రోజుకు రూ.70 ఇన్వెస్ట్ చేస్తే, అయిదేళ్లకు చేతికి రూ.1.5 లక్షలు
చిన్న చిన్న మొత్తాల పొదుపు ద్వారా పెద్ద మొత్తంలో ఆర్జించవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్ వంటివి పెద్ద మొత్తంలో చేసే పెట్టుబడి. కానీ చిన్న మొత్తాలతో మంచి రిటర్న్స్ అందించే అనేక పథకాలు మార్కెట్లో ఉన్నాయి. అందుకే సరైన పెట్టుబడి సాధనాన్ని ఎంచుకోవడం ఇబ్బందికరంగా మారుతుంది. రిస్క్ తీసుకోవడం ఇష్టంలేనివారు, భద్రతతో కూడుకున్న పథకాలు కోరుకునే వారు చాలామంది ప్రభుత్వ ఆధారిత పెట్టుబడి సాధనాల వైపు దృష్టి సారిస్తారు. వీటిని పరిగణలోకి తీసుకుంటే ఇండియా పోస్ట్ అందించే సేవింగ్స్ స్కీమ్స్ ప్రజల చెక్ లిస్ట్లో కచ్చితంగా ఉంటాయి. ఇండియా పోస్ట్ ప్రారంభించిన అలాంటి ప్లాన్లలో పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ ఖాతా ఒకటి.
సురక్షిత ఆర్థిక భద్రతా పథకం
పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీంలో వడ్డీ రేటు త్రైమాసికం ప్రాతిపదికన లెక్కిస్తారు. పిల్లల పేరు మీద ఖాతా తెరువవచ్చు. పిల్లల పేరు మీద ఖాతా తెరవడం వారి సురక్షిత ఆర్థిక భవిష్యత్తుకు అండగా ఉండటమే. పిల్లల పేరు మీద ఖాతాను తెరవాలంటే చట్టపరమైన సంరక్షకుడు అయి ఉండాలి. ఈ పథకం మెచ్యూరిటీ కాలం అయిదేళ్లు.
రికరింగ్ డిపాజిట్
తల్లిదండ్రులు ఎవరైనా తమ పిల్లల పేరు మీద రికరింగ్ డిపాజిట్ను ఓపెన్ చేయవచ్చు. రోజుకు రూ.70 చొప్పున చెల్లిస్తే నెలకు రూ.2100 అవుతుంది. అయిదేళ్ల కాలంలో ఇది రూ.1,26,000 అవుతుంది. రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేటు 5.8 శాతంగా లెక్కిస్తే అయిదేళ్ళ మెచ్యూరిటీ కాలం తర్వాత దాదాపు రూ.1.5 లక్షలు చేతికి వస్తుంది. అక్షరాలా రూ.1,46,000 వస్తుంది.
రికరింగ్ డిపాజిట్ ఓపెన్ చేయడానికి ముందు...
- భారతీయులు ఎవరైనా ఈ రికరింగ్ డిపాజిట్ ఖాతాను ఓపెన్ చేయవచ్చు. సింగిల్గా లేదా జాయింట్గా ఖాతాను తెరువవచ్చు. ముగ్గురు కలిసి ఓపెన్ చేయవచ్చు.
మైనర్ పిల్లలపైన సంరక్షకులు కూడా అకౌంట్ తెరువవచ్చు. మానసికంగా బాగా లేని వంటి వారి పైన కూడా ఖాతా తెరువవచ్చు.
పదేళ్లకు పైన వయస్సు కలిగిన వ్యక్తి ఖాతాను తెరువవచ్చు.
ఇండియా పోస్ట్ వెబ్ సైట్ ప్రకారం నెలకు కనీస ఇన్వెస్ట్మెంట్ రూ.100.
అయిదేళ్ల కాలపరిమితి అయినప్పటికీ ముందస్తుగా మూడేళ్ళకు క్లోజ్ చేయవచ్చు. అలాగే, మెచ్యూరిటీ కాలాన్ని మరో అయిదేళ్లు కూడా పొడిగించుకోవచ్చు.