Gold prices today: సరికొత్త రికార్డ్ దిశగా బంగారం ధరలు, ఈ వారం ఎలా ఉండొచ్చు?
బంగారం ధరలు ఈరోజు (ఆగస్ట్ 3) పెరిగాయి. కరోనా కేసులు, అంతర్జాతీయ మార్కెట్లు వంటి వివిధ కారణాల ప్రభావం దేశీయ పసిడి మార్కెట్ పైన పడింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ఉదయం 0.08 శాతం పెరిగి రూ.53,490 పలికింది. రూ.54,000కు చేరువలో ఉంది. వెండి ఫ్యూచర్స్ రూ.700 లేదా 1.1 శాతం పెరిగి కిలో రూ.65,690గా ఉంది. కరోనా వెలుగుచూసినప్పటి నుండి బంగారం ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా భారీగా పెరుగుతోన్న విషయం తెలిసిందే.
బంగారం భగభగ.. 10 రోజుల్లో రూ.4వేలు జూమ్
ఈ వారం పసిడి ధర ఎలా ఉండవచ్చు
పసిడి అక్టోబర్ కాంట్రాక్ట్ రూ.54,271 ఎగువకు వెళ్తే మరింత పెరిగే అవకాశముందని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. లేదంటే స్థిరంగా ఉండే అవకాశాలు ఉన్నాయన్నారు. స్థిరత్వం చోటు చేసుకుంటే ఆ తర్వాత కాంట్రాక్ట్ రూ.52 వేలకు పైన, ఆ తర్వాత రూ.52వేల దిగువకు వచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.
వెండి ధర రూ.63,285 దిగువకు రాకుంటే సానుకూలంగా ఉండవచ్చునని, అయితే మరింతగా పెరిగే అవకాశాలు తక్కువే అంటున్నారు. లాభాలు స్వీకరించవచ్చునని సూచిస్తున్నారు.
2,000 డాలర్ల దిశగా బంగారం
గత సెషన్లో బంగారం ధర 10 గ్రాములకు రూ.650(1.2 శాతం) పెరిగింది. అలాగే వెండి రూ.2,300(3.6 శాతం) ఎగిసింది. ఈ జనవరి నుండి మన దేశంలో బంగారం ధరలు 35 శాతం పెరిగి, సరికొత్త గరిష్టాన్ని తాకాయి. ఇంతకుముందు సెషన్లో ఓ సమయంలో బంగారం రూ.53,700 పలికింది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. స్పాట్ గోల్డ్ 0.1 శాత ఎగిసి ఔన్స్ 1,976.47 డాలర్లకు చేరుకుంది. అంతకుముందు సెషన్లో 1,984 కూడా పలికింది. 2,000 డాలర్ల సమీపానికి వచ్చింది. ఇతర అతి ఖరీదైన లోహాల విషయానికి వస్తే వెండి 0.1 శాతం తగ్గి ఔన్స్కు 24.35, పల్లాడియం 1.1 శాతం తగ్గి 2,068.98 డాలర్లకు చేరుకుంది.
జూలైలో రికార్డ్ పెరుగుదల
అంతర్జాతీయ మార్కెట్లో జూలై నెలలో బంగారం ధర ఏకంగా 11 శాతం ఎగిసింది. నెలవారీగా చూస్తే 2012 తర్వాత ఇది రికార్డ్. ఔన్స్ ధర సింగపూర్ మార్కెట్లో బంగారం 2,009.50 డాలర్లకు, స్పాట్ 24,3212 డాలర్లకు చేరుకుంది. దేశీయంగా కూడా జూలై నెలలో బంగారం ధరలు భారీగానే పెరిగాయి. పసిడి ఒక్క నెలలోనే పదకొండు శాతం పెరుగుదలతో ఎనిమిదేళ్ల రికార్డులను చేరుకుందని బులియన్ మార్కెట్ నిపుణులు మనోజ్ జైన్ అన్నారు.
బంగారం ధరలు..
బంగారం ధరలు గత రెండు వారాలుగా పెరుగుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం రూ.56,500కు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం రూ.540 పెరిగింది. ఢిల్లీలోను బంగారం రూ.260 పెరిగింది. 24 క్యారెట్ల ధర రూ.53,460, 22 క్యారెట్ల బంగారం రూ.52,260 పలికింది.