వాహనదారులకు షాక్: FASTAG తీసుకోకుంటే ఈ రాయితీలు ఉండవ్
FASTAG లేకుండా ప్రయాణిస్తే షాక్ తప్పదు! డిసెంబర్ 15వ తేదీ నుంచి అమలు కావాల్సిన FASTAG తప్పనిసరి జనవరి 15 నుంచి ప్రారంభమైంది. FASTAG లేకుంటే టోల్ ప్లాజాల వద్ద క్యూలో ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ కొత్త ఆంక్షలు తెరపైకి వస్తున్నాయి. గడువు పెంచినా చాలామంది ఎలక్ట్రానిక్ టోల్ సిస్టం వైపు మళ్ళించడం కష్టంగా మారింది. దీంతో సంబంధిత శాఖ కొత్త ఆంక్షలు తెస్తోంది.
SBI నుంచి అదిరిపోయే రీఫండ్ హోమ్లోన్ స్కీం: ప్రయోజనమెలా?
తిరుగు ప్రయాణానికి రాయితీ
టోల్ ప్లాజాల వద్ద రౌండ్ ట్రిప్కు రాయితీ ఉంటుంది. అంటే 24 గంటల్లో ఓ టోల్ ప్లాజా నుంచి వెళ్లి, అదే మార్గం గుండా వస్తే ఈ రాయితీ వర్తిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో రిటర్న్ టోల్ ఫీజులో సగం రాయితీ ఉంటుంది. ఇప్పుడు ఈ రాయితీని కేవలం FASTAG వాహనాలకు మాత్రమే వర్తింప చేస్తున్నారు.
సగం ఫీజు రాయితీ... రద్దు
టోల్ ప్లాజాల వద్ద ఎవరైనా టోల్ ఫీజును నగదు రూపంలో చెల్లిస్తే 24 గంటల్లో తిరుగు ప్రయాణమైతే రిటర్న్ ఫీజులో సగం రాయితీ వర్తించదు. అప్పుడు కూడా మొత్తం చెల్లించాల్సిందే. దీంతో FASTAG పైన మరింత అవగాహన రావడం లేదా నిర్లక్ష్యం చేసేవారు ఒత్తిడితో అయినా FASTAG కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి.
నెలమొత్తానికీ తగ్గింపు ఉండదు
నెలసరి పాస్కు కూడా టోల్ ప్లాజా వద్ద రాయితీ ఉంటుంది. దీనిని కూడా ఇక నుంచి కేవలం FASTAG వాహనాలకు మాత్రమే వర్తింప చేస్తున్నారు. నెల మొత్తానికి పాస్ తీసుకుంటే టోల్ ఛార్జీల్లో తగ్గింపు ఉంటుంది. FASTAG లేకుంటే నెలవారీ పాస్ రాయితీ ఇవ్వరు.
దగ్గరలోని వారికి కూడా...
టోల్ గేట్లకు 10 కి.మీ. పరిధిలో ఉండే వాహనాలకు కూడా ప్రత్యేక రాయితీ పాస్ అమలులో ఉంటుంది. దీనిని కూడా FASTAG ఉంటేనే వర్తింప చేస్తున్నారు.
హైబ్రిడ్ లైన్లకు నో..
ఇదిలా ఉండగా, జనవరి 15వ తేదీ వరకు అమలులో ఉన్న 25 శాతం హైబ్రిడ్ విధానం గడువు పొడిగింపుకు కేంద్రం సుముఖంగా లేదు. టోల్ ప్లాజాల వద్ద 25 శాతం లేన్లు నగదు చెల్లింపుకు వీలుగా ఉండేవి. 15వ తేదీ నుంచి ఒక్కో వైపున ఒక్కో లేన్ మాత్రమే నగదు చెల్లింపుకు కేటాయించారు. అయితే భారీ రద్దీ ఉంటే పంతంగి టోల్ ప్లాజా వంటి వాటిని ప్రస్తుతానికి మినహాయించారు.