కరోనా సమయంలోను... 6 నెలల్లో ఆకాశానికెగిసి, 6 రోజుల్లో పాతాళానికి పడ్డాయి!
ముంబై: స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరు రోజులుగా నష్టాల్లో ముగిశాయి. ఈ ఆరు సెషన్లలో సెన్సెక్స్ 2,750 పాయింట్ల మేర నష్టపోగా, ఇన్వెస్టర్ల సంపద రూ.11 లక్షల కోట్లకు పైగా హరించుకుపోయింది. ఈరోజు సెన్సెక్స్ 1,114.82 పాయింట్లు(2.96%) పతనమై 36,553.60 పాయింట్ల వద్ద, నిఫ్టీ 326.40 పాయింట్లు (2.93%) పడిపోయి 10,805.50 వద్ద ముగిసింది. ఆర్థిక పునరుద్ధరణ అనిశ్చితులు, వైరస్ వ్యాప్తి పెరుగుదల వంటి వివిధ అంశాలు మార్కెట్ నష్టాలకు కారణంగా మారాయి. ఐరోపా దేశాల్లో మళ్లీ లాక్ డౌన్ వార్తలు, అమెరికా ఉద్దీపన ఆలస్యం ఈక్విటీ మార్కెట్లపై ప్రభావం చూపాయి. స్టాక్స్ అన్నీ భారీగా నష్టాల్లో ఉన్నాయి. గత ఆరునెలల కాలంలో భారీగా లాభపడ్డ కొన్ని స్టాక్స్, ఈ ఆరు రోజుల్లో కుప్పకూలాయి.
ఎగిసి'పడిన' జీఎంఎం, అలోక్
- జీఎంఎం పీఫడ్లర్ స్టాక్స్ ఈ 6 సెషన్లలో 30 శాతం మేర నష్టపోయాయి. ఎంఎన్ఎసీ స్టాక్లలో వరుసగా ఏడు సెషన్లలో నష్టపోయింది. అదే సమయంలో ఈ స్టాక్ కరోనా - లాక్ డౌన్సమయంలో భారీగా ర్యాలీ చేసింది. మార్చి 24వ తేదీ నుండి సెప్టెంబర్ 16వ తేదీ మధ్య ఈ స్టాక్ 176 శాతం ఎగిసింది. అధిక వ్యాల్యుయేషన్, ఆఫర్ ఫర్ సేల్ 33 శాతం డిస్కౌంట్ ఇవ్వాలన్న ప్రమోటర్ల నిర్ణయం నేపథ్యంలో ఈ స్టాక్ పడిపోతోంది.
- అలోక్ ఇండస్ట్రీస్ షేర్ మార్చి 24 నుండి సెప్టెంబర్ 16వ తేదీ మధ్య ఏకంగా 528 శాతం ఎగిసిపడింది. సెప్టెంబర్ 16వ తేదీన రూ.31కి పైగా ఉన్న స్టాక్ ధర ఇప్పుడు రూ.23.30 శాతానికి పడిపోయింది. ఈ ఆరు సెషన్లలో 26 శాతం క్షీణించింది.
ఎడెల్వీస్, వొడాఫోన్ ఐడియా డౌన్..
- ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ఝున్వాలాకు 1.19 శాతం వాటా కలిగిన ఎడెల్వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్ మార్చి 24 నుండి సెప్టెంబర్ 16 మధ్య భారీగా లాభపడింది. కానీ ఈ 6 సెషన్లలో 24 శాతం క్షీణించింది.
- వొడాఫోన్ ఐడియా(వీఐ) మార్చి నుండి సెప్టెంబర్ 16వ తేదీ మధ్య 243 శాతం లాభపడింది. కానీ సెప్టెంబర్ 16వ తేదీ నుండి ఈ ఆరు సెషన్లలో 22 శాతం నష్టపోయింది. ఏజీఆర్ డ్యూస్ ప్రభావం ఈ షేర్ పైన ఎక్కువగా పడింది.
ఈ షేర్లు భారీగా డౌన్
- ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్ ధర మార్చి నుండి సెప్టెంబర్ 16 మధ్య భారీగా లాభపడింది. కానీ ఈ ఆరు రోజుల్లో 18 శాతం క్షీణించింది.
- ఝున్ఝున్వాలా వాటాలు కలిగిన దిష్మాన్ కార్బోజెన్ అమ్సీస్ షేర్ మార్చి 24 నుండి సెప్టెంబర్ 16 మధ్య 228 శాతం ఎగిసిపడగా, ఇప్పుడు 18 శాతం క్షీణించింది.
- వీటితో పాటు ఎసెల్ ప్రోప్యాక్, వీఏ టెక్ వాబాగ్, డిష్ టీవీ ఇండియా, జిందాల్ స్టీల్ అండ్ పవర్, టాటా మోటార్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ, ఏగీస్ లాజిస్టిక్స్ తదితర సంస్థలు కూడా ఈ ఆరు సెషన్లలో రెండంకెల శాతం నష్టాన్ని చవిచూశాయి. కొన్ని 100 శాతం నుండి 380 శాతం పడిపోయాయి.
కొనుగోళ్లు వాయిదా..
కరోనా మహమ్మారి నేపథ్యంలో అత్యవసరం కాని వస్తువుల కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారు. ఇందులో జ్యూవెల్లరీ(53.5 శాతం), టీవీలు/వాషింగ్ మిషన్/ఫ్రిడ్జ్లు/ఎసీలు (47శాతం), 2 వీలర్స్ (40 శాతం), కార్లు (37.6 శాతం), పేయింటింగ్ హోమ్స్ (30 శాతం) కొనుగోళ్లు క్షీణించినట్లుగా ఓ సర్వేలో వెల్లడైంది. 33.7 శాతం మంది తాము ఇంటిని కొనుగోలు చేయాలనుకున్నామని, కానీ కరోనా కారణంగా వాయిదా వేసుకున్నట్లు తెలిపారు. దీంతో ఈ రంగాలకు చెందిన షేర్లతో పాటు వివిధ కారణాల వల్ల స్టాక్స్ నష్టపోతున్నాయి.