ఇదీ EMI మారటోరియం లెక్క! చెల్లింపుల కోసం 3 ఆప్షన్స్... ప్రయోజనం ఎవరికి?
కరోనా మహమ్మారి నేపథ్యంలో లోన్లు తీసుకున్న వారికి ఆర్బీఐ మరోసారి ఊరట కలిగించింది. మార్చి 27వ తేదీన తొలివిడత మారటోరియం మూడు నెలలు ప్రకటించింది. నిన్న (మే 22) దానిని మరో మూడు నెలలు పొడిగించింది. తొలుత మార్చి, ఏప్రిల్, మే నెలలకు, ఇప్పుడు జూన్, జూలై, ఆగస్ట్ నెలలకు ఈఎంఐ చెల్లింపులు వాయిదా వేసుకునే వెసులుబాటు కల్పించింది కేంద్ర బ్యాంకు. మారటోరియం ఎంచుకున్న వారికి వాయిదాల చెల్లింపు సెప్టెంబర్ 1వ తేదీ నుండి తిరిగి ప్రారంభమవుతుంది.
నెగిటివ్గా ఇండియా జీడీపీ: ఆర్బీఐ, EMI మారటోరియంపై మళ్లీ గుడ్న్యూస్
ఈ మారటోరియం లెక్క ఎలా
కరోనా నేపథ్యంలో ఇచ్చిన ఈ మా మారటోరియం వెసులుబాటు క్లిష్ట పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మారటోరియం సమయంలో చెల్లించాల్సిన వడ్డీని ఇప్పటికే ఉన్న అసలుకు కలిపి, కొత్తగా రుణ కాల వ్యవధిని నిర్ణయిస్తాయి బ్యాంకులు. అంటే అప్పుడు మీరు చెల్లించాల్సిన మొత్తం లేదా అదే ఈఎంఐతో కాలపరిమితి పెరగడం ఉంటుంది. మారటోరియం వల్ల ఈఎంఐ వాయిదా పడుతుంది. కానీ రద్దుగా పొరబడవద్దు. పైగా వడ్డీని అసలులో కలపడం వల్ల రుణ వ్యవధి భారీగా పెరుగుతుంది.
మరి ప్రయోజనం ఎలా?
చేతిలో వ్యక్తులు లేదా సంస్థలకు లిక్విడిటీ ఉంటే ఈ మారటోరియాన్ని ఉపయోగించుకోకపోవడం మంచిది. ఎందుకంటే మారటోరియం కాలంలోని వడ్డీని అసలులో కలిపడం వల్ల ఈఎంఐ పెరగడం లేదా కాల పరిమితి పెరుగుతుంది. లిక్విడిటీతో ఇబ్బందులు పడుతున్న వారికి ఇది కొంతలో కొంత ఊరట. సంస్థలు, వ్యక్తుల చేతుల్లో ప్రస్తుత పరిస్థితుల్లో లిక్విడిటీ పెరుగుతుంది. కరోనా వల్ల ఆదాయం తగ్గిన వారికి, పూర్తిగా ఆదాయం లేని వారికి కాస్త ఉపయోగం. దీర్ఘకాలంలో మాత్రం భారం తప్పదు. అందుకే చాలామంది మారటోరియంకు నో చెబుతున్నారు. లిక్విడిటీ సమస్య ఉన్నవారు మాత్రమే దీనిని ఉపయోగించుకుంటున్నారు. ఇలాంటి వారికి ఉపయోగం ఏమంటే క్రెడిట్ స్కోర్ దెబ్బతినదు.
టర్మ్ రుణాలుగా మార్పు
ఈ ఆరు నెలల ఈఎంఐ బకాయిలను బ్యాంకులు కొత్త టర్మ్ రుణాలుగా మార్చేందుకూ ఆర్బీఐ అనుమతిచ్చింది. వర్కింగ్ క్యాపిటల్ రుణాలకు కూడా వర్తిస్తుంది. అయితే టర్మ్ రుణాలుగా మార్చినా వర్కింగ్ క్యాపిటల్ ఈఎంఐను కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరం (2020-21)లోపు చెల్లించాలని తెలిపింది.
మారటోరియం తర్వాత మూడు రకాలుగా చెల్లింపులు..
హోమ్ లోన్ ఈఎంఐ చెల్లింపులకు ఆర్బీఐ ఆరు నెలల పాటు మారటోరియం రూపంలో వెసులుబాటు కల్పించింది. ఈ ఈఎంఐలు వసూలు చేసుకునేందుకు బ్యాంకులకు మూడు ఆప్షన్స్ ఇచ్చింది. ఒకటి మారటోరియం ముగిసిన వెంటనే ఆరు నెలల వడ్డీని ఒకేసారి వసూలు చేసుకోవడం. రెండు ఆరు నెలల వడ్డీని మిగిలిన బాకీకి కలిపి మిగతా రుణ గడువులో ఈఎంఐలను పెంచుకోవడం. మూడు బకాయిలను మిగతా రుణానికి కలిపి రుణ చెల్లింపు కాల పరిమితిని పెంచి ఈఎంఐ యథావిధిగా ఉంచడం.