Covid19: భారీగా పెరిగే ఛాన్స్, బంగారంపై ఎంత ఇన్వెస్ట్ చేయాలి, చేతిలో డబ్బూ అవసరమే
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం అతలాకుతలమవుతోంది. ఈ నేపథ్యంలో పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. బంగారంపై పెట్టుబడి పెట్టడంతో పాటు ద్రవ్యరూపంలోను దగ్గర పెట్టుకోవాలని సూచిస్తున్నారు. బంగారం ధరలు రోజు రోజుకు భారీగా పెరుగుతోన్న విషయం తెలిసిందే.
కరోనా దెబ్బ, సౌదీ-రష్యా చమురు యుద్ధం: ఇండియా బడా ప్లాన్!
30 శాతం బంగారం, 30 శాతం నగదు
మీ ఆదాయంలో లేదా దాచుకునే మొత్తంలో 30 శాతాన్ని బంగారం ఈటీఎఫ్లలో దాచుకోవాలని సూచిస్తున్నారు. అలాగే మరో 30 శాతం మొత్తాన్ని నగదు రూపంలో దగ్గర ఉంచుకోవడం మంచిదని అంటున్నారు. కరోనా మహమ్మారి ప్రభావం తగ్గే వరకు ఈ 60 శాతం కేటాయింపులు ఉండేలా చూసుకోవడం మంచిదని చెబుతున్నారు.
ఈ ఏడాది బంగారం ధరలు మరింత పెరగొచ్చు
బంగారం ధరలు ఈ ఏడాది మరింతగా పెరగవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. కరోనా మహమ్మారి, ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఇన్వెస్టర్లు బంగారం వైపు చూసే అవకాశాలు రోజు రోజుకు పెరుగుతాయి. దీంతో మరికొద్ది రోజులు పెరుగుదల ఇలాగే ఉంటుందని అంటున్నారు. 2020 చివరి నాటికి లేదా దీపావళి నాటికి బంగారం ధరలు రూ.50,000 మార్క్ చేరుకోవచ్చునని అంచనా వేస్తున్నారు.
బంగారంపై పెట్టుబడి
అడపాదడపా బంగారం నుండి పెట్టుబడులు వెనక్కి తీసుకున్నప్పటికీ ఇన్వెస్టర్లు బంగారం వంటి అతి ఖరీదైన లోహాలను పెట్టుబడుల స్వర్గధామంగా భావిస్తారు. కరోనా నేపథ్యంలో వచ్చే రెండు మూడు నెలల్లో రూ.47వేలకు, ఏడాది చివరకు రూ.50వేలకు చేరుకుంటుందనే భావిస్తున్నారు. అయితే కరోనా ప్రభావం, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్, ఆయా దేశాల ప్రభుత్వాల ఆర్థిక ప్యాకేజీపై కూడా ఇది ఆధారపడి ఉంటుంది.
బంగారంపై ఒత్తిడి
దాదాపు గత రెండేళ్లుగా అంతర్జాతీయ పరిణామాలు బంగారంపై ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి. 2018 చివరలో అమెరికా -చైనా ట్రేడ్ వార్, ఆ తర్వాత మందగమనం, చమురు ధరలు, ఇప్పుడు కరోనా ప్రభావం,.. ఇలా బంగారంపై గత కొన్నాళ్లుగా ఒత్తిడి కనిపిస్తోంది. దీంతో ఏడాది కాలంలోనే బంగారం ధర ఏకంగా రూ.10,000 వరకు పెరిగింది.