Gold Price today: జోబిడెన్ వ్యాఖ్య ఎఫెక్ట్, పసిడి ఇన్వెస్టర్లు అప్రమత్తం
ఒమిక్రాన్ ప్రభావంతో గతవారం చివరలో భారీగా పెరిగిన బంగారం ధరలు ఈ వారం దాదాపు స్థిరంగా కనిపిస్తున్నాయి. ఆయా దేశాలు కొత్త వేరియంట్ కట్టడికి కఠిన చర్యలు తీసుకున్న నేపథ్యంలో పసిడి పైన ప్రభావం చూపింది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో రూ.48,000 క్రాస్ చేస్తుందని, అంతర్జాతీయ మార్కెట్లో 1800 డాలర్లు దాటుతుందని భావించినప్పటికీ ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు అయితే రూ.62,000 దిగువకు పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో 23 డాలర్ల వద్ద ఉన్నాయి. గోల్డ్ ఫ్యూచర్స్ నేడు (నవంబర్ 30 మంగళవారం) ప్రారంభ సెషన్లో స్వల్పంగా తగ్గినప్పటికీ ఆ తర్వాత కాస్త పుంజుకున్నాయి.
స్వల్పంగా తగ్గి, పెరిగిన బంగారం ధర
డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి ప్రారంభ సెషన్లో రూ.177 ఎగిసి రూ.47,764 వద్ద, ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.47,967 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్లో గోల్డ్ ఫ్యూచర్స్ 4.75 డాలర్లు లాభపడి 1790 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఇక సిల్వర్ ఫ్యూచర్స్ డిసెంబర్ రూ.158 పెరిగి రూ.61,798 వద్ద, మార్చి ఫ్యూచర్స్ రూ.43 లాభపడి రూ.62,479 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్ ఫ్యూచర్స్ 0.413 డాలర్లు పెరిగి 23.265 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.
మద్దతు ధర
ఈ వారం బంగారం ధరల్లో స్వల్ప తేడాలు మినహా దాదాపు స్థిరంగా ఉన్నాయి. బంగారాన్ని రూ.48,000 టార్గెట్ ధరతో రూ.47,700 వద్ద కొనుగోలు చేయవచ్చునని, అలాగే, సెల్ జోన్ రూ.47,300 దిగువ, టార్గెట్ ధర రూ.47,000గా సూచిస్తున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 1795 డాలర్లు దాటితే మరింత పెరిగే అవకాశముందన,ి 1780 డాలర్లకు దిగువకు వస్తే ఆ తర్వాత 1753 డాలర్లకు క్షీణించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. క్రితం సెషన్లో గరిష్టం 1799 డాలర్లు, కనిష్టం 1780 డాలర్లు. క్రితం వారంలో గరిష్టం 1849 డాలర్లు, కనిష్టం 1778 డాలర్లు. క్రితం నెలలో గరిష్టం 1813 డాలర్లు. కనిష్టం 1746 డాలర్లు.
బిడెన్ వ్యాఖ్య ఎఫెక్ట్.. అప్రమత్తమైన ఇన్వెస్టర్లు
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుందని భావించడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. దీంతో ధరలు పెరిగాయి. అయితే ఫెడ్ ఉద్దీపన, ప్రణాళికలు, వడ్డీ రేట్ల పెంపు అంశాలు ఎలా ఉంటాయనే ఆందోళనతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
అదే సమయంలో ఒమిక్రాన్ నేపథ్యంలో కోవిడ్ లాక్ డౌన్ అవసరం లేదని అమెరికా అధ్యక్షులు జోబిడెన్ ప్రకటించడంతో ఆ తర్వాత బంగారం బలాన్ని కోల్పోయిందని అంటున్నారు.
'ప్రజలంతా వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుంటే, మాస్కులు ధరిస్తే ఎలాంటి లాక్ డౌన్ అవసరం లేదు' అని బిడెన్ అన్నారు. అదే సమయంలో ఎలాంటి ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ లేవన్నారు. ఒమిక్రాన్ ప్రభావం ఏ మేరకు ఉంటుందనే వాదనల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచూతూచి వ్యవహరిస్తున్నారు.