వారంతా 'సిప్' చేస్తున్నారు.... మరి మీరు?
దేశీయ స్టాక్ మార్కెట్లను చూస్తున్నారు కదా ఎలా పడుతూ లేస్తున్నాయో... ఏ రోజు మార్కెట్ పతనమవుతుందో.. ఏ రోజు పెరుగుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఇలాంటి మార్కెట్లో గమనంలో షేర్లలో పెట్టుబడులు పెట్టాలంటే సాధారణ రిటైల్ ఇన్వెస్టర్లు భయపడుతున్నారు. మార్కెట్ పతనంతో తమ పెట్టుబడులు గల్లంతు అయితే పరిస్థితి ఏమిటన్నది వారి ఆందోళన. ఇప్పటికే ఇన్వెస్టర్ల లక్షల కోట్ల సంపద ఆవిరైపోతున్నది. అయినా కొంత మంది మాత్రం తమ పెట్టుబడుల వ్యూహంలో భాగంగా క్రమానుగత పెట్టుబడి ప్లాన్లను (సిప్) నమ్ముకుంటున్నారు. అందుకే ఈ సిప్ లలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. నెలవారీగా నిర్దేశిత మొత్తంలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉన్నందువల్ల వీటిలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. తాజా గణాంకాల ప్రకారం వీరి పెట్టుబడులు మరింత పెరిగాయి.
రూ. 8,231 కోట్లు
* మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ సిప్ ల ద్వారా ఆగస్టు నెలలో రూ. 8,231 కోట్ల పెట్టుబడులను సమీకరించింది. గత ఏడాది ఇదే నెలతో (రూ. 7,658 కోట్లు) పోల్చితే ఈ పెట్టుబడులు 7.5 శాతం పెరిగాయి.
* జులై లో సిప్ పెట్టుబడులు రూ. 8,324 కోట్లు, జూన్ లో రూ. 8,122 కోట్లు, మే నెలలో రూ. 8,183 కోట్లు, ఏప్రిల్ లో రూ. 8,238 కోట్లు ఉన్నాయి.
* ఆగస్టు వరకు చూస్తే గత 12 నెలల కాలంలో సిప్ లలోకి వచ్చిన సగటు పెట్టుబడులు రూ.8,000 కోట్లుగా ఉన్నాయి.
* దేశీయ ఈక్విటీ మార్కెట్ లో తీవ్రమైన హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ సిప్ పెట్టుబడులు పెరుగుతుండటం విశేషం.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) మొదటి ఐదు నెలల్లో సిప్ పెట్టుబడుల మొత్తం రూ.41,098 కోట్లుగా ఉన్నది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో (ఏప్రిల్ - ఆగస్ట్) పెట్టుబడులు రూ. 36,760 కోట్లుగా ఉన్నట్టు భారత మ్యూచువల్ ఫండ్ అసోసియేషన్ (ఆంఫీ) గణాంకాలు చెబుతున్నాయి.
రిస్క్ తగ్గించుకునేందుకు...
* స్టాక్ మార్కెట్లో పెట్టుబడులవల్ల రాబడి రావడానికి ఎంత అవకాశం ఉందో.. పెట్టుబడులు తగ్గిపోయే రిస్క్ కూడా ఉంటుంది. మార్కెట్ టైమింగ్ రిస్క్ ను తగ్గించుకోవడానికి సిప్ లు దోహద పడుతున్నాయి. అందుకే వీటిలో పెట్టుబడులు పెరుగుతున్నట్టు పరిశ్రమ విశ్లేషకులు చెబుతున్నారు.
* ఈ నెలలో ఈక్విటీ ఫండ్స్ లో సిప్ పెట్టుబడులు పెరగడానికి అవకాశం ఉందని మార్కెట్ పరిశీలకులు చెబుతున్నారు.
* సెప్టెంబర్ త్రైమాసికం ముగుస్తుంది కాబట్టి డెట్, లిక్విడ్ ఫండ్స్ లో హెచ్చుతగ్గులు ఉండటానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇన్వెస్టర్లు ఈ విషయాన్నీ పరిశీలించాలి.
ఇదీ లెక్కా...
* గత కొన్నేళ్లుగా సిప్ లలో పెట్టుబడులు క్రమంగా పెరుగుతున్నాయి.
* 2018-19 సంవత్సరంలో రూ.92,700 కోట్లు, 2017-18 సంవత్సరంలో రూ. 67,000 కోట్లు, 2016-17 సంవత్సరంలో రూ. 43,900 కోట్ల పెట్టుబడులు సిప్ ల ద్వారా మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలోకి వచ్చాయి.
* మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలో 44 సంస్థలున్నాయి. ప్రస్తుతం సిప్ ఖాతాల సంఖ్య 2.81 కోట్ల వరకు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.
* 2019-20 ఆర్థిక సంవత్సరంలో సగటున ప్రతి నెల దాదాపు 9.39 లక్షల సిప్ ఖాతాలు జతయ్యాయి. వీటిలో సగటు పెట్టుబడి రూ. 2900 ఉంది.
* ఏక మొత్తంగా కాకుండా తక్కువ మొత్తంలో వారం, నెల లేదా మూడు నెలకు ఒకసారి పెట్టుబడులు పెట్టే సౌలభ్యం ఉండటం వల్ల ఇన్వెస్టర్లు సిప్ లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.
* సిప్ పెట్టుబడి అనేది రికరింగ్ డిపాజిట్ లాంటిదే. నచ్చినంత లేదా స్థిరంగా దీని ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు.