6 నెలల్లో రూ.10వేలు పెరిగిన బంగారం: మళ్లీ ఆ రిటర్న్స్ ఉండవా, మీరేం చేయాలి?
ఈ ఏడాది బంగారం ధరలు స్వల్పకాలంలోనే భారీగా పెరిగాయి. గత ఏడాది మందగమనం కారణంగా రూ.33వేల నుండి రూ.34వేలుగా ఉన్న బంగారం రూ.39వేలకు చేరుకుంటేనే సామాన్యులు ఎక్కువగా పెరిగిందని భావించారు. కానీ ఇప్పుడు కరోనా మందగమనం కంటే ఎక్కువగా దెబ్బతీసి, ధరను నాటితో పోలిచ్తే కాస్త అటు ఇటుగా రెండింతలు పెరిగింది. ఎంసీఎక్స్లో, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో పసిడిపై కరోనాతో పాటు చమురు, అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతల వంటి అంశాలు ఒత్తిడిని పెంచాయి. దీంతో 25 శాతానికి పైగా పెరిగాయి.
షాప్స్లో డిమాండ్ లేకున్నా పెరుగుదల: ఇక బంగారం ధర తగ్గుతుందా, ఇన్వెస్ట్ చేయవచ్చా?
రూ.10వేలకు పైగా పెంపు.. రిటర్న్స్ టెంప్ట్ చేసేలా
బంగారం ధర ఈ ఏడాది ఆరంభంలో 10 గ్రాములు రూ.39,000 పలికింది. ఆరు నెలలు గడిచేసరికి ఏకంగా రూ.10వేల నుండి రూ.11 వేలకు పైగా పెరిగి రూ.49 వేల నుండి రూ.50 వేలకు పైకి చేరుకుంది. ఎంసీఎక్స్లో ఇటీవల రూ.49,500 పలికింది. ప్రస్తుతం రూ.49,000కు పైన ఉంది. కరోనా సహా వివిధ కారణాల వల్ల సామాన్యులు బంగారాన్ని కొనుగోలు చేయడానికి భయపడుతున్నారు. కానీ ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించి పసిడిపై పెట్టుబడి పెడుతున్నారు. కొత్తగా లేదా అప్పుడప్పుడు ఇన్వెస్ట్మెంట్ వైపు మొగ్గు చూపే వారికి బంగారంపై ప్రస్తుత రిటర్న్స్ టెంప్ట్ చేసేలా ఉంది.
మరి ఇన్వెస్ట్ చేయవచ్చా?
ప్రస్తుతం బంగారం ధర బాహ్య పరిస్థితులపై ఆధారపడి ఉందని, అంటే కరోనా, భౌగోళిక, రాజకీయ పరిస్థితుల్లో అనిశ్చితి కొనసాగుతోందని, కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం ధరను అంచనా వేయలేమని కొంతమంది బులియన్ మార్కెట్ నిపుణలు అంటున్నారు. ఎందుకంటే కరోనా కేసులు పెరిగితే పసిడి ధర పెరుగుతుందని, కేసులు అదుపులోకి వస్తే ఈ విలువైన లోహంపై ఒత్తిడి తగ్గుతుందని, అలాగే ఇతర అంశాలు కూడా పరిగణలోకి తీసుకోవాలని చెబుతున్నారు. అయితే కరోనా రెండోసారి విజృంభించకుంటే, ఇలాగే క్రమంగా తగ్గుముఖం పడితే పసిడిపై ఒత్తిడి మాత్రం తగ్గుతుందని చెబుతున్నారు.
మళ్ళీ ఈ 6 నెలల రిటర్న్స్ రాకపోవచ్చు
అందుకే దీర్ఘకాలాన్ని దృష్టిలో పెట్టుకొని పసిడిపై ఇన్వెస్ట్ చేయడం మంచిదని సూచిస్తున్నారు. స్వల్పకాలంలో చేయాలనుకున్నా ఈ పోర్ట్పోలియోను కాస్త పెంచుకోవచ్చునని సూచిస్తున్నారు. అయితే ధరలు ఈ ఆరునెలల కాలంలోనే రూ.10వేలకు పైగా పెరిగాయని, ముందుముందు అలా పెరుగుతుందని కానీ, అలా అని పెరగదని కానీ కచ్చితంగా చెప్పే పరిస్థితులు లేవంటున్నారు. ఈ ఆరు నెలల కాలంలో వచ్చినట్లు భారీ రిటర్న్స్ ఆశించకుండా ఇన్వెస్ట్ చేయవచ్చునని చెబుతున్నారు.
రిటర్న్స్తో సంబంధం లేకుండా.. 15 శాతం వరకు
బంగారం ధర ఇప్పటికే చాలా వేగంగా.. అలాగే ఊహించని విధంగా పెరిగిందని, కాబట్టి ఆచితూచి పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. ప్రస్తుత రిటర్న్స్తో సంబంధం లేకుండా 5 శాతం నుండి 15 శాతం వరకు తమ పోర్ట్పోలియోలో బంగారం కోసం కేటాయించాలని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. గత ఆరు నెలల్లో బంగారం అమాంతం పెరిగిందని, అలా అని మొత్తం ఒక వైపు చూడవద్దని, పోర్ట్పోలియోలో కొంత భాగం కేటాయిస్తూ వైవిద్యత ప్రదర్శించాలంటున్నారు.