Gold investment: ఈ దీపావళికి బంగారం కొనుగోలు చేస్తున్నారా?
కరోనా నేపథ్యంలో గత ఏడాదిన్నరగా బంగారంపై పెట్టుబడులు పెరుగుతున్నాయి. భారతీయుల్లో బంగారంపై పెట్టుబడి సాధారణమే. అనాధి నుండి బంగారాన్ని ధరిస్తున్నారు. ఇది ఓ రకంగా పెట్టుబడిగా చెప్పవచ్చు. ఆర్థికంగా ఇబ్బంది తలెత్తినప్పుడు ఈ బంగారాన్ని తాకట్టు పెట్టు రుణం తీసుకుంటున్నారు. ఆ తర్వాత బంగారంపై పెట్టుబడి క్రమంగా పెరుగుతోంది. కరోనా కాలంలో స్టాక్ మార్కెట్లు కుప్పకూలడంతో ఆ సమయంలో చాలామంది ఇన్వెస్టర్లు బంగారం (ఫిజికల్/డిజిటల్), క్రిప్టో, రియాల్టీ వైపు చూశారు. బంగారం గత ఏడాది ఆగస్ట్ నెలలో ఆల్ టైమ్ గరిష్టం రూ.56200కు చేరుకుంది.
ప్రస్తుతం రూ.48,000 దిగువన ఉంది. దీర్ఘకాలానికి గాను పెట్టుబడి కోసం చాలామంది రియాల్టీతో పాటు బంగారం వైపూ చూస్తున్నారు. దీపావళి, ధనతెరాస్ సందర్భంగా బంగారం కొనుగోళ్లు పెరుగుతాయి. ఇందుకు అనుగుణంగా సెప్టెంబర్ త్రైమాసికంలో దిగుమతులు పెరిగి, డిమాండ్ కరోనా ముందుస్థాయికి చేరుకుంది.
బంగారంపై పెట్టుబడి
ఈ ధన్తెరాస్కు బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? గోల్డ్ ఆభరణాలను, గోల్డ్ కాయిన్స్ను, గోల్డ్ బార్స్ కొనుగోలు చేయవచ్చు. ఇవి మేకింగ్ వంటి అదనపు ఛార్జీలను మాత్రమే కాదు, భద్రపరిచేందుకు లాకర్ ఛార్జీలను కలిగి ఉంటాయి. స్వచ్ఛతకు సంబంధించి పూర్తి భద్రత ఉండకపోవచ్చు. అంతేకాకుండా దొంగతనానికి సంబంధించి ప్రమాదం పొంచి ఉంది. అయితే వీటిని అధిగమించేందుకు ఎలక్ట్రానిక్ పద్ధతిలో బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఆస్కారం ఉంది.
బంగారంలో పెట్టుబడులు ద్రవ్యోల్భణం సమయంలో సానుకూలతనిస్తాయి. బంగారానికి సంబంధించి మీ పోర్ట్పోలియోను పది శాతంగా కేటాయించుకోవచ్చు. గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, సావరీన్ గోల్డ్ బాండ్స్, డిజిటల్ గోల్డ్ అందుబాటులో ఉన్నాయి.
బంగారం ధరలు పెరిగే ఛాన్స్
బంగారం ధరలు వచ్చే దీపావళి నాటికి ఔన్స్కు ధర 2000 డాలర్లకు చేరుకోవచ్చునని, దేశీయంగా వచ్చే పన్నెండు నెలల కాలంలో రూ.52,000 నుండి రూ.54,000కు చేరుకోవచ్చునని అంచనా వేస్తున్నారు. ఈ దీపావళికి బంగారం ధరలు బంగారం ధరలు రూ.50,000కు దిగువనే కనిపిస్తున్నాయి.
వచ్చే దీపావళి వరకు మధ్యలో బంగారం ధరలకు రూ.42,500 వద్ద బలమైన మద్దతు కనిపిస్తోందని, ఈ స్థాయి దిగువకు పడిపోతే రూ.35,700 వద్ద మద్దతు కనిపిస్తోందని అంటున్నారు.
బంగారం డిమాండ్
అంతర్జాతీయ మార్కెట్లో ప్రత్యేకించి అమెరికాలో డాలర్, బాండ్స్ మార్కెట్ అనిశ్చితిని ఎదుర్కొంటోంది. అందుకే బంగారం ధరలు ఓ మోస్తారుగా ఉన్నాయని బులియన్ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో అమెరికా బాండ్స్ బలహీనపడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అమెరికా ఫెడ్ రిజర్వ్ తన వైఖరిని మార్చుకోనుండటమే ఇందుకు కారణం. ఒకవేళ బాండ్ల జారీ, వాటి ధరలపై ఫెడ్ రిజర్వ్ తన వైఖరిని మార్చుకుంటే కొంతకాలం బంగారం ధరలు పరుగుపెడుతుందని చెబుతున్నారు. మున్ముందు వడ్డీ రేట్లు పెరిగితే మాత్రం బంగారం డిమాండ్ తగ్గుతుందని అంటున్నారు.