2020లో బంగారం కంటే ఎక్కువగా రిటర్న్స్ ఇచ్చిన మెటల్: పసిడి 46% నుండి 28 శాతానికి..
బంగారం ధరలు గత ఏడాది (2020)లో 25 శాతానికి పైగా రిటర్న్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. 2020 ప్రారంభంలో పసిడి ధరలు కాస్త సానుకూలంగా ఉన్నప్పటికీ, మార్చి నెలలో కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్, ఆంక్షల కారణంగా పసిడికి రెక్కలు వచ్చాయి. దీంతో ఆగస్ట్ నెలలో అంతర్జాతీయ మార్కెట్లో 2072 డాలర్లకు, దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 50,200 క్రాస్ చేసింది. ఆ తర్వాత భారీగా తగ్గి, 1900 డాలర్ల దిగువన, రూ.50,000 స్థాయిలో ముగిశాయి. బంగారం 25 శాతానికి పైగా రిటర్న్స్ ఇచ్చింది. అయితే బంగారం కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చిన మరో మెటల్ కూడా ఉంది. అదే వెండి.
ఏ మెటల్ ఎంత రిటర్న్స్ ఇచ్చిందంటే
2020 క్యాలెండర్ ఏడాదిలో వెండి... బంగారం కంటే మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఓ సమయంలో 49 శాతం రిటర్న్స్ ఇచ్చిన వెండి ఏడాది ముగిసే సమయానికి ఔన్స్ పైన 26.64 శాతం రిటర్న్స్ అందించింది. పల్లాడియం 2020లో 20 శాతం రిటర్న్స్ అందించింది. ప్లాటినమ్ 11 శాతం రిటర్న్స్ ఇచ్చింది. పల్లాడియం వరుసగా ఐదో సంవత్సరం మంచి రిటర్న్స్ అందించింది. గత దశాబ్ద కాలంలోనే బంగారం ధర 2020లో మంచి రిటర్న్స్ అందించింది.
భారత్లో...
భారత్లో 2020లో వెండి 50 శాతం రిటర్న్స్ ఇచ్చింది. బంగారం 28 శాతం రిటర్న్స్ ఇచ్చింది. ఆగస్ట్లో బంగారం రూ.56,200 తాకగా, వెండి రూ.80,000 సమీపానికి చేరుకుంది. ఆగస్ట్ రెండో వారం నుండి కరోనా వ్యాక్సీన్, వ్యాక్సినేషన్ ప్రకటనల నేపథ్యంలో పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. లేదంటే గత ఏడాది బంగారం, వెండి మరింతగా అదిరిపోయే రిటర్న్స్ ఇచ్చేది.
అలా 28 శాతానికి పరిమితం
2020లో మంచి రిటర్న్స్ ఇచ్చిన బంగారం, వెండి 2021లోను ఆ ఒరవడిని కాస్త కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది పసిడి రూ.65,000కు, వెండి రూ.90,000కు చేరుకోవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 31, 2019లో బంగారం 10 గ్రాములు రూ.39,000కు కాస్త అటు ఇటుగా ఉంది. 2020 ఆగస్ట్ నాటికి 46 శాతం లాభపడింది. అయితే ఆ తర్వాత వ్యాక్సీన్ ప్రకటనతో రిటర్న్స్ 28 శాతానికి పరిమితమయ్యాయి.