దీపావళి నాటికి బంగారం ధరలు షాకిస్తాయా? ఎంత పెరగొచ్చు, ఎందుకు?
అంతర్జాతీయ పరిణామాలు, కరోనా మహమ్మారి, ఫెడ్ రిజర్వ్ వంటి వివిధ అంశాల కారణంగా బంగారం ధరలు నిన్న పెరిగిన విషయం తెలిసిందే. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో పసిడి 10 గ్రాములు రూ.51,500 పైనకు చేరుకుంది. వెండి ప్యూచర్స్ మాత్రం తగ్గి కిలో రూ.68,300కు పైన పలికింది. 24 క్యారెట్ల పసిడి ధరలు హైదరాబాద్, విశాఖ, విజయవాడల్లో 10 గ్రాములు రూ.53,600, 22 క్యారెట్ల పసిడి రూ.49,050 పలికింది. ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రూ.54,650, 22 క్యారెట్ల పసిడి రూ.50,100 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఔన్స్ గోల్డ్ 0.4 శాతం పెరిగి 1,951.13 డాలర్లు పలికింది.
అమెరికా కంపెనీతో వివాదానికి స్వస్తీ, డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం: అందుకే స్టాక్స్ దూకుడు
దీపావళి నాటికి పెరుగుతుందా?
కరోనా కారణంగా బంగారం ధరలు మార్చి నుండి భారీగా పెరిగాయి. రూ.40వేల దిగువన ఉన్న పసిడి ఏకంగా రూ.56వేల పైకి చేరుకుంది. ఆగస్ట్ 7వ తేదీన పసిడి ధరలు 10 గ్రాములు రూ.56,200తో ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది. ఆ తర్వాత కరోనా వ్యాక్సీన్ రావడం, ఇతర వ్యాక్సీన్ ప్రయోగాల ఫలితాలు సఫలం అవుతుండటం బంగారంపై ఒత్తిడిని తగ్గించింది. వారం క్రితం వరకు తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు, అస్ట్రాజెనికా వ్యాక్సీన్ ప్రయోగాల నిలిపివేత అనంతరం కాస్త పెరిగింది. ఈ వారంలో రెండు రోజులు తగ్గుదల నమోదు చేయగా, మిగతా రోజులు పెరిగింది. ధరలు పైకి, కిందకూ కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో దీపావళి నాటికి బంగారం ధర ఎలా ఉంటుందనే చాలామందిలో మెదులుతున్న ప్రశ్న.
రూ.3000 పెరిగే ఛాన్స్
దీపావళి పర్వదినం నాటికి బంగారం ధరలు 10 గ్రాములు రూ.2,000 నుండి రూ.3000 వరకు పెరిగే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. పండుగ సీజన్లో పసిడికి డిమాండ్ ఉంటుంది. మరోవైపు అంతర్జాతీయ హెచ్చుతగ్గుల ప్రభావం, కరోనా కేసులు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటే రూ.2000 వరకు పెరిగే అవకాశాలు కొట్టిపారేయలేమని అంటున్నారు. ప్రస్తుతం బంగారం రూ.51,600 వద్ద ఉంది. దీపావళి నాటికి రూ.54000 పైకి చేరుకోవచ్చునని అంచనా వేస్తున్నారు.
ఎందుకు పెరుగుతుంది.. తగ్గితే ఎందుకు?
ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరి కొన్నేళ్లపాటు యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. నవంబర్ నాటికి వ్యాక్సీన్ వస్తుందని ప్రకటనలు వస్తున్నాయి. అయితే ఇవి కేవలం రాజకీయ ప్రేరేపితం కావొచ్చునని, ఎందుకంటే అన్ని ప్రయోగాలు చేసి, వ్యాక్సీన్ రావాలంటే వచ్చే ఏడాది అవుతుందని చాలామంది నిపుణులు చెబుతున్నారని గుర్తు చేస్తున్నారు. నవంబర్ తర్వాత వ్యాక్సీన్ రాకుంటే బంగారం ధరలు తిరిగి పుంజుకునే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. నిజంగానే వ్యాక్సీన్ వస్తే మాత్రం బంగారంపై భారీగా ఒత్తిడి తగ్గుతుందని, ధరలు పడిపోతాయని అంటున్నారు. బంగారం ధర మరో రూ.1000 వరకు కరెక్షన్కు ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంటే యాభై వేల ఐదు వందల వద్ద స్ట్రాంగ్ సపోర్ట్ ఉందని చెబుతున్నారు.