బంగారంపై 'బిట్ కాయిన్' ఒత్తిడి, పసిడి మరింత తగ్గుతుందా?
ముంబై: గోల్డ్ ఫ్యూచర్స్ ఈ వారం అమ్మకాల ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. సిక్స్ బాస్కెట్ కరెన్సీలో డాలర్ క్రమంగా బలపడటం, బిట్ కాయిన్లోకి పెట్టుబడులు వేగంగా పెరగడం, ఈ క్రిప్టోకరెన్సీ బంగారానికి ప్రత్యామ్నాయంగా కనిపించడం వంటి వివిధ కారణాలతో పసిడి ఒత్తిడిని ఎదుర్కోవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. గతవారం బిట్ కాయిన్ వ్యాల్యూ 10,000 డాలర్లకు పైగా పెరిగి 41000 వేల డాలర్లు క్రాస్ చేసింది. ఏడాది కాలంలోనే 5వేల డాలర్ల నుండి 41వేల డాలర్లకు ఎగిసింది. ఇది పసిడిపై ప్రభావం చూపుతుంది.
పసిడిపై ఒత్తిడి
అమెరికాలో కరోనాను నియంత్రించడంలో కొత్త అధ్యక్షులు జోబిడెన్ సఫలం కావొచ్చుననే అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు కరోనా తగ్గడం, బిట్ కాయిన్ వ్యాల్యూ అంతకంతకూ పెరుగుతుండటం వంటి కారణాలతో పసిడి నుండి పెట్టుబడులు తరలిపోవచ్చునని భావిస్తున్నారు. జనవరి కాంట్రాక్ట్ ఈ వారం రూ.15,718 కంటే ఎగువకు చేరకుంటే 14,789 వరకు దిద్దుబాటుకు గురి కావొచ్చునని అంటున్నారు. ఒత్తిడికి గురైతే బంగారం రూ.48,000 దిగువకు పడిపోయే అవకాశాలు కొట్టి పారేయలేమని, అయితే ఈ వారం రూ.50000 పైకి చేరుకునే అవకాశాలు తక్కువ అంటున్నారు.
వెండి ధర ఎలా ఉండవచ్చు
వెండి మార్చి ఫ్యూచర్ రూ.67,900ను దాటితే సానుకూలంగా ఉండవచ్చునని, రూ.66,550 దిగువకు వస్తే మరింత క్షీణించి రూ.64వేల దిగువకు రావొచ్చునని భావిస్తున్నారు. ఎంసీఎక్స్ మెటల్ డెక్స్ జనవరి కాంట్రాక్ట్ రూ.14,025 కంటే ఎగువకు చేరకుంటే రూ.13,817 దిగువకు రావొచ్చు.
గతవారం భారీగా తగ్గిన బంగారం
కాగా, పసిడి కొనుగోలుదారులకు గతవారం మంచి వార్తే. బంగారం ధరలు దారుణంగా పతనమయ్యాయి. ఫ్యూచర్ మార్కెట్లో శుక్రవారం పసిడి ధరలు రూ.2వేలకు పైగా పడిపోయాయి. వెండి ధరలు అయితే రూ.70,000 స్థాయి నుండి రూ.64వేల దిగువకు చేరుకున్నాయి. గత వారంలోని 5 సెషన్లలో మూడు రోజులు ధరలు పెరగగా, రెండుసార్లు తగ్గాయి. పసిడి రూ.49,000 దిగువన ముగిసింది. మొదటి రెండు రోజులు రూ.1500 పెరిగిన బంగారం, మరుసటి రోజు రూ.1230 తగ్గింది. గురువారం స్వల్పంగా పెరిగి శుక్రవారం భారీగా తగ్గింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.7400 తక్కువగా ఉంది.