డెబిట్, క్రెడిట్ కార్డు ఆటోమేటింగ్ పేమెంట్ రూల్స్ ఏప్రిల్ 1 నుండి మారుతున్నాయ్..
వినిమయ సేవలకు సంబంధించి నెలవారీ బిల్లులను చెల్లించేందుకు ఆటో డెబిట్ సదుపాయాన్ని ఎంచుకుంటే ఈ వార్త మీకోసమే! రేపటి నుండి మీ చెల్లింపులు ఆగిపోయే ఆస్కారం ఉంది. ఆటో డెబిట్ పద్ధతిలో జరిపే చెల్లింపులకు సంబంధించి ఆర్బీఐ నిర్దేశించిన అడిషనల్ ఫ్యాక్టర్ అథెంటికేషన్(AFA) నిబంధనలు ఏప్రిల్ 1వ తేదీ నుండి అమల్లోకి వస్తున్నాయి. టీవీ, ఓటీటీ, ఇంటర్నెట్ రీఛార్జ్, పోస్ట్ పెయిడ్ సర్వీసులు సహా ఇతర వినిమయ సేవలకు సంబంధించి నెలవారీ బిల్లులు చెల్లించే వారు అప్రమత్తంగా ఉండాలి.
ఇలా ఆటో డెబిట్ పూర్తి
డెబిట్, క్రెడిట్ కార్డులతో జరిపే రికరింగ్ చెల్లింపులకు సంబంధించిన ఈ నిబంధనల ప్రకారం ఇకపై రూ.5 వేలకు మించి మొత్తంలో జరిగే ఆటో డెబిట్కు OTP నిర్ధారణ తప్పనిసరి. దీంతో ఆటో డెబిట్ షెడ్యూల్ తేదీకి 5 రోజుల ముందు సంబంధిత బ్యాంకు నుండి కస్టమర్లకు సమాచారం లేదా అలర్ట్ వస్తుంది. అప్పుడు OTPతో వెరిఫై చేస్తే ఆటో డెబిట్ పూర్తవుతుంది. పీపీఐ(ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్) లేదా యూపీఐ ద్వారా జరిగే రూ.5వేలకు మించిన ప్రతి ఏఆర్పీ చెల్లింపులకు కూడా ఓటీపీ తప్పనిసరి చేసింది. లేకుంటే ఆ చెల్లింపులు అనుమతించరు.
అందుకే ఇబ్బందులు
అయితే AFA నిబంధనలను అమలు చేసేందుకు బ్యాంకులు పూర్తిగా సిద్ధం కాలేదు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిబంధనల గడువును పొడిగించాలని IBA విజ్ఞప్తి చేసింది. దీనిని ఆర్బీఐ తిరస్కరించింది. దీంతో ఆటో డెబిట్ పద్ధతిలో బిల్లులు చెల్లించే కస్టమర్లకు వచ్చే నెలలో (ఏప్రిల్) ఇబ్బందులు వచ్చే అవకాశముంది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, పేమెంట్ యాప్స్ ఇంకా సన్నద్ధం కాలేదు. కొన్ని బ్యాంకులు కనీస చర్యలు చేపట్టలేదు. ఈ గడువు పొడిగిస్తుందనే అంచనాలతో ఉన్నాయి. అయితే యూపీఐలోని ఆటో పే ఫీచర్ను ఉపయోగించి రికరింగ్ చెల్లింపులు జరిపే వారికి ఇబ్బందుల్లేవు.
గతంలోనే ఉత్తర్వులు
AFAకు సంబంధించి ఆర్బీఐ గత ఏడాది డిసెంబర్ 4వ తేదీన నిబంధనలు జారీ చేసింది. తొలుత దీనిని రూ.2వేలకు పరిమితం చేయాలని భావించింది. పలు విజ్ఞప్తుల అనందరం దీనిని రూ.5వేలకు పెంచడంతో పాటు జనవరి 1కి పొడిగించింది. దీని ద్వారా ఆన్ లైన్ ద్వారా చేసే డిజిటల్ చెల్లింపులకు మరింత భద్రత ఉంటుంది. ఈ తరహా చెల్లింపుల్లో మోసాలు జరుగుతుండటంతో ఫిర్యాదులు రావడంతో AFAను తప్పనిసరి చేస్తూ ఆర్బీఐ ఈ చర్య తీసుకుంది.