ICICI సరికొత్త సదుపాయం: రూ.5 లక్షల వరకు ఫీజులు, ఇన్సురెన్స్ ఇలా ఈజీగా..
ప్రయివేటురంగ బ్యాంకింగ్ దిగ్గజం ICICI బ్యాంకు బుధవారం నాడు తన ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ పైన తక్షణ ఈఎంఐ సౌకర్యాన్ని ప్రారంభించింది. EMI @ Internet Banking పేరుతో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు ఐసీఐసీఐ బ్యాంకు ప్రకటించింది. ఇందుు బిల్ డెస్క్, రేజర్ పే అనే ఆన్ లైన్ పేమెంట్ గేట్ వేలతో పాటు వెయ్యికి పైగా వ్యాపార సంస్థలతో జట్టుకట్టింది. దీని ప్రకారం పెద్ద ట్రాన్సాక్షన్స్ను ఈఎంఐగా మార్చుకునే వెసులుబాటు కల్పించింది.
రూ.5 లక్షల వ్యాల్యూ వరకు
ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు ఇక నుండి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా రూ.50,000 నుండి రూ.5 లక్షల మధ్య నిర్వహించే భారీ ట్రాన్సాక్షన్స్ను ఆన్లైన్ ద్వారా ఈఎంఐగా మార్చుకోవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ వేదికగా కస్టమర్లకు ఈ సదుపాయం కల్పించడం బ్యాంకింగ్ పరిశ్రమలో ఇదే ప్రథమం. ఐసీఐసీఐ వెబ్ సైట్లోని EMI @ Internet Banking ను ప్రత్యేక విండో ఏర్పాటు చేశారు. రూ.5 లక్షల వరకు అధిక వ్యాల్యూ కలిగిన లావాదేవీలను ప్రీ-అప్రూవ్డ్ కస్టమర్లు నెలవారీ వాయిదాల్లో తేలిగ్గా మార్చుకోవచ్చు.
అదనపు ఛార్జీల్లేవ్
ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా భారీ మొత్తంలో చెల్లించే స్కూల్ ఫీజులు, గాడ్జెట్స్ కొనుగోళ్లు, బీమా ప్రీమియం చెల్లింపులను ఇక నుండి కస్టమర్లు మూడు నెలల నుండి పన్నెండు నెలల కాలంలో చెల్లించే సులభతర ఈఎంఐలుగా మార్చుకోవచ్చునని తెలిపింది. భారీ మొత్తాన్ని 3 నెలలు, ఆరు నెలలు, 9 నెలలు, ఏడాది కాల వ్యవధికి ఈఎంఐగా మార్చుకోవచ్చు. ఇందుకోసం అదనపు ఛార్జీలు లేవు.
వివిధ కేటగిరీలు.. వ్యాపార సంస్థలు
ఆన్ లైన్ షాపింగ్ పోర్టల్స్, ఇన్సురెన్స్, ట్రావెల్, ఎడ్యుకేషన్ స్కూల్ ఫీజులు, ఎలక్ట్రానిక్ చైన్ల వంటి వెయ్యికి పైగా క్యాటగిరీలలోని వ్యాపార సంస్థలను తన ప్లాట్ఫాంలోకి తీసుకు వచ్చి ఈ సదుపాయాన్ని కల్పిస్తోంది ఐసీఐసీఐ బ్యాంకు. ఇది కస్టమర్లకు ఎంతగానో ప్రయోజనకరం.