని తెలుస్తోంది. జేపీ మోర్గాన్, కోటక్ మహీంద్రా క్యాపిటల్, సిటీ... ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూడు బ్యాంకులు ఇటీవలే ఇష్యూకు సంబంధించిన పనిని ప్రారంభించాయని, మరిన్ని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు కూడా ఇందులో పాల్గొనవచ్చునని అంటున్నారు.
ఓయో ఇష్యూ సక్సెస్ అయితే ఇతర స్టార్టప్స్ ఐపీఓలకు వచ్చే అవకాశముందని అంటున్నారు. ఓయో ఇష్యూ పరిమాణం దాదాపు రూ.9000 కోట్ల వరకు ఉండొచ్చు. ప్రతిపాదిత ఐపీఓ ద్వారా ప్రస్తుత ఓయో పెట్టుబడుదారులు పాక్షికంగా నిష్క్రమించేందుకు అవకాశముందని తెలుస్తోంది. ఇటీవలే 660 మిలియన్ డాలర్ల వరకు రుణాలను పొందిన ఓయో ఇపుడు మైక్రోసాఫ్ట్ నుండి పెట్టుబడులను తీసుకునేందుకు చర్చలు జరుపుతోంది.
ఇతర ఐపీవోల విషయానికి వస్తే...
ఇటీవల ఐపీవోకు వచ్చిన క్రిష్నా డయోగ్నస్టిక్స్ 64.38 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. దీని ధరను రూ.365గా నిర్ణయించారు.దేవ్యానీ ఇంటర్నేషనల్ ఐపీవో 116.71 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. దీని ధరనురూ.86-రూ.90గా నిర్ణయించారు. ఈ కంపెనీ రూ.1838 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఐపీవో జాతర కొనసాగుతోంది. దీపావళికి పేటీఎం కూడా ఐపీవోకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఐపీవో ద్వారా రూ.16600 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.