ఈ ఏడాది మొదటిసారి బంగారం 'డిస్కౌంట్', ఏడాదిలో 14% తగ్గిన ధర
ఫిజికల్ గోల్డ్ ధరలు ఈ ఏడాది మొదటిసారి డిస్కౌంట్లోకి వచ్చాయి. అంతకుముందు వారం పెరిగిన పసిడి ధరలు, గత కొద్ది సెషన్లుగా తగ్గుతూ వస్తోంది. కరోనా సంబంధ ఆంక్షల ప్రభావం బంగారం రిటైల్ డిమాండ్ పైన పడింది. డీలర్స్ ఔన్స్కు 2 డాలర్ల డిస్కౌంట్ ఇస్తున్నారు. అంతకుముందు వారం 2 డాలర్ల ప్రీమియం ఉంది. దేశంలో బంగారంపై 10.75 శాతం ఇంపోర్ట్ డ్యూటీ, 3 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. దాదాపు ప్రతి రాష్ట్రం కూడా కరోనా సంబంధ ఆంక్షలు విధించింది.
ఫ్యూచర్ మార్కెట్లో ధర
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో 10 గ్రాముల పసిడి ధరలు(జూన్) గతవారం రూ.46,785 వద్ద ముగిసింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.47,080 వద్ద క్లోజ్ అయింది. గత కొద్ది సెషన్లుగా ధరలు తగ్గినప్పటికీ, చివరి సెషన్లో అతి స్వల్పంగా రూ.59 పెరిగింది. అంతకుముందు చాన్నాళ్లకు రూ.48,000 సమీపానికి చేరుకున్న పసిడి క్రితం వారం ముగిసే సమయానికి రూ.46,800 దిగువకు వచ్చింది. సిల్వర్ మే ఫ్యూచర్స్ రూ.67,492 వద్ద, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.68,423 వద్ద క్లోజ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ పసిడి రూ.1768.60 డాలర్ల వద్ద, ఔన్స్ సిల్వర్ 25.915 డాలర్ల వద్ద క్లోజ్ అయింది.
1800 డాలర్లను తాకి కిందకు..
పెరుగుతున్న కరోనా కేసులు, పడిపోతున్న బిట్ కాయిన్ వ్యాల్యూ నేపథ్యంలో బంగారం ధరలు ఏప్రిల్ చివరలో కాస్త పుంజుకోవచ్చునని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. 1800 డాలర్లకు చేరుకుంటుందని భావించారు. వారి అంచనాలు నిజం చేస్తూ ఏప్రిల్ 21, 22 తేదీల్లో బంగారం ధరలు 1798 డాలర్లకు చేరుకున్నాయి. ఆ తర్వాత తగ్గుముఖం పట్టి ప్రస్తుతం 1768 డాలర్ల వద్ద కదలాడుతోంది.
14 శాతం తక్కువ
బంగారం ధరలు ప్రస్తుతం 40 రోజుల కనిష్టం వద్ద ఉన్నాయి. మే నెలలో తిరిగి పైకి చేరుకోవచ్చునని, అలాగే జూలై, ఆగస్ట్ సమయానికి బంగారం తిరిగి 2000 డాలర్లను తాకే అవకాశాలు లేకపోలేదని అంతర్జాతీయ బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది ఇదే ఏప్రిల్ కాలంతో పోలిస్తే పసిడి ధరలు 14 శాతం తక్కువగా ఉన్నాయి.