ఇల్లు కొనాలనుకుంటున్నారా.. త్వరపడండి! 15% వరకు ధరలు పెరిగే ఛాన్స్
ఇంటిని కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే త్వరపడండి! ఎందుకంటే ఇళ్ల ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. గత ఏడాది కాలంగా సిమెంట్, స్టీల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇళ్ళ ధరలు 10 శాతం నుండి పదిహేను శాతం వరకు పెరగవచ్చునని రియాల్టర్స్ అపెక్స్ బాడీ క్రెడాయ్ మంగళవారం పేర్కొంది. కన్స్ట్రక్షన్ రా-మెటీరియల్ ధరలు తగ్గకుంటే ఇళ్ల ధరలు పెరుగుతాయని పేర్కొంది. ఇళ్ల ధరలు తగ్గితే డిమాండ్ కొంతకాలం పాటు పడిపోయే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని క్రెడియ్ కోరింది. కన్స్ట్రక్షన్ రా-మెటిరీయల్స్ పైన జీఎస్టీని తగ్గించాలని కోరింది.
కొనుగోలుదారులపై భారం
క్రెడాయ్లో దేశవ్యాప్తంగా 13,000 మందికి పైగా డెవలపర్లు సభ్యులుగా ఉన్నారు. 2020 జనవరి నుండి ఇళ్ల నిర్మాణానికి ఉపయోగించే ముడి సరుకు ధరలు నిరంతరం పెరుగుతున్నాయని తెలిపింది. దీనికి తోడు కరోనా, లాక్ డౌన్ ఇళ్ల నిర్మాణంలో జాప్యానికి కారణమైందని వెల్లడించింది. దీంతో ఇళ్ల నిర్మాణం ధరలు 18 నెలలుగా పదిహేను శాతం వరకు పెరిగాయని క్రెడియ్ జాతీయ అధ్యక్షులు పటోడియా తెలిపారు. సమీప భవిష్యత్తులో ముడి సరుకు ధరలు తగ్గించకుంటే ఈ భారం(15 శాతం వరకు) కొనుగోలుదారులపై పడుతుందన్నారు.
అందుకే బదలీ
పెరిగిన ధరల ప్రభావం కొనుగోలుదారులపై పడనుందని, కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ముడి సరుకు ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం, సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ సౌకర్యాన్ని కల్పించడం గానీ, జీఎస్టీని హేతుబద్ధీకరించడం గానీ చేయాలన్నారు. గత కొంతకాలంగా రా-మెటీరియల్ ధరలు పెరుగుతున్నాయని, మున్ముందు తగ్గే అవకాశం కనిపించడం లేదన్నారు. డెవలపర్లు ప్రస్తుతం పెరిగిన ధరలను భరించే స్థాయిలోలేరని, అందుకే వాటిని కొనుగోలుదారులకు బదలీ చేయాల్సి వస్తుందన్నారు.
మేం పెంచక తప్పదు
సిమెంట్, స్టీల్ వంటి రా-మెటీరియల్ ధరలు పెరుగుతున్నాయని, దీంతో డెవలపర్స్కు మార్జిన్ మరీ తగ్గిపోయిందని, ధరలకు సంబంధించి డెవలపర్స్ పైన తీవ్రమైన ఒత్తిడి నెలకొందని, ఇన్పుట్ కాస్ట్స్ పెరిగాయని, అవసరమైతే తాము ధరలు పెంచుతామని గురుగ్రామ్కు చెందిన సిల్వర్ గ్రేడ్ గ్రూప్ సీఈవో అన్నారు.