9 నెలల్లో భారీ షాకివ్వనున్న బంగారం, ఎంత పెరగవచ్చంటే? హైదరాబాద్లో రూ.51,000 క్రాస్
కరోనా మహమ్మారి దెబ్బతో బంగారం ధర 10 గ్రాములకు బుధ, గురువారాల్లో దేశ రాజధాని ఢిల్లీలో రూ.50,392, అంతకు పైన పలికింది. ఇది జీవనకాల గరిష్టం. ముంబైలో జవేరీ బజార్లో నూ రూ.48,925కు చేరుకుంది. ట్యాక్స్లు, జీఎస్టీలతో కలిపి రూ.50వేలు దాటింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.51వేలు దాటింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX) ఆగస్ట్ ఫ్యూచర్స్ ఓ సమయంలో రూ.49 వేలు దాటింది. గత ఏడాది మందగమనం, ఈ ఏడాది కరోనా కారణంగా బంగారంపై ఒత్తిడి పెరింది.
బంగారం పరుగులు: ఒక్కరోజే భారీగా పెరిగిన ధరలు.. ఆ భయాలతో ఆల్ టైమ్ హైకి
పెరుగుదలకు కారణాలు
కరోనా భయాలు ఏమాత్రం తగ్గడంలేదు. మెడిసిన్ లేదా వ్యాక్సీన్ వస్తోందనే వార్తలు, ఆర్థికవ్యవస్థలు కోలుకునే అంశానికి సంబంధించి ఆధారపడి అప్పటికి అప్పుడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గినప్పటికీ ఆ వెంటనే మళ్లీ పెరుగుతున్నాయి. దీనికి తోడు చైనా-అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. మన దేశంలో లాక్ డౌన్ ఊహాగానాలు, కరోనా కేసులు బంగారం సెంటిమెంట్ను బలపరుస్తున్నాయి.
బంగారం ధరలు తిరిగి తగ్గుతాయా?
బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ దీనిని సామాన్యులు కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ధరలు పెరుగుతున్న కొద్ది కాస్త దూరం జరుగుతున్నారు. కరోనా తర్వాత తగ్గుతాయేమో అనే ఆశలు వారిలో ఉన్నాయి. కానీ రోజురోజుకు పెరుగుతున్న ధరలను చూస్తే మళ్లీ రూ.48వేల లోపుకు వచ్చే పరిస్థితులు అంతగా కనిపించడం లేదు. అయితే ఈక్విటీ మార్కెట్లను ఓ కంట కనిపెడుతూనే ఇన్వెస్టర్లు బంగారంలో మరిన్ని పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
ఆరు నెలల్లో మరో 10 శాతం పెరుగుదల
పసిడి ధరలు రానున్న ఆరు నెలల నుండి తొమ్మిది నెలల మధ్యకాలంలో మరో 10 శాతం ర్యాలీ అయ్యే అవకాశం ఉందని కొటక్ మహీంద్రా బ్యాంకు గ్లోబల్ ట్రాన్సాక్షన్స్ బ్యాంకింగ్ హెడ్ శేఖర్ బండారీ అన్నారు. బుధవారం రూ.50వేలు దాటింది. ఈ లెక్కన డిసెంబర్ నుండి వచ్చే ఏడాది మార్చి నాటికి రూ.55వేలకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏడాది ప్రాతిపదికన బంగారం 40 శాతానికి పైగా పెరిగింది.
హైదరాబాద్లోరూ.51 వేలు దాటిన పసిడి
నిన్న బంగారం ధర సరికొత్త జీవిత కాల గరిష్ఠానికి చేరుకున్నాయి. గురువారం హైదరాబాద్ మార్కెట్లో 24 కేరట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.470 పెరిగి రూ.51,460 పలికింది. కిలో వెండి ధర రూ.1,880 పెరిగి రూ.51,900కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో లోహాల ధర పెరగడమే ఇందుకు కారణం. ఢిల్లీ మార్కెట్లో 24 కేరట్ల పసిడి రూ.50,184 పలికింది. జీఎస్టీ అదనం. వెండి రూ.52,930 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లోను బంగారం ఔన్స్ 1800గా ఉంది.