ఉద్యోగులకు గుడ్న్యూస్, డీఏ పెంపు ప్రభావం ఎలా ఉంటుందంటే?
ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్దారులకు కేంద్ర ప్రభుత్వం గురువారం శుభవార్త చెప్పింది. డియర్నెస్ అలవెన్స్(DA)ను మూడు శాతం పెంచింది. ఇప్పటి వరకు ఇది 28 శాతంగా ఉంది. ఇప్పుడు ఈ డీఏను 31 శాతానికి పెంచింది కేంద్రం. ఈ మేరకు కేంద్ర కేబినెట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్ (DA), డియర్నెస్ రిలీఫ్ (DR)ను 3 శాతం పెంచి, ప్రాధమిక వేతనం/పెన్షన్లో 31 శాతానికి పెంచడం గమనార్హం.
దీంతో 2022 మార్చి నాటికి కేంద్ర ఖజానాపై దాదాపు రూ. 7,100 కోట్ల భారం పడుతుంది. సవరించిన DA/DR జులై 1, 2021 నుండి చెల్లిస్తారు. ఈ సవరించిన DA/DR వల్ల 47.14 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.62 లక్షల పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుంది.
అప్పుడు నిలిచిన డీఏలు
దీపావళి పండుగకు ముందు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏ పెంపు శుభవార్తను అందించింది. కరోనా పరిస్థితుల దృష్టా జనవరి 1వ తేదీ, 2020, జులై 1వ తేదీ, 2020, జనవరి 1వ తేదీ, 2021లో చెల్లించాల్సిన మూడు అదనపు DA/DR నిలిచిపోయాయి. కరోనా సమయంలో 2020-2021లో నిలిచిన మూడు అదనపు డీఏ వాయిదాలను గత జూలై నెలలో అందించింది.
ఈ సంవత్సరం జులై 14వ తేదీన కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం DA/DRని 11 శాతం పాయింట్లు పెంచి ప్రాథమిక వేతనం, పెన్షన్లో 28 శాతం వరకు పెంచింది. దీంతో 2021 జులై నుండి 2022 మార్చి వరకు కేంద్ర ఖజానాకు అదనంగా రూ. 25,800 కోట్లు ఖర్చవుతుంది.
ద్రవ్యోల్భణాన్ని ఎదుర్కోవడానికి..
పెరుగుతున్న ద్రవ్యోల్భణాన్ని ఎదుర్కోవడంలో ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏ సహకరిస్తుందని భావిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో డియర్నెస్ అలవెన్స్, డియర్నెస్ రిలీఫ్ను పెంచినట్లు కేబినెట్ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఏడో వేతన సవరణ సంఘం అమోదించిన ఫార్ములాకు అనుగుణంగా వీటిని పెంచింది. డీఏ, డీఆర్ పెంపు నిర్ణయంతో 47.14 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 68.62 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుంది.
ఇదీ డీఏ లెక్క
ఇదివరకు జూన్ నెలలో కేంద్రం డీఏ, డీఆర్ను 11 శాతం పెంచి, ప్రాథమిక వేతనం/బేసిక్లో 28 శాతం పెంచింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ప్రాథమిక వేతనంలో 31 శాతం లెక్కిస్తారు. తాజా డీఏ పెంపును ఇలా చూద్దాం..
ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ప్రాథమిక వేతనం నెలకు రూ.40,000 అనుకుంటే, సవరించిన రేటు ప్రకారం 40,000 వేతనంలో 31 శాతాన్ని డీఏగా పొందుతారు. అంటే రూ.12,400 వస్తుంది. గతంలో ఇచ్చిన 28 శాతం డీఏ ప్రకారం 11,200 పొందుతారు. కాబట్టి తాజాగా సవరించిన డీఏతో రూ.1200 అదనంగా వస్తుంది.