EMI మారటోరియం తిరకాసు, ప్రైవేటు బ్యాంకు కస్టమర్లు కచ్చితంగా తెలుసుకోవాలి?
కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈఎంఐలపై 3 నెలల మారటోరియం సదుపాయం కల్పించాలని ఆర్బీఐ సూచించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రయివేటు బ్యాంకులు స్పందించాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు మారటోరియం అందిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. ప్రయివేటు బ్యాంకులు కూడా ముందుకు వచ్చాయి. మారటోరియం కావాలంటే లేదా వద్దనుకుంటే బ్యాంకుకు తెలియజేయాలని సూచించాయి. మారటోరియం అవసరంలేనివారు బ్యాంకులను సంప్రదించాల్సిన అవసరం లేదని తెలిపాయి.
3 నెలలు EMI కట్టక్కర్లేదు, క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించాలా? 8 కీలక అంశాలు తెలుసుకోండి
HDFC బ్యాంకు
ఈఎంఐ అవసరం లేనివారు తమను సంప్రదించాల్సిన అవసరం లేదని HDFC బ్యాంకు తెలిపింది. మార్చి 1, 2020కి ముందు రుణాలు తీసుకున్న వారు ఇందుకు అర్హులు అని తన ప్రకటనలో తెలిపింది. ఆర్బీఐ ఆదేశాల నేపథ్యంలో తాత్కాలిక ఊరట కోసం Opt-in స్కీం ప్రవేశ పెట్టినట్లు తెలిపింది. దీనిని ఎంచుకుంటే కస్టమర్ క్రెడిట్ రేటింగ్ పైన ఎలాంటి ప్రభావం చూపించదని స్పష్టం చేసింది. మారటోరియం కాలంలో వడ్డీ రేటు ఉంటుందని తెలిపింది. రుణ కాలపరిమితి పొడిగింపుకు అనుగుణంగా వడ్డీ రేటు ఉంటుందని పేర్కొంది. బహుళ రుణాలు ఉంటే ఈఎంఐ మారటోరియం వేర్వేరుగా ఉంటుందని తెలిపింది. కస్టమర్లు సాధ్యమైనంత వరకు ఈఎంఐ చెల్లింపులు చేయడమే బెట్టర్ అని హెచ్డీఎఫ్సీ బ్యాంకు సూచించింది. తద్వారా అదనపు వడ్డీ భారాన్ని, రుణ కాలవ్యవధి పొడిగింపుకు సమస్య ఉండదని తెలిపింది.
ICICI బ్యాంకు... వడ్డీ రేటు షాక్
వేతన జీవుల రుణాలపై Opt-In సదుపాయాన్ని తీసుకు వచ్చినట్లు ఐసీఐసీఐ బ్యాంకు తెలిపింది. అదే సమయంలో వ్యాపారులకు Opt-Out సదుపాయాన్ని కల్పించింది. లాక్ డౌన్ పరిస్థితుల్లో వారి వద్ద చెల్లించాల్సిన మొత్తం ఉండదన్న ఉద్దేశ్యంతో ఈ వెసులుబాటు కల్పించినట్లు పేర్కొంది. రుణాలు చెల్లించే వారు బ్యాంకుకు తెలియజేయాలని సూచించింది.
కిసాన్ క్రెడిట్ కార్డు, ఫామ్ ఎక్విప్మెంట్, స్వయం సహాయక బృందాలు, టూ వీలర్ లోన్, ఆటో డీలర్, కమర్షియల్ బిజినెస్.. ఇలా వివిధ లోన్లపై వర్తిస్తుందని తెలిపింది. మారటోరియం సమయంలో వడ్డీ రేటు ఉంటుందని షాకిచ్చింది.
కొటక్ మహీంద్రా బ్యాంకు
మారటోరియం కావాలనుకునేవాళ్లు ఈ మెయిల్ చెయ్యాలని కొటక్ మహీంద్రా బ్యాంకు ఓ మెయిల్ ఐడీని అందుబాటులోకి తీసుకు వచ్చింది. మారటోరియం కాలానికి వడ్డీని వసూలు చేస్తామని తెలిపింది. మార్చి నాటికి తీసుకున్న రుణాలపై వర్తిస్తుందని తెలిపింది. Opt-In ద్వారా మారటోరియం కావాలంటే ఎంచుకోవచ్చునని తెలిపింది. వడ్డీ రేటును వసూలు చేస్తున్నట్లు తెలిపింది. అయితే తాత్కాలిక చెల్లింపు నిలిపివేస్తే డిఫాల్టర్ పేర్కొనమని హామీ ఇచ్చింది. ఫిబ్రవరి 29, 2020 ముందుకు చెల్లింపులు జరపని వాటినే డిఫాల్టర్గా గుర్తిస్తామని తెలిపింది.
IDFC ఫస్ట్ బ్యాంకు
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు కూడా హోమ్ లోన్, పర్సనల్ లోన్, కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్, ప్రాపర్టీ లోన్, బిజినెస్ లోన్, వెహికిల్ లోన్లపై మారటోరియం అవకాశం ఇస్తున్నట్లు తెలిపింది. మారటోరియం కాలానికి గాను వడ్డీ వసూలు చేస్తామని పేర్కొంది.
ఇతర బ్యాంకులు..
మరో ప్రయివేటు బ్యాంకు యాక్సిస్ కూడా మారటోరియం అవకాశం కల్పిస్తామని తెలిపింది. అందుబాటులోకి తీసుకు రాగానే కస్టమర్లకు తెలియజేస్తామని పేర్కొంది.
ప్రయివేటు బ్యాంకుల వడ్డీ పోటు
మారటోరియం కాలానికి గాను దాదాపు అన్ని ప్రయివేటు బ్యాంకులు వడ్డీ రేటును వసూలు చేస్తున్నాయి. వీలుంటే కట్టేయడమే బెట్టర్ అని ప్రత్యక్షంగా, పరోక్షంగా సూచిస్తున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు చాలా వరకు మారటోరియం ఆప్షన్ అమలు చేస్తున్నాయి. చెల్లింపులు కొనసాగిస్తామని కస్టమర్లు ప్రత్యేకంగా తెలియజేస్తే తప్ప ఆటోమేటిక్గా మారటోరియం వర్తింప చేస్తున్నాయి.
ఆయా బ్యాంకు కస్టమర్లు ఇలా..
- మారటోరియం ఆప్షన్ ఎంచుకునేందుకు కస్టమర్లు icicibank.com ను సందర్సించాలని ఐసీఐసీఐ బ్యాంకు సూచించింది.
- HDFC బ్యాంకు, టాటా కేపిటల్, Edelweiss, బజాజ్ ఫిన్ సర్వ్, RBL బ్యాంకు, Adi's బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు, Deutsche బ్యాంకు, రతన్ ఇండియా, ఇండియా బుల్స్ నిర్దిష్ట ఈ-మెయిల్స్ ద్వారా మారటోరియం కోరవచ్చునని తెలిపాయి.
ఏప్రిల్, మే నెలలు..
మార్చి నెలలో చెల్లింపులు జరపని వారు, ఏప్రిల్, మే రెండు నెలలు మాత్రమే మారటోరియం ప్రయోజనం పొందుతారని వివిధ బ్యాంకులు తెలిపాయి. ప్రయివేటు రంగ బ్యాంకులు అన్నీ వడ్డీ వేస్తున్నందున చాలామంది కస్టమర్లు మారటోరియం వద్దనుకునే వారు ఉంటున్నారు.
రుణ వ్యయం పెరుగుతుంది..
పరిస్థితి బాగుంటే చెల్లింపులు జరపడమే బెట్టర్ అని భావిస్తున్నారు. లేదంటే వడ్డీ పోటు ఉంటుంది. మొత్తంగా గుర్తించాల్సిన విషయం ఏమంటే ఈ మూడు నెలల మారటోరియం కాలానికి గాను వడ్డీ రేటు వెంటనే చెల్లించనప్పటికీ రుణ వ్యయం పెరుగుతుంది.