రోజుకు రూ.800కు పైగా పెరుగుదల: పసిడి ర్యాలీ కొనసాగుతుందా అంటే?
దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు శుక్రవారం 10 గ్రాములు రూ.57,008 పలికింది. కిలో వెండి ధర రూ.576 పెరిగి రూ.77,840 పలికింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎన్నడూ లేనంతస్థాయికి పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.58,330, కిలో వెండి రూ.78,300 పలికింది. కరోనా మహమ్మారి అనంతరం గత కొద్దిరోజులుగా బంగారం ధరలు వేగంగా పెరుగుతున్నాయి.

రోజుకు రూ.800 నుండి రూ.వెయ్యి పెరుగుదల
ఎంసీఎక్స్లో బంగారం ధరలు నిన్న మధ్యాహ్నం ఓ సమయంలో తగ్గినప్పటికీ, పెరుగుదలతో ముగిశాయి. రెండు రోజుల్లో పసిడి ధర రూ.వెయ్యికి పైగా పెరిగింది. వారం రోజుల్లోనే బంగారం ధర మూడుసార్లు భారీగా పెరిగింది. రోజుకు రూ.800 నుంచి 1000 రూపాయల మధ్య పెరగడం గమనార్హం. పసిడి ధర గరిష్ట స్థాయిలో రూ.65,000 వరకు పెరగవచ్చని మార్కెట్ వర్గాల అంచనా. డాలర్ మారకంతో రూపాయి విలువ క్షీణించడం ఇందుకు కారణమైందని ఓ కారణమని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రిలీఫ్ ప్యాకేజీపై అనిశ్చితి, అమెరికా-చైనా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండటం కూడా పసిడి, వెండి ధరలు పెరగటానికి కారణాలుగా ఉన్నాయి.

వారాల్లోనే పెరుగుదల
ముంబై బులియన్ మార్కెట్లో 24క్యారెట్ల బంగారం రూ.56,126 వద్ద ముగిసింది. కిలో వెండి రూ.1,396 పెరిగి రూ.75,103 పలికింది. బులియన్ మార్కెట్లో పసిడి ధర ఈ ఏడాది ఇప్పటి వరకు 40 శాతం పెరిగాయి. వెండి ధర 65 శాతం వరకు పెరిగింది. వెండి ధర గత మూడు వారాల్లోనే 45 శాతం వరకు పెరిగింది.

ర్యాలీ కొనసాగుతుందా?
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 2,080 పైకి చేరుకుంది. వెండి ఔన్స్ 30 డాలర్లకు చేరుకుంది. కరోనా నేపథ్యంలో వివిధ దేశాల ఆర్థిక ప్యాకేజీ, అమెరికా-చైనా మధ్య ఉద్రిక్తతలు కూడా పసిడి, వెండి ధరల పెరుగుదలకు కారణం. పసిడి, వెండి ప్రస్తుతానికి పెరుగుతున్నప్పటికీ దీర్ఘకాలంలో ఈ ర్యాలీ కొనసాగుతుందా అనేది చెప్పటం కష్టమని, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications