ఐటీఆర్, క్యాష్ వోచర్, పాన్-ఆధార్ లింక్: గడువు మార్చి 31 వరకే... వెంటనే ఇవి పూర్తి చేయండి
ఏప్రిల్ 1, 2021 నుండి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతోంది. ఆర్థిక సంవత్సరం మారుతున్నందున పలు మార్పులు చోటు చేసుకోవడంతో పాటు, కొన్నింటికి డెడ్ లైన్ తేదీ అవుతాయి. వీటిని ఎట్టి పరిస్థితుల్లోను మరిచిపోవద్దు. మార్చి నెలలో చాలామంది ఏప్రిల్ 1వ తేదీ నుండి మారే కొత్త నిబంధనలను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే, మార్చి 31 డెడ్ లైన్గా ఎన్నో అంశాలు ఉంటాయి. ఈసారి కరోనా నేపథ్యంలో ప్రభుత్వం వివిధ పథకాలు, డెడ్ లైన్ను పొడిగించింది. అందులోను చాలా వరకు ఈ నెలతో ముగుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నెలలో ప్రారంభమయ్యే కొన్ని మార్పులు, అలాగే, మార్చి 31తో గడువు ముగిసే కొన్ని ఇక్కడ తెలుసుకుందాం.
పాన్-ఆధార్ లింక్
పాన్-ఆధార్ కార్డు లింకింగ్ కోసం కేంద్ర ప్రభుత్వం పలుమార్లు గడువును పొడిగించింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కరోనా కారణంగా సుదీర్ఘ పొడిగింపు అవశ్యంగా మారింది. పాన్-ఆధార్ లింకింగ్ గడువును కేంద్ర ప్రభుత్వం మార్చి 31, 2021 వరకు పొడిగించింది. మీ పాన్ నెంబర్ లింక్ చేయకుంటే ఏప్రిల్ 1వ తేదీ నుండి అది పని చేయదు. అప్పుడు పెద్ద మొత్తంలో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మార్చి 31వ తేదీలోపు లింక్ చేసుకోవాలి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఎల్టీసీ క్యాష్ వోచర్ బిల్లు
కరోనా నేపథ్యంలో కేంద్రం ఎల్టీసీ క్యాష్ వోచర్ వెసులుబాటును కల్పించింది. దీనికి సంబంధించిన బిల్స్ అన్నింటిని మార్చి 31వ తేదీలోపు సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడే ప్రయోజనం ఉంటుంది. ఆ బిల్లుల్లో జీఎస్టీ, వోచర్ నెంబర్ తప్పనిసరి. అక్టోబర్ 2020లో కేంద్ర ప్రభుత్వం ఎల్టీసీ క్యాష్ వోచర్ స్కీంను ప్రకటించింది.
ఐటీ రిటర్న్స్ ఫైలింగ్
2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీ రిటర్న్స్ ఫైలింగ్లో విఫలమైతే భారంగా మారుతుంది. ఆర్థిక సంవత్సరం ముగింపుకు చేరుకున్నందున వీలైనంత త్వరగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం మంచిది. గడువు ముగిసిన తర్వాత ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తే రూ.10వేలు లేట్ ఫీజు వసూలు చేస్తారు. రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారు రూ.వెయ్యి ఆలస్య రుసుము చెల్లించాలి. కాబట్టి మార్చి 31లోగా దాఖలు చేయడం మంచిది.
ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీం
కరోనాతో దెబ్బతిన్న వ్యాపారాలను పునరుద్దరించేందుకు కేంద్రం ఆత్మ నిర్భర్ భారత్ ప్రాజెక్టులో భాగంగా గత ఏడాది మే 13న క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీంను ప్రకటించింది. వ్యాపారులకు ప్రభుత్వం హామీ లేకుండా రుణాలు మంజూరు చేసింది. ఈ రుణాలు తీసుకున్న వారు కాన్ఫిడెన్స్ బై కాన్ఫిడెన్స్ స్కీం కింద డిక్లరేషన్ దాఖలు చేయడానికి గడువును 2021 మార్చి 31 వరకు పొడిగించింది.
డబుల్ ట్యాక్సేషన్
కరోనా కారణంగా విదేశీపౌరులు, వలసదారులు దేశంలో ఉండవలసి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వారు ఇక్కడ సంపాదించే ఆదాయంపై రెట్టింపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాంటి వారు మార్చి 31వ తేదీలోగా డిక్లరేషన్ సమర్పించాలి. అలా అయితే వారికి డబుల్ ట్యాక్సేషన్ నుండి ఉపశమనం ఉంటుంది.