రూ.55,000 దిశగా బంగారం ధర, త్వరలో భారీ పెరుగుదల? 10 రోజుల్లో రూ.12వేలు పెరిగిన వెండి
బంగారం, వెండి ధరలు రోజురోజుకు సరికొత్త ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా ధరలు పెరుగుతున్నాయి. సోమవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,000 దాటింది. కిలో వెండి రూ.66,400 పలికింది. ఢిల్లీలో పసిడి రూ.905 పెరిగి రూ.52,960, వెండి కిలో రూ.3,350 పెరిగి రూ.65,670కి చేరుకుంది. అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర 1939 డాలర్లకు, వెండి 24.30 డాలర్లకు చేరుకుంది. కరోనా కారణంగా తొలుత భారీగా పెరిగిన ధరలు, ఇటీవల కొద్ది రోజులు అంతగా పెరగలేదు. తిరిగి గత వారం నుండి అందనంత ఎత్తుకు పెరుగుతున్నాయి.
అమ్మో.. బంగారం: రూ.1,000 పెరిగిన పసిడి, రూ.3,500 పెరిగిన వెండి, దిద్దుబాటు ఉంటుందా?
రిటైల్ వ్యాపారుల ఆందోళన..
ఉద్దీపనలు, డాలర్ వ్యాల్యూ తగ్గడం, పలు దేశాల్లో కరోనా మరణాలు పెరగడం వంటి పలు కారణాలతో అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయి. అమెరికా-చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు కూడా కారణం. ఈ ప్రభావం దేశీయ మార్కెట్ పైన పడుతోంది. మన విషయానికి వస్తే దేశంలో పెళ్లిళ్లు, పండుగల సీజన్ ప్రారంభం అవుతోంది. ధరలు పెరగడం పట్ల రిటైల్ ట్రేడర్స్ కూడా ఆందోళనగా ఉన్నారు. ఇలా పెరుగుతుంటే కొనుగోలుకు ఆసక్తి చూపించే అవకాశాలు తగ్గిపోతాయని చెబుతున్నారు. వాస్తవానికి దేశీయంగా, అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లు ప్రస్తుత పరిస్థితుల్లో పసిడిపై పెట్టుబడులు పెడుతున్నారు. కానీ రిటైల్ వ్యాపారాలు తగ్గిపోయాయి. రిటైల్ దుకాణాల్లో కొనుగోలు చేసే సాధారణ ప్రజలు.. ధరలను చూసి భయపడుతున్నారు.
కొద్ది వారాల్లో రూ.2,000
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర కొద్ది వారాల్లోనే 2000 డాలర్లకు చేరుకోవచ్చుననిబులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. నిన్న హైదరాబాద్లో 24 క్యారెట్ల తులం బంగారం రూ.820 పెరిగి రూ.54,300, 22 క్యారెట్ల పసిడి ధర రూ.49,730కి చేరుకుంది. హైదరాబాద్లో రూ.55వేల దిశగా వెళ్తోంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.906 పెరిగి రూ.52,960, ముంబైలో ఏకంగా రూ.1,395 పెరిగి రూ.52,519కి చేరుకుంది. వెండి ఢిల్లీలో రూ.3,300కు పైగా, ముంబైలో రూ.4,600కు పైగా పెరిగింది.
10 రోజుల్లో రూ.12వేలు పెరిగిన వెండి ధర
పారిశ్రామిక కొనుగోళ్ల మద్దతుతో వెండి ధర పెరుగుతోంది. వెండి గత పది రోజుల్లో రూ.12వేలు పెరిగింది. ఈ వారం కూడా ధరల పెరుగుదల ఉండే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మార్చి వరకు స్వల్పంగా పెరుగుతూ వచ్చిన వెండి ధరలు ఆ తర్వాత ఊపందుకున్నాయి. గత వారం రోజులుగా మరీ పుంజుకున్నాయి. ప్రపంచ దేశాలు కరోనా పరమైన ఆంక్షలు సడలించే కొద్దీ పారిశ్రామిక కార్యకలాపాలు గణనీయంగా పుంజుకుంటాయనే అంచనాలు దీనికి కారణం. వెండి డిమాండ్లో అరవై శాతం వాటా వరకు పారిశ్రామికవర్గాలదే. పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను అతి విలువైన లోహాల వైపు మళ్లించడంతో ధరలు ఇలా పెరుగుతున్నాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ దీపక్ చెప్పారు.
ఇన్వెస్టర్ల ఆసక్తి..
కరోనాను తగ్గించేందుకు అమెరికా పాలక వర్గం, ఫెడ్ రిజర్వ్ అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో మిగతా కరెన్సీలతో పోలిస్తే డాలర్ వ్యాల్యూ తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల కరెన్సీలతో పోలిస్తే డాలర్ వ్యాల్యూ అధికం. అమెరికా, యూరోప్ దేశాలు పెద్ద ఎత్తున ప్యాకేజీలు ప్రకటించేందుకు సిద్ధమయ్యాయి. ఫెడ్ రిజర్వ్ ప్యాకేజీ ప్రకటన అంచనాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు బంగారంలో కరెన్సీని (పెరుగుదల) చూస్తున్నారు. ఇన్వెస్టర్లు పసిడి వైపు మొగ్గు చూస్తుండటంతో ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. బంగారం త్వరలోనే 2000 డాలర్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు.