రూ.266 పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర, నేటి నుండి మార్పులు ఇవే
కరోనా నిబంధనలు ఎత్తివేసిన అనంతరం ఆర్థిక రికవరీ క్రమంగా పుంజుకుంటోంది. ప్రతి నెల మారినప్పుడు కొన్ని మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. దేశవ్యాప్తంగా, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నవంబర్ 1వ తేదీ నుండి అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయి. కరోనా కారణంగా ఇన్నాళ్లు పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్, కరోనా నిబంధనలు విధించారు. వీటిని కూడా పలు రాష్ట్రాలు నేటి నుండి కాస్త ఊరటను ఇవ్వనున్నాయి. వ్యాక్సినేషన్ పెరగడం, కరోనా కేసులు తగ్గడంతో కరోనా నిబంధనలను నవంబర్ 1వ తేదీ నుండి సడలించనున్నాయి పలు రాష్ట్ర ప్రభుత్వాలు. ఇవే కాకుండా ఆర్థికపరమైన పలు మార్పులు కూడా చోటు చేసుకోనున్నాయి.
లైఫ్ సర్టిఫికెట్
ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కీలక నిర్ణయం తీసుకున్నది. లైఫ్ సర్టిఫికెట్ సమర్పించేందుకకు పెన్షన్దారులు బ్యాంకును సందర్శించే అవసరం లేకుండా వీడియో కాల్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకు వస్తోంది. నవంబర్ 1వ తేదీ నుండి ఈ సేవలను ఎస్బీఐ ప్రారంభిస్తోంది. ఇది సీనియర్ సిటిజన్స్కు పెద్ద ఊరట.
అలాగే, 80 ఏళ్ల లోపు పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్ లేదా జీవన్ ప్రమాణ్ పత్రాన్ని సోమవారం, నవంబర్ 1వ తేదీ నుండి సమర్పించవచ్చు. గడువు ఈ నెలాఖరు వరకు ఉంది. పెన్షనర్లకు ఇది ప్రయోజనకరమైనది. దీని వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ను పొందవచ్చు. అలాగే, పెన్షన్దారు మరణించిన తర్వాత పెన్షన్ పంపిణీ నిలిపివేసేందుకు అవసరం.
బ్యాంక్ ఆఫ్ బరోడా
నవంబర్ 1వ తేదీ నుండి బ్యాంక్ ఆఫ్ బరోడా ఛార్జీ వసూలుకు సిద్ధమైంది. నెలలో మూడు కంటే ఎక్కువసార్లు సొమ్మును డిపాజిట్ చేస్తే రూ.40 చార్జీ చెల్లించాలి. నెలలో మూడు కంటే ఎక్కువసార్లు నగదును ఉపసంహరణ చేసుకుంటే రూ.100 చెల్లించాలి. అయితే ఉపసంహరణకు సంబంధించి ఏటీఎం మినహాయింపు ఉంది. జన్ ధన్ అకౌంట్లకు కూడా వర్తించదు. బ్యాంక్ ఆఫ్ బరోడా బాటలోనే బ్యాంక్ ఆఫ్ ఇండియా, PNB, యాక్సిస్, సెంట్రల్ బ్యాంకులు ఛార్జీల వసూలుకు సన్నద్ధమవుతున్నాయి.
కమర్షియల్ అప్, డొమెస్టిక్ అదే ధర
దీపావళి పర్వదినంకు ముందు కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర మరో రూ.266 పెరిగింది. దేశీయ చమురు సంస్థలు కస్టమర్లకు ఒకటో తేదీన గట్టి షాకిచ్చాయి. సిలిండర్ ధరను మరోసారి పెంచాయి. వాణిజ్య సిలిండర్పై రూ.266 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.2000 దాటింది. అయితే ఇళ్లల్లో ఉపయోగించే డొమెస్టిక్ సిలిండర్ ధరను పెంచకపోవడం గమనార్హం.
రైల్వే మార్పులు
భారతీయ రైల్వేలు దేశవ్యాప్తంగా రైళ్ల టైమ్ టేబుల్ను మార్చుతున్నాయి. అక్టోబర్ ప్రారంభంలో రాజస్థాన్లోని నాలుగు డివిజన్లలో నడిచే 100 రైళ్ల షెడ్యూల్ను రైల్వేలు మార్చాయి. నివేదిక ప్రకారం సోమవారం నుండి ప్రత్యేక రైళ్ల వేళలను మార్చే అవకాశం కనిపిస్తోంది. దీపావళి, చాత్ పండుగ నేపథ్యంలో నేటి నుండి పలు ప్రత్యేక రైళ్లు ప్రారంభం కానున్నాయి.
వాట్సాప్
పాత ఫోన్స్ను ఉపయోగించే యూజర్లకు వాట్సాప్ తన సేవల్ని నిలిపి వేస్తోంది. నవంబర్ 1వ తేదీ నుండి కొన్ని పాత ఫోన్లలో వాట్సాప్ పని చేయదు. ఆండ్రాయిడ్ 4.0.3, IOS 9, కాయ్ 2.5.1 వర్షన్ OSలతో పాటు వాటికి ముందు OSలతో పనిచేసే ఆండ్రాయిడ్, యాపిల్, ఫీచర్ ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోతాయి. ఇందుకు సంబంధించి ఫోన్ మోడల్స్లో జాబితాను వాట్సాప్ ఇప్పటికే విడుదల చేసింది.