హైదరాబాద్లో బంగారం రికార్డ్, 5రోజుల్లో రూ.2,000 జంప్: ధరల పెరుగుదల నిలిచిపోయే ఛాన్స్ లేదా?
బంగారం ధరలు రికార్డ్ హైకి చేరుకుంటున్నాయి. ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. శుక్రవారం ఎంసీఎక్స్లో 10 గ్రాముల ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.6 శాతం ఎగిసి రూ.51,010 పలికింది. ఓ సమయంలో రికార్డ్ గరిష్టం రూ.51,184కు కూడా చేరుకుంది. వెండి ధర కిలో రూ.61,221 పలికింది. వారం లెక్కన చూస్తే గత వారంలో బంగారం ధర 4 శాతం పెరగగా, వెండి ఏకంగా 15 శాతం పెరిగింది.
Gold prices: బంగారం పైపైకి.. సెప్టెంబర్ నాటికి భారీ షాక్?
రూ.2,000 పెరిగిన బంగారం, రూ.8,000 పెరిగిన వెండి
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో శుక్రవారం బంగారం ధరలు రూ.720 పెరిగి ఆల్ టైమ్ హై రూ.53,000 దాటింది. కిలో వెండి రూ.900 నష్టపోయి రూ.61,100 పలికింది. ఢిల్లీలో 10 గ్రాముల బంగారం రూ.51,946 పలికింది. వారం రోజుల్లో బంగారం ధర దాదాపు రూ.2,000 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం రూ.1,800 పెరగగా, 24 క్యారెట్ల పసిడి రూ.1,900 వరకు పెరిగింది. దీంతో హైదరాబాద్లో ఈ వారం ప్రారంభంలో రూ.51,300కు పైగా ఉన్న పసిడి ఇప్పుడు రూ.53,200 పైకి చేరుకుంది. వెండి అయితే ఏకంగా కిలో రూ.52,900 నుండి రూ.61,000కు పైకి చేరుకుంది. రూ.8,000కు పైగా పెరిగింది. అంటే ఐదు రోజుల్లో ధర భారీగా పెరిగింది.
30 శాతం పెరిగిన ధరలు
బంగారం ధరలు ఈ క్యాలెండర్ ఇయర్లో ఇప్పటి వరకు 30 శాతం వరకు పెరిగాయి. గురువారం ఎంసీఎక్స్లో బంగారం పది గ్రాములు 50,700కు పైకి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లోను బంగారం ధరలు తొమ్మిదేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. ఔన్స్ బంగారం 1,837 డాలర్ల నుండి 1904 డాలర్లకు చేరుకుంది. వెండి ధర 23 డాలర్లకు పరుగు తీసింది. 2011 తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో 1900 మార్క్ దాటింది.
తగ్గుముఖం పడుతుందా అంటే?
ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో బంగారం వంటి సురక్షిత పెట్టుబడుల వైపు ఇన్వెస్టర్లు దృష్టి సారించారు. అంతకంతకూ పెరుగుతున్న పసిడి ధరలు ఇకనైనా నిలిచిపోతాయా అంటే చెప్పలేని పరిస్థితులే అంటున్నారు నిపుణులు. కరోనా ప్రభావం, అమెరికా-చైనా ట్రేడ్ వార్ వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే బంగారం ధరలు ఇప్పట్లో తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపించడం లేదని అంటున్నారు.
అందుకే బంగారానికి డిమాండ్
ధరలు భారీగా పెరగడంతో ఫిజికల్ బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి తగ్గింది. సామాన్యులు కొనుగోలు చేయలేకపోతున్నారు. అయితే ఇన్వెస్టర్లు మాత్రం పసిడి కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి పలు కారణాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కరోనా, అమెరికా-చైనా ట్రేడ్ వార్ ప్రభావంతో పాటు ప్రస్తుతం డిపాజిట్లపై వడ్డీ రేట్లు అంతకంతకు పడిపోతున్నాయి. కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోలు చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు పసిడి వైపు చూస్తారని చెబుతున్నారు. కాబట్టి బంగారంపై మరికొంత కాలం ఒత్తిడి ఉంటుందని చెబుతున్నారు.
3000 డాలర్లకు..
గత ఏడాది మందగమనం తర్వాత ధరలు పెరిగాయి. గత నాలుగు నెలలుగా కరోనా కారణంగా పెరుగుదలకు అంతేలేకుండా పోయింది. బంగారం ధర వచ్చే ఏడాది చివరి నాటికి 3000 డాలర్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని నిపుణులు మొదటి నుండి అంచనా వేస్తున్నారు. గతంలో బంగారం ధరలు పెరిగిన సమయంలో ఆ తర్వాత కొంతకాలానికి తగ్గుముఖం పట్టాయని, కానీ ఈసారి ఎంతకాలం పడుతుందో తెలియని పరిస్థితి అంటున్నారు. వచ్చేవి దసరా, దీపావళి పండుగలు. ఈ సీజన్లో ధరలు మరింతగా పెరిగే అవకాశం లేకపోలేదు.