ఏది రిస్క్.. ఏది బెస్ట్: పెట్టుబడి పెట్టేందుకు 10 సులభ మార్గాలు...
చాలామందికి ఎంత సంపాదించినా ఏమీ వెనకేసినట్లుగా కనిపించదు. ఓ ఇల్లు కొనుగోలు చేయాలని, కారు తీసుకోవాలని, పిల్ల భవిష్యత్తు కోసం కూడ బెట్టాలని.. ఇలా ఎన్నో ఆశలు ఉంటాయి. కానీ వేతనం ఎంత వస్తున్నా ఖర్చులు అంతగా కనిపించకున్నా... నెల తిరిగేసరికి చేతిలో చిల్లి గవ్వ ఉండదు. అయితే సరైన ఆర్థిక ప్రణాళిక, సరైన వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తే ఆశలు నెరవేరుతాయి! ఉద్యోగ ప్రారంభ జీవితంలోనే పెట్టుబడులు పెట్టే అలవాటు చేసుకుంటే ఆర్థికంగా మంచి స్థితికి చేరుకోవచ్చు. ఆచితూచి, అన్నీ తెలుసుకొని ఇన్వెస్ట్ చేయడం మంచింది. వేటిల్లో పెట్టుబడులు పెట్టవచ్చో కొన్నింటిని తెలుసుకుందాం....
చాలామంది తెలుసుకోవాల్సిన విషయం... పీపీఎఫ్లో ఎలా ఎక్కువ లాభం
స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టినప్పుడు గుర్తించాల్సిన విషయం ఏమంటే ఇవి అస్థిరతతో కూడుకున్నవి. భారీ రిటర్న్స్ రావొచ్చు.. లేదా కుప్పకూలవచ్చు. లాంగ్ టర్మ్లో మాత్రం ప్రయోజనం అని చాలామంది భావిస్తుంటారు. మనం పెట్టిన స్టాక్ ఏదైనా దూసుకెళ్లిందంటే కొద్ది రోజుల్లోనే లక్షాదికారులు అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. కేవలం స్టాక్స్ల్లో ఇన్వెస్ట్ చేసి భారీ మొత్తంలో సంపాదించేవారు ఎందరో. అలాగే పోగొట్టుకునే వారు కూడా ఉంటారు. రిస్క్ ఎంతైనా ఫర్వాలేదు.. అనుకునే వారు ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే కొన్ని పెద్దగా రిస్క్ లేని అవకాశాలు కూడా ఉంటాయి. డీమాట్ ఖాతా తెరవడం ద్వారా ఇన్వెస్ట్ చేయవచ్చు.
మ్యూచువల్ ఫండ్స్
ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్ను డబ్బు సంపాదనకు ఉత్తమ పెట్టుబడి మార్గాల్లో ఒకటిగా చాలామంది భావిస్తున్నారు. ఇన్వెస్టర్లకు వివిధస్థాయి రిస్క్లు ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. నష్టాలు, రాబడి ఒకదానికొకటి అనులోమానుపాతంలో ఉంటాయి. దీర్ఘకాలంలో మంచి రాబడి ఉండవచ్చు. ఈక్విటీలతో పోలిస్తే ఇందులో రిస్క్ కాస్త తక్కువ.
పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం
నిర్ణీత రేటుతో స్థిరమైన ఆదాయం కోసం పోస్టాఫీస్ మంత్లీ ఇన్కం స్కీం (POMIS)లో చేరవచ్చు. ఈ పథకానికి అయిదేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. అతి తక్కువ రిస్క్ ప్రొఫైల్ కలిగి ఉంటుంది. 7.6 శాతం వడ్డీ వస్తుంది. సంప్రదాయ పెట్టుబడిదారులకు ఇది అనుకూలంగా ఉంటుంది. రూ.1500 నుంచి రూ.4,50,000 వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. జాయింట్ ఖాతా అయితే రూ.9,00,000 వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
నేషనల్ పెన్షన్ స్కీం (NPS)
పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA) ఆధ్వర్యంలోని నేషనల్ పెన్షన్ స్కీమ్ కూడా పెట్టుబడికి అనుకూలమైనది. రిటైర్మెంట్ వారిని లక్ష్యంగా చేసుకొని తీసుకు వచ్చిన స్కీం ఇది. స్థిర డిపాజిట్లు, ఈక్విటీ, కార్పోరేట్ బాండ్స్, ప్రభుత్వ ఫండ్స్, ద్రవ్య నిధుల మిశ్రమాన్ని ఇది అందిస్తుంది. ప్రభుత్వ ప్రాయోజిత పథకం కాబట్టి NPS సురక్షిత పెట్టుబడి ఎంపికగా పరిగణిస్తారు. సొంత రిస్క్ ఆధారంగా ఈ పథకంలో ఎంత పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో నిర్ణయించుకోవచ్చు. రూ.1.50 లక్షల వరకు పన్ను ప్రయోజనాలు పొందుతారు.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)
పెట్టుబడికి PPF మోస్ట్ పాపులర్ పెట్టుబడి సాధనం. పోస్టాఫీసులు, బ్యాంకుల్లో పీపీఏఫ్ ఖాతాను సులభంగా తెరువవచ్చు. ఆన్ లైన్ లో కూడా తెరిచే అవకాశం ఉంది. కనీసం రూ.500 ఇన్వెస్ట్ చేసుకునే వెసులుబాటు ఉంది. 15 సంవత్సరాల కాలపరిమితి ఉంది. పదిహేనేళ్ల తర్వాత అవసరమైతే మరో 5 ఏళ్లు పొడిగించుకోవచ్చు. పీపీఎప్ పథకంలో డబ్బు పెట్టిన వారు పన్ను మినహాయింపుకు కూడా అర్హులు. ఈ స్కీంకు 7.9 శాతం వడ్డీ రేటు ఉంది. దీని ద్వారా వచ్చే వడ్డీని పన్నుల నుంచి మినహాయించారు. చాలామందిని ఆకర్షించే పథకం ఇది.
ఫిక్స్డ్ డిపాజిట్స్ (FD)
బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. స్థిర డిపాజిట్ పెట్టుబడితో సురక్షితమైనది. డిపాజిట్ పైన ఆరు శాతం నుంచి 8 శాతం వరకు వడ్డీ ఉంటుంది. ఇతర డిపాజిట్లతో పోలిస్తే బ్యాంకు డిపాజిట్లలో వడ్డీ రేటు కాస్త తక్కువగా ఉంటుంది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద డిపాజిట్ పైన పన్ను మినహాయింపు ఉంటుంది. డెట్ ఫండ్స్ వంటి స్కీంలతో పోల్చినప్పుడు FD తక్కువ రాబడి కలిగిన పెట్టుబడి వనరు.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)
ఇది సీనియర్ సిటిజన్లకు అందుబాటులో ఉండే స్కీం. 55 ఏళ్ల వయస్సులో స్వచ్చంధ పదవీవిరమణ పొందిన వారు కూడా ఈ స్కీంలో చేరవచ్చు. ఈ స్కీం కాలపరిమితి అయిదేళ్లు. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ప్రస్తుతం 8.6 శాతం వడ్డీ ఉంటుంది. మూడు నెలలకు ఓసారి వడ్డీ చెల్లిస్తారు. ఒక సంవత్సరంలో వచ్చే వడ్డీ రేటు 10,000 మొత్తాన్ని దాటితే మూలం వద్ద పన్నుగా తీసివేయపడుతుంది. రూ.15 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ అకౌంట్స్ ఓపెన్ చేయవచ్చు. ఒక సంవత్సరంతర్వాత ముందే విత్ డ్రా చేస్తే 1.5 రేటు జరిమానా ఉంటుంది. రెండు సంవత్సరాల తర్వాత అయితే 1 శాతం విధిస్తారు.
ఆర్బీఐ ట్యాక్సబుల్ బాండ్స్
రిజర్వ్ బ్యాంక్ ట్యాక్సబుల్ బాండ్స్లలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. వీటి కాలపరిమితి ఏడేళ్లు. వడ్డీ 7.75 శాతం లభిస్తుంది. డీమ్యాట్ రూపంలో వీటిని జారీ చేస్తారు. బాండ్ లెడ్జర్ అకౌంటులో ఇవి క్రెడిట్ అవుతాయి. పెట్టుబడికి రుజువుగా సర్టిఫికెట్ ఆఫ్ హోల్డింగ్స్ను ప్రూఫ్గా ఇస్తారు. ఇందులో పెట్టుబడికి పరిమితి లేదు. భారతీయుడు ఎవరైనా వ్యక్తిగతంగా, జాయింటుగా ఇన్వెస్ట్ చేయవచ్చు.
రియల్ ఎస్టేట్
భూమి, ప్లాట్లపై పెట్టుబడి ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా మన కళ్లముందే ఎంతోమంది సంపాదించుకుంటారు. ఈ వ్యాపారంలో రెండు రకాల ఆదాయ మార్గాలు ఉంటాయి. ఒకటి కాపిటల్, రెండోది రెంటల్. ఆయా ప్రాంతాన్ని బట్టి ధరలు ఉంటాయి. అయితే పెట్టుబడిదారులు తమ పెట్టుబడిపై కచ్చితంగా ఎక్కువ పొందుతారు. అయితే అది భారీగా కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఒక్కోసారి రియల్ ఎస్టేట్ రంగం పడిపోయినప్పటికీ కాస్త వెయిట్ చేస్తే తిరిగి పుంజుకుంటుంది.
బంగారం
బంగారంపై ఏదో రకంగా పెట్టుబడి చేయడంలో భారతీయులు ముందుంటారు. భారతీయులు బంగారాన్ని ఎక్కువగా ఆభరణాలుగా ఉపయోగిస్తారు. కాబట్టి సేల్స్ ఎక్కువ. బంగారాన్ని ఆభరణంగా ఉపయోగించడంతో పాటు ఇన్వెస్ట్ కూడా చేస్తారు. ఇటీవలి కాలంలో ఇది ఎక్కువ అయింది కూడా. అంతర్జాతీయ లేదా జాతీయ మార్కెట్లలో అస్థిరత, ఆందోళన పరిస్థితులు ఉన్నప్పుడు బంగారాన్ని ఒక మంచి పెట్టుబడి మార్గంగా చూస్తున్నారు. ఇటీవల రెండు నెలల కాలంలోనే మన వద్ద బంగారం ఏకంగా రూ.6వేల వరకు పెరిగింది. ఆభరణాలతో పాటు గోల్డ్ ఈటీఎఫ్లు ఉంటాయి.