ATM cash withdrawal: జనవరి 1 నుండి ఏటీఎం క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఛార్జీలు పెరుగుతాయ్!
2022 జనవరి 1(వచ్చే నెల) నుండి ఏటీఎం నుండి నగదు ఉపసంహరించుకునే వారికి షాక్! పరిమితికి మించి చేసే ఏటీఎం ట్రాన్సాక్షన్స్ పైన విధించే ఛార్జీలు వచ్చే నెల నుండి పెరగవచ్చు. ఏటీఎం వద్ద నెలవారీగా బ్యాంకులు అందిస్తున్న ఉచిత పరిమితికి మించజి నగదు, నగదురహిత ట్రాన్సాక్షన్స్కు విధించే ఛార్జీలను జనవరి 2022 నుండి పెంచేందుకు ఆర్బీఐ ఈ ఏడాది జూన్ నెలలో అనుమతించింది. ఆర్బీఐ మార్గదర్శకాల మేరకు యాక్సిస్ బ్యాంకు లేదా ఇతర బ్యాంకు ఏటీఎంల వద్ద ఉచిత పరిమితిని దాటి ట్రాన్సాక్షన్స్ నిర్వహిస్తే జనవరి 1, 2022 నుండి ట్రాన్సాక్షన్ ఛార్జీ రూ.21 ప్లస్ జీఎస్టీ వర్తిస్తుందని యాక్సిస్ బ్యాంకు తెలిపింది.
నెలవారి పరిమితికి మించి ఏటీఎం వద్ద చేసే ప్రతీ ట్రాన్సాక్షన్కు ప్రస్తుతం రూ.20 ఛార్జ్ చేస్తున్నారు. అధిక ఇంటర్చేంజ్ ఫీజు భర్తీ చేసేందుకు, అలాగే సాధారణ ఖర్చులు పెరగడంతో కస్టమర్ ఛార్జీలను పెంచేందుకు బ్యాంకులను అనుమతిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది.
బ్యాంకు ఖాతాదారులు తమ సొంత బ్యాంక్ ఏటీఎంల నుండి ప్రతి నెలా అయిదు ఉచిత ట్రాన్సాక్షన్ (ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలతో సహా), ఇతర బ్యాంక్ ఏటీఎంలలో మెట్రో నగరాలలో మూడు, నాన్-మెట్రో నగరాలలో అయిదు ఉచిత ట్రాన్సాక్షన్స్ చేయవచ్చు. ఇది కాకుండా, ఆర్థిక ట్రాన్సాక్షన్స్ కోసం ప్రతి ట్రాన్సాక్షన్కు ఇంటర్చేంజ్ ఫీజును రూ.15 నుండి రూ.17కు, ఆర్థికేతర ట్రాన్సాక్షన్కు రూ.5 నుండి రూ.6 వరకు పెంచేందుకు కూడా సెంట్రల్ బ్యాంక్ అనుమతించింది. ఇది ఆగస్ట్ 1, 2021 నుంచి అమలులోకి వచ్చింది.