భారీగా పెరుగుతున్న బంగారం ధర: ఆ తర్వాత ధర ఆగిపోతుందా! 'ఒత్తిళ్లు' సహా కారణాలివే?
బంగారం ధరలు మళ్లీ రికార్డు ధరల సమీపానికి చేరుకుంటోంది. 22 క్యారెట్ల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ.46,100కు అటు ఇటుగా ఉంటే, 24 క్యారెట్ల బంగారం రూ.47,100 పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్ 1,700 డాలర్లు దాటింది. అంతర్జాతీయ మార్కెట్లో ఏడాదిలో 1,250 డాలర్లకు పైగా పెరిగింది. బంగారం ధర ఎంసీఎక్స్లో శుక్రవారం 10 గ్రాములకు 0.3 శాతం పెరిగి రూ.48,800 చేరుకుంది. అంతకుముందు సెషన్ కంటే 1.4 శాతం పెరిగింది.
శుభవార్త: గృహ రుణాలపై వడ్డీ రాయితీ పథకం మరో ఏడాది పొడిగింపు
భారీగా పెరుగుతున్న బంగారం ధర
ఏప్రిల్ నెలలో బంగారం భారత మార్కెట్లో 10 గ్రాములకు రూ.47,327 రికార్డ్ ధర పలికింది. శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 0.4 శాతం పెరిగి ఔన్స్కు 1,735.67 డాలర్లు పలికింది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.3 శాతం పెరిగి 1,746.20 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో మూడు వారాల గరిష్టానికి చేరుకుంది. దేశీయ మార్కెట్లో ఎంసీఎక్స్లో రూ.48,800 పలకడం ద్వారా రికార్డ్ ధరకు సమీపంలో ఉంది. గత కొద్ది రోజులుగా బంగారం ధర తిరిగి పెరుగుతోంది.
ఎందుకు పెరుగుతోంది?
బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ పరిణామాలు కారణంగా చెబుతున్నారు. గత ఏడాది అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్తుందనే సంకేతాలు వచ్చినప్పటి నుండి పసిడి ధరల్లో స్థిరత్వం కనిపించడం లేదు. మరోవైపు మందగమనం, కరోనా వల్ల స్టాక్ మార్కెట్లు నష్టాలు చవి చూస్తున్నాయి. లాభాల్లోకి వచ్చినా నిలకడ కనిపించడం లేదు. దీంతో ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా చూస్తున్నారు. దీంతో పసిడికి డిమాండ్ పెరిగింది.
సెంట్రల్ బ్యాంకులు నిల్వలు పెంచుకోవడం
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుకోవడం కూడా బహిరంగ మార్కెట్లో పరుగు పెట్టడానికి కారణమవుతోంది. ఆర్బీఐ వద్ద 653.01 మెట్రిక్ టన్నుల పసిడి నిల్వలు ఉన్నాయి. భారతీయుల వద్ద 25వేల మెట్రిక్ టన్నుల బంగారం ఉంటుందని అంచనా. బంగారం ధరలు ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదని అంటున్నారు. 2021 చివరి నాటికి రూ.82వేలకు చేరుకోవచ్చునని గతంలో అంచనాలు వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో 3వేల డాలర్లు పలుకవచ్చునని చెప్పాయి.
బంగారం డిమాండ్ కొనసాగుతుందా
ఇన్వెస్టర్లు చాలామంది బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు. అయితే అంతకంతకూ పెరుగుతున్న ధరల కారణంగా సామాన్యులు ఆదాయాలు లేక కొనే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడు రోజు రోజుకు భారీగా పెరుగుతోంది. కరోనా ప్రభావం తగ్గాక.. మార్కెట్ కుదురుకుంటే బంగారం పరిస్థితి ఏమిటనే ఆందోళన కూడా కొంతమందిలో ఉంది.
కేంద్ర బ్యాంకులపై ఒత్తిడి
ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో బంగారం ధర భారీగా పెరుగుతున్నప్పటికీ, పరిస్థితులు సద్దుమణిగాక ఓ చోట స్థిరపడటం ఖాయమని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఇందుకు వివిధ కారణాలు చెబుతున్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు లాక్ డౌన్ సడలింపులు విధించడం, ఆర్థిక వ్యవస్థలు నెమ్మదించిన ప్రభావం పడుతోంది. దీంతో పసిడి నిల్వలు విక్రయించాలనే ఒత్తిడి ఆయా దేశాల కేంద్రీయ బ్యాంకులపై ఉంటుందని జెఫ్రీస్ అంతర్జాతీయ ఈక్విటీ వ్యూహాల విభాగాధిపతి క్రిస్టోఫర్ వుడ్ అంచనా వేశారు. పసడి నిల్వలు గణనీయంగా ఉండటంతో ఆర్బీఐ పైన కూడా ఈ ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చునని చెబుతున్నారు. పసిడి నిల్వలు ఎక్కువగా ఉన్న సౌదీ అరేబియాలోను ఈ తరహా పరిస్థితులు చోటు చేసుకోవడం ఖాయమని చెబుతున్నారు.
బంగారం ధర ఆ తర్వాత పెరగదా?
ఆర్బీఐ వద్ద 653 టన్నులు ఉండగా, సౌదీ వద్ద 324 టన్నుల పసిడి నిల్వలు ఉన్నాయి. గతంలో కంటే ధర పెరిగినందున వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు ఈ నిల్వలను విక్రయించే అవకాశాలు కొట్టి పారేయలేమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఔన్స్ బంగారం 1800 డాలర్ల నుండి 1900 డాలర్లు అధిగమించకపోవచ్చునని క్రిస్టోఫర్ వుడ్ అంటున్నారు. 2011లో ఔన్స్ బంగారం 1921 డాలర్లు తాకిందని గుర్తు చేశారు. కొన్ని ఏజెన్సీలు బంగారం ధర 2000 డాలర్లకు పెరుగుతుందని చెప్పగా.. క్రిస్టోఫర్ వుడ్ మాత్రం సమీప భవిష్యత్తులో 1900 డాలర్లు దాటకపోవచ్చునని చెబుతున్నారు.