Gold prices today: బంగారం ధరలు మళ్లీ రూ.56,000కు చేరుకుంటాయా, ఇప్పుడే కొనాలా?
బంగారం ధరలు నేడు దాదాపు స్థిరంగా ఉన్నాయి. నేడు (ఏప్రిల్ 11, సోమవారం) జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ అతి స్వల్పంగా రూ.6 లాభపడి రూ.52,077 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.11 పెరిగి రూ.52,369 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా దాదాపు స్థిరంగానే ఉంది. మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.24 లాభపడి రూ.66,968 వద్ద, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.67,786 వద్ద ట్రేడ్ అయింది.
అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి ధరలు అతి స్వల్పంగా తగ్గగా, సిల్వర్ ఫ్యూచర్స్ అదేస్థాయిలో పెరిగాయి. గోల్డ్ ఫ్యూచర్స్ (జూన్ 22) నేడు 3 డాలర్ల మేర నష్టపోయి 1942.70 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 1945.60 డాలర్ల వద్ద ముగిసింది. ఆల్ టైమ్ గరిష్టంతో పోలిస్తే 130 డాలర్ల మేర తగ్గింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.005 డాలర్లు తగ్గి 24.828 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 24.823 డాలర్ల వద్ద ముగిసింది.
ఈ ప్రభావం
కమోడిటీ మార్కెట్ నిపుణుల ప్రకారం బంగారం ధరలు ఇటీవల గత కొద్దివారాలుగా కన్సాలిడేషన్ జోన్లో ఉన్నాయి. యూఎస్ ఫెడ్ వడ్డీ రేటు పెంపు అంశం ప్రభావం చూపిందని అంటున్నారు. అయితే రష్యా - ఉక్రెయిన్ ఉద్రిక్తతల ప్రభావం పసిడి పైన ఉంటుంది. అలాగే, వచ్చే పెళ్లిళ్ల సీజన్ బంగారానికి మద్దతు ఇస్తుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంసీఎక్స్లో గోల్డ్ ఫ్యూచర్ స్వల్పకాలంలో 53,500 స్థాయి, మధ్యకాలంలో రూ.56,000కు చేరుకోవచ్చునని అంటున్నారు. అంటే సమీప భవిష్యత్తులో బంగారం కొనుగోలు చేయాలనుకుంటే ఇప్పుడు కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలించవచ్చునని సూచిస్తున్నారు.
56,000కు చేరుకుంటుందా?
ప్రస్తుతం పసిడి ధర అంతర్జాతీయ మార్కెట్లో 1940 డాలర్లకు పైన ఉంది. 1950 డాలర్ల నుండి 1960 డాలర్ల మధ్య ప్రతిఘటనను ఎదుర్కొంటోంది. ఇది 1900 స్థాయిల వద్ద తక్షణ మద్దతును కలిగి ఉంది. ఇది బలమైన మద్దతు 1870 స్థాయి వద్ద ఉంది. 1960 డాలర్లను అధికమిస్తే మాత్రం 2000 డాలర్లకు చేరుకోవచ్చునని, ఆ తర్వాత కొంతకాలం పరుగు ఉండవచ్చునని అంటున్నారు. మిడ్ టర్మ్లో పసిడి రూ.56,000 స్థాయిని దాటవచ్చునని లేదా 2075 స్థాయికి చేరుకోవచ్చునని అంటున్నారు.