Akshaya Tritiya 2021: ఆన్లైన్లో పసిడిపై పెట్టుబడి మార్గాలు
భారతదేశంలో పురాణకాలం నుండి బంగారం సంపదకు చిహ్నంగా ఉంది. ఇన్ఫర్మేషన్ ఏజ్లో పెట్టుబడి సాధనంగా ఉపయోగించుకుంటున్నారు. ఇది వరకు బంగారం అంటే ఆభరణాలు లేదా నగల కొనుగోళ్లకు మాత్రమే పరిమితం. కానీ ఇప్పుడు బంగారం కొనుగోలుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. విస్తృత అవకాశాలు ఉన్నాయి. బంగారంలో పెట్టుబడులు పెట్టడానికి గోల్డ్ ఈటీఎఫ్లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, ఈ-గోల్డ్ మొదలగు ఎన్నో ఉన్నాయి. మీరు బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తే కనుక వివిధ మార్గాలు ఉన్నాయి. ఆన్ లైన్ ద్వారా కూడా బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చు.
డిజిటల్ బంగారం
ఇటీవల డిజిటల్ బంగారంపై పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఇది ఆన్ లైన్ ద్వారా మాత్రమే స్టోర్ అయి ఉంటుంది. బంగారం బరువు లేదా మీరు చేసే ఖర్చు ఆధారంగా డిజిటల్ రూపంలో ఉంటుంది. ఫోన్ పే, పేటీఎం, సేఫ్ గోల్డ్, గూగుల్ పే, మోబిక్విక్తో పాటు ఇతర మొబైల్ యాప్స్, ఆన్ లైన్ బ్యాంకింగ్ యాప్స్, వెబ్ సైట్స్ డిజిటల్ గోల్డ్ను ఆఫర్ చేస్తున్నాయి. డిజిటల్ గోల్డ్ భద్రతతో కూడినది. డిజిటల్ గోల్డ్ వెంటనే కొనుగోలుకు, వెంటనే విక్రయించడానికి ఉపయోగపడుతుంది.
గోల్డ్ ఈటీఎఫ్
ఎక్కువగా సమయం వెచ్చించలేని వారికోసమే గోల్డ్ ఈటీఎఫ్ లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని అనేక మ్యూచువల్ ఫండ్ సంస్థలు, బ్యాంకులు, ప్రయివేటు ఆర్ధిక సంస్థలు అందుబాటులోకి తెచ్చాయి. గోల్డ్ ఈటీఎఫ్లలో పారదర్శకత ఉంటుంది. ధరల్లో ఎలాంటి దాపరికాలు ఉండవు. మోసానికి తావుండదు. గోల్డ్ ఈటీఎఫ్లలో కల్తీ గురించిన ఆందోళన ఉండదు. మనం కొనుగోలు చేసే గోల్డ్ ఈటీఎఫ్ లు ఎలక్ట్రానిక్ రూపంలో ఉంటాయి. మార్కెట్ రేటు ఆధారంగానే వీటి ధరలు ఉంటాయి. ఒక యూనిట్ గోల్డ్ ఈటీఎఫ్ ఒక గ్రాము బంగారానికి సమానం.
కనీసం ఒక యూనిట్ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మీరు కొనుగోలు చేసిన బంగారం విలువను ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. అవసరమైతే వెంటనే విక్రయించి నగదు రూపంలోకి మార్చుకోవచ్చు. బంగారాన్ని కొనుగోలు చేయడం, విక్రయించడం, నిల్వ చేయడానికి వెచ్చించే మొత్తం కన్నా గోల్డ్ ఈటీఎఫ్ల కొనుగోలు అమ్మకాల వ్యయం తక్కువ.
గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్
ఓపెన్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడుదారులు ఈటీఎఫ్ ద్వారా బంగారాన్ని కొనుగోలు చేస్తారు. ఈ బంగారం మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టడానికి డిమాట్ ఖాతా అవసరం. ఈ నిధులు ఎన్ఏవి ఆధారంగా విలువను కలిగి ఉంటాయి. ఇవి ట్రేడింగ్ ముగింపులో వెల్లడి అవుతుంది. బంగారు మ్యూచువల్ ఫండ్ల నుంచి రాబడి కాలానుగుణంగా ఉంటుంది. గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫరింగ్ ప్లాట్ ఫామ్స్ను సంప్రదించవచ్చు. కేవైసీ అనంతరం వీటిలో పెట్టుబడులు పెట్టవచ్చు.
సావరీన్ గోల్డ్ బాండ్
భౌతిక బంగారం డిమాండును తగ్గించడం, దేశీయ పొదుపులో కొంత భాగాన్ని బంగారం కొనుగోలుకు ఉపయోగించే ఆర్థిక పొదుపుగా మార్చాలనే లక్ష్యంతో సావరీన్ గోల్డ్ బాండ్స్ పథకాన్ని నవంబర్ 15వ తేదీన కేంద్రం ప్రారంభించింది.